భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్తున్నాయంటే దానికి భిన్నత్వంలో ఏకత్వమే కారణం. ఏమిటి ఈ భిన్నత్వంలో ఏకత్వం అంటే? వైవిధ్యభరితమైన ప్రాంతీయ సంస్కృతుల కలయిక మనకున్న వారసత్వ సంపద.
చట్టం ద్వారా దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విధానం తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది తెలిసినప్పటి నుంచి ఈ విషయం మీద కొన్ని వర్గాల్లో, ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో, ఆందోళనతో కూడిన తీవ్రమైన చర్చ జరుగుతున్న సంగతీ తెలిసిందే. ఈ చర్చ అంతా ఉమ్మడి పౌరస్మృతి మీద చట్టం చేయటానికి అనుకూలమా, ప్రతికూలమా? అన్నవిధంగా సాగుతున్నది. కానీ ఈ చర్చ ఒక ముఖ్యమైన అంశాన్ని విస్మరిస్తున్నట్టు కనిపిస్తున్నది లోతుగా ఆలోచించేవారికి. అదేమంటే చట్టం ద్వారా సామాజిక మార్పు తీసుకురావడంలో గల సాధ్యాసాధ్యాల గురించి పెద్దగా ఆలోచించకపోవటం. ఇది చాలా విచారకరం.
మన దైనందిన జీవితం మీద తీవ్ర ప్రభావం చూపే అంశాల మీద చట్టం చేయటం ద్వారా ఆశించిన ఫలితం ఏ మేరకు నెరవేరుతుందనేది అందరం లోతుగా ఆలోచన చేయాల్సిన అంశం. అటువంటి అంశం మీద నిర్లిప్తత అనర్థం. కానీ అంతటి ముఖ్యమైన అంశం మీద లోతైన ఆలోచన చేయటానికి అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలపైనా, సామాజిక వ్యవస్థలపైనా ఉన్నది. కానీ నేడు అటువంటి వాతావరణం ఉన్నదా అనేది ప్రధానమైన ప్రశ్న. దానికి లేదు అనే సమాధానం చెప్తారు ఆలోచించేవారందరూ. ఎందుకంటే అదే సత్యం కాబట్టి. ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక ఆలోచించవలసినది ఏముంటుంది? నిర్ణయానికి ముందు జరగాలి ఆలోచన అనే ప్రక్రియ. ఆ ఆలోచన ద్వారా రావాలి ఆచరణయోగ్యమైన కార్యాచరణ ప్రణాళిక. దాన్నే రూట్మ్యాప్ అనుకుందాం. కానీ ఆ విధంగా జరగటం లేదు చర్చ. అందుకే విచారకరం అంటున్నది.
జటిలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల మీద చట్టం చేసి చేతులు దులుపుకోవటం మనకు అలవాటైంది. దానివల్ల చట్టాల పుస్తకం బరువెక్కుతున్నది గానీ చట్టం ఆశించిన మార్పు సమాజంలో రావటం లేదు. దీనికి కారణం సామాజిక ధోరణి అనే ది మనిషి ఆలోచనలో లోతుగా జీర్ణించుకొని తరతరాలుగా వారసత్వంగా వస్తున్నది అనేక శతాబ్దాల నుంచి. మరి అటువంటి అంశం మీద చట్టం చేస్తే వెంటనే ఆశించిన మార్పు వస్తుందనుకుంటే అది అవివేకమే అవుతుంది. మరి సమాజం మారాలంటే ఏం చేయాలి? ఏ విషయంలో మనిషి అనుసరిస్తున్న వైఖరి లోపభూయిష్టంగా ఉన్నదన్నది సమాజం గుర్తించాలి.
సమాజం అనుసరిస్తున్న వైఖరి లోపభూయిష్టమైనదన్న విషయం సమాజం దానంతట అది గుర్తించాలి లేదా మార్పు కావాలనుకునే పాలకవర్గం వారు సమాజపు ఆలోచనలో మార్పు వచ్చేలా ప్రయత్నించాలి. ఇది వ్యవస్థా పూర్వకంగా జరగాలి కానీ వ్యక్తిపూర్వకంగా కాదు. అంటే విజ్ఞత గల వ్యక్తులు, బాధ్యత గల వ్యవస్థలూ, అనగా మీడియా, అకడెమియా, సంఘ సంస్కర్తలు, మేధావులు, కవులు, కళాకారులు, పౌరసంఘాలు, ప్రభుత్వ వ్యవస్థలు, న్యాయస్థానాలు, చివరగా చట్టసభలూ సమష్టిగా మార్పుకోసం కృషిచేయాలి.
