శుక్రవారం వచ్చిందంటే థియేటర్స్లో సందడి మాములుగా ఉండదు. మార్చి 11న శివరాత్రి కానుకగా మూడు సినిమాలు ప్రేక్షకులని అలరించనున్నాయి. ఈ మూడు సినిమాలపై అభిమానులలో మంచి క్రేజ్ నెలకొని ఉంది. శుక్రవారం సందడి చేయనున్న సినిమాల విషయానికి వస్తే శ్రీకారం, జాతి రత్నాలు, గాలి సంపత్ సినిమాలు రిలీజ్కు సిద్దమయ్యాయి. జనాల దృష్టికి ఆకర్షించేందుకు ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం సాయంత్రం వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఛీప్ గెస్ట్ గా రానున్నారని ఫన్నీ మీమ్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
ఇక శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో సరికొత్త కథతో డ్రామాగా తెరకెక్కిన చిత్రం గాలి సంపత్. ఈ సినిమాను దర్శకుడు అనిష్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించగా లవ్లీ సింగ్ హీరోయిన్ పాత్రలో అందరినీ అలరించేందుకు సిద్దమవుతున్నారు. వీరితో పాటుగా రఘుబాబు, తనికెళ్ల భరణి, సత్య, శ్రీకాంత్ అయ్యంగర్ తదితర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనీల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం 6గం.లకు జేఆర్సీ కన్వెన్షన్లో జరగనుండగా ఈ వేడుకకు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ రామ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. రెండు చిన్న సినిమాల కోసం ఇద్దరు కుర్ర హీరోలు సపోర్ట్ చేయడం గొప్ప విషయం.