సామాజిక మార్పు అనే విషయం జటిలమైంది. ఆచారం, సంప్రదాయం అనే అలవాటు నరనరాల్లో జీర్ణించుకుపోయింది, తరతరాలుగా వారసత్వంగా వస్తున్నది కావటంతో సమాజం కొత్త ఆలోచన అవసరాన్ని గుర్తించటానికే చాలా సమయం పడుతుంది. దీనికి బాహ్య ప్రేరణ అవసరం. అందువల్ల మార్పు కోరే వ్యక్తులు, శక్తులు సమష్టి కృషి చేయవల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మార్పు ఆవశ్యకతను సమాజం అర్థం చేసుకునేలా చేయటానికి. ఇది ఎంతో ఓర్పు నేర్పుతో చేయాలే కానీ హడావుడిగా చేస్తే ప్రయోజనం ఉండదు. సింగడిని అద్దంకి పొమ్మంటే పోనూ పొయ్యాడూ, రానూ వచ్చాడు అన్నట్టు ఉండరాదు. అద్దంకి ఎందుకు పోవాలో తెలియకుండానే సింగడు పోయాడు, వచ్చాడు. ఎవరో అనుకుంటుంటే అది విని సింగడు అద్దంకి పోయాడు, వచ్చాడు; ఎందుకో తెలియకుండానే. దీన్నే గుడ్డి ఎద్దు చేనులో పడటం అంటారు మన సామెతల్లో. అది ఏం చేస్తుందో దానికి తెలియదు.
మనం పూజలు, పునస్కారాల్లో తంతు అనే పదం వాడుతుంటాం. మనం ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసేదే తంతు అంటే. రిచువల్ అంటే చాలామందికి బాగా అర్థమవుతుంది తంతు అనే దానికన్నా. ఈ రిచువల్ అనేది ఎందుకు చేస్తామో మనకు తెలియదు. అందరూ చేస్తున్నారు మనమూ చేస్తున్నాం. అంతేకానీ, దాని ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియదు. మనిషి అనాగరిక ప్రపంచం వదిలి నాగరిక లోకంలోకి అడుగిడుతున్నప్పుడు ఎదురు తిరగకుండా, ఎదురు ప్రశ్నలు వేయకుండా, చెప్పింది చేసేలా ఒప్పించటానికి బాగా పనికొచ్చిన ఆయుధం ఆచారం. నేటి మనిషికి జ్ఞానం ఉన్నది స్వతహాగా ఆలోచించగలడు తనకు ఏది మేలు, ఏది కీడు అని తెలుసుకునే విచక్షణ ఉన్నది. అయితే పదిమంది నడిచే మార్గాన నడిస్తే పోదా… మనమెందుకు కొత్త దారి తొక్కాలనుకుంటాడు సగటు మనిషి. ఆ స్తబ్ధతను ఛేదిస్తే కానీ మార్పు ఆవశ్యకతను మనిషి అర్థం చేసుకోలేడు. సరిగ్గా ఇక్కడే సహనమూ, సంయమనమూ చూపాలి మార్పు కోరేవారు. నిలబడే మార్పు నిలకడగా వస్తుంది. వడివడిగా వచ్చే మార్పు వడివడిగానే పోతుంది. అట్టి మార్పు నిలవజాలదు.
అందువల్ల నిలబడే మార్పు రావాలంటే సమాజంలో సుదీర్ఘమైన చర్చ జరగాలి. మార్పు ఆవశ్యకతను సమాజం గుర్తించాలి. మార్పు అవసరాన్ని మనిషి అంతర్లీనం చేసుకోవాలి. అప్పుడే మనిషి మార్పునకు మానసికంగా సిద్ధమవుతాడు. అప్పుడు చట్టం తీసుకువస్తే ఫలితం ఉంటుంది. సమాజం ఒక కొత్త పంథాలో పోయేటప్పుడు కొద్దిమంది ఉంటారు సమాజం ఆమోదించిన కొత్త పంథాను వ్యతిరేకించేవాళ్లు. సామెత ఉంది గదా ‘మేసే గాడిదను కూసే గాడిద’ చెడగొట్టిందని. ఈ కొద్ది మందిని సరైన మార్గంలో పెట్టడానికి చట్టం ఉపయోగపడుతుంది. పది మంది మంచిదని నడుస్తున్న మార్గానికి అవరోధం కలిగించే వాళ్లను, అవసరమైతే ఒత్తిడిని ఉపయోగించి అయినా సరే, సరైన దారిలో పెట్టేదే చట్టం.
అయితే చట్టం కండ బలంతో పనిచేస్తుంది. మనిషికి ముందు కావాల్సింది బుద్ధి బలం. అది పనిచేయనప్పుడే కండ బలం వాడాలి. బుద్ధి బలం ఉపయోగించి మనుషులు అర్థం చేసుకునేలా మనసు నొప్పించకుండా ఒప్పించేలా నచ్చచెప్తే వింటారు. ఇదేమీ జరగకుండా చట్టం చేయటమంటే గుర్రం ముందు బండిని పెట్టినట్టే. బండి ఉంటుంది, గుర్రం కూడా ఉంటుంది కానీ కదలవు. దీర్ఘకాలిక సామాజిక సమస్యల మీద మనిషిని సన్నద్ధం చేయకుండా చట్టం చేయటమంటే గుర్రం ముందు బండిని పెట్టినట్టే. చట్టం మనిషి బాహ్య ప్రవర్తనను మాత్రమే నియంత్రించగలదు కానీ ఆలోచనాసరళిని మార్చలేదు. దానికి కావాల్సింది మేధోమథనం. అంటే సుదీర్ఘమైన చర్చ, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు. చర్చ, సంప్రదింపులు లేకుండా ముందే ఒత్తిడి పెడితే చట్టం విధించిన నిబంధనల నుంచి తప్పించుకునే మార్గాల కోసం వెతుకుతాడు సగటు మనిషి. మన దేశంలో జరుగుతున్నది ఇదే. చట్టం చేసి చెయ్యి దులుపుకొంటున్నారు పాలకులు. పైగా ఆ చట్టం చేశాం, ఈ చట్టం చేశామని గొప్పలు చెప్పుకుంటారే కానీ, చేసిన చట్టాల అమలు తీరు ఏ విధంగా ఉన్నదనేదాని జోలికివెళ్లరు.
సామాజిక మార్పు కోసం చేసిన చట్టాలు ఈ కారణంగానే నిర్వీర్యమవుతున్నాయి. పుస్తకంలో మాత్రం అలంకారప్రాయంగా దర్శనమిస్తాయి. ఇవి లాయర్లకు పని కల్పించటానికి ఉపయోగపడతాయి కానీ, ఏ ఉద్దేశంతో తెచ్చారో, ఆ ఉద్దేశం మాత్రం నెరవేరదు. మన దేశంలో ఈ కోవకు చెందిన చట్టాలు కోకొల్లలు.
వరకట్నాన్ని నిషేధించే చట్టమే దీనికి తిరుగులేని ఉదాహరణ. వరకట్నం అనేది ఒక దుష్ట సంప్రదాయం అని తెలిసినా ఇచ్చేవారు గానీ పుచ్చుకునేవారుగానీ ఎవరూ నోరు మెదపరు. అంతా గుంభనంగా ఉంటా రు. ఇక్కడ ఒక నానుడి గుర్తుకు వస్తుంది: ఉత్తముడిని వివేకం, మధ్యముడిని అనుభవం, అధముడిని అవసరం పట్టి పీడిస్తుంటాయి అంటారు పెద్దలు. కట్నం ఇవ్వనూ అంటే సరైన సంబంధం రాదేమోనని ఉత్తముడిని, కట్నం ఇవ్వకపోవటం వల్ల పక్కింటి రామారావు గారికి ఎదురైన అనుభవం మధ్యముడిని, అమ్మాయి పెళ్లికిచ్చిన కట్నం అబ్బాయి పెళ్లి ద్వారా రాబట్టుకోకపోతే చేసిన అప్పులు తీరవనే అవసరం అధముడిని నోరు మూయించుతాయి.
ఈ ఉమ్మడి పౌరస్మృతి విషయానికి వస్తే ముఖ్యం గా ముస్లింలలో చాలా ఆందోళన, అభద్రతాభావం కనబడుతున్నాయి. ఇంతవరకూ బిల్లు ఏ రూపంలో ఉంటుందో తెలియదు కానీ అల్పసంఖ్యాక వర్గాల్లో మాత్రం ఒక అలజడి మొదలైంది. సంఘ్ పరివార్ పలుకుబడి ప్రభావం అటువంటిది మరి. ప్రజలననుకొని ఏమున్నది ప్రయోజనం? వివాహం, విడాకుల వంటి విషయాల్లో ముస్లింలు ఆచరిస్తున్న పద్ధతుల్లో సమస్య ఉన్నమాట వాస్తవం. వారు మారవలసిన అవసరం కూడా ఉన్నది. కానీ మార్పును ఎప్పుడూ బలవంతంగా రుద్దకూడదు. అలా చేస్తే సింగడు అద్దంకి పోయిరావటంలానే ఉంటుంది కానీ ప్రయోజనం ఉండదు.
ఏ వర్గం మార్పును కోరుకుంటున్నామో వారిని ఒప్పించాలి. మార్పు అవసరం, ఆవశ్యకత గురించి వారికి విడమర్చి చెప్పాలి. వారిలో ఆంతరంగికంగా చర్చ జరగాలి. దానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి. వారితో సంప్రదింపులు జరపాలి. ఇది వారి మత విశ్వాసాల జోలికి పోయేది కాదు, వారి మహిళలకు రక్షణ కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నం అని వారికి అర్థం అయ్యేలా నచ్చ చెప్పాలి. అర్థమయ్యేలా చెప్తే ఎవరైనా వింటారు. శ్రద్ధగా విన్నారంటే మారేదానికి అవకాశాలు చాలా మెండు. లేదంటే కనీసం ఈ మార్పును అంగీకరించక తప్పదన్న విషయమైనా జనంలోకి లోతుగా వెళ్లాలి. అల్లాకి ముల్లాకి మధ్య ఉన్న అంతరాన్ని చట్టం పూరించలేదన్న విషయం తెలుసుకోవాలి.
ఆధార్ కార్డు విషయంలోనూ మొదట్లో కొన్ని భయాందోళనలు, సందేహాలు ఉండేవి చాలా మందిలో. ఎప్పుడైతే ఇది లేనిదే ఏ పనీ జరగదని ప్రజలు అర్థం చేసుకున్నారో అప్పుడు అందరూ లైన్లో నిలబడ్డారు పేరు నమోదు చేసుకోవటానికి. చేసేది మన మంచికోసమే అయినా అది మన సమ్మతితో మనకు అర్థమయ్యేలా చెప్పి చేస్తే ఫలితాలు బాగుంటాయి. జబ్బు తగ్గాలంటే ఆపరేషన్ అవసరమని మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పరేషాన్ అవుతామో తెలువదా మనకు? ఫలితాలతో మాకు సంబంధం లేదు చేశామని చెప్పటం కోసమే చేస్తున్నాం అంటే అది వేరే విషయం. దానినే మూర్ఖపు వాదన అంటారు. ఈ వేళ ఉమ్మడి పౌరస్మృతి, రేపు ఉమ్మడి భాష, అనగా హిందీ, ఎల్లుండి ఇది హిందూ దేశం గాబట్టి ముందు అందరూ హిందువులుగా ఉండాలి, ఆ తర్వాత ఏదైనా కూడా అంటే అది జాతి ఐక్యతకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఆలోచించాలి పాలకులు.
చివరగా క్లిష్టమైన సామాజిక అంశాల మీద చట్టం చేసేటప్పుడు ఆవేశం కన్నా ఆలోచన మిన్న. హడావుడిగా చట్టం చేస్తే వచ్చే పరిణామం ఎలా ఉంటుందో సాగు చట్టాల విషయంలో మనం చూశాం. ఆ అనుభవం మనకు పాఠం నేర్పాలి. మనం నేర్వాలి. పార్లమెంటుకు ఎన్నికలు ఏడాదిలోపు ఉన్నందున, ఈ అంశాన్ని పక్కనబెట్టి ఎన్నో ఏండ్ల నుంచి పార్లమెంటులో పడిగాపులు కాస్తున్న చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టం చేయాలి. తద్వారా ముస్లిం మహిళలు కూడా చట్టసభల్లోకి ప్రవేశించి వారి మనోభావాలను తెలియజేస్తారు. ఈ లోపు ప్రజల జీవనం మెరుగుపడటానికి రాజ్యాంగంలో ఉద్దేశించిన కొన్ని అంశాల మీదనైనా చట్టం చేసి పాలకులు తమ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలి. అంతేకానీ, ఆర్టికల్ 370ని ఒక్కరోజులో రద్దుచేసినట్టు హడావుడిగా ఉమ్మడి పౌరస్మృతి లాంటి అంశాన్ని చట్టం చేయకూడదు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం ప్రయోజనం పొందుతారో చెప్పలేం కానీ దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైగా వివిధ మతాల వారి మధ్య ఇప్పుడున్న సుహృద్భావ, సామరస్య వాతావరణానికి విఘాతం కలగడం మాత్రం ఖాయం అనే భయం ఆందోళన, అలజడి చాలామందిలో ఉన్నది. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని పాలకులు తెలుసుకోవాలని ప్రజలందరూ కోరుకోవాలి.
ఎన్నికలు ప్రతి ఐదేండ్లకోసారి వస్తుంటాయి. సమాజానికి గాయమైతే తగ్గటానికి చాలా సమయం పడుతుంది. అడుసు తొక్కనేల కాలు కడగనేల?
(వ్యాసకర్త: లోకసభ సచివాలయంలో విశ్రాంత సంచాలకులు)
గుమ్మడిదల రంగారావు