ఏపీ పునర్విభజన చట్టం-2014, సెక్షన్ 93, షెడ్యూల్ 13 (3)లో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఏపీలోని విజయనగరం జిల్లాలో గతేడాది గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చొరవతో ములుగు జిల్లాలో 200 ఎకరాల్లో స్థల సేకరణ జరిగింది. కానీ, ఏండ్లు గడిచినా గిరిజన వర్సిటీ పనులు ప్రారంభం కాకపోవడం శోచనీయం. కేంద్రం నిధులు విడుదల చేయకపోవడం వల్ల వర్సిటీ పనుల ప్రారంభం ఆలస్యమవుతున్నదని గిరిజన విద్యార్థులు వాపోతున్నారు.
ఈ చట్టంలోని మిగిలిన విద్యాసంస్థలు ఎన్నో తాత్కాలిక భవనాల్లోనైనా ప్రారంభమయ్యాయి. కానీ గిరిజన వర్సిటీ దానికి కూడా నోచుకోలేదు. కేంద్రానికి గిరిజనుల పట్ల, వాళ్ల ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఏ ప్రాంత అభివృద్ధికైనా విద్యారంగంలో పురోగతి చాలా అవసరం. గిరిజన నిరక్షరాస్యత అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎక్కువ అవసరం. అక్షరాస్యతలో తెలంగాణ 66.5 శాతంతో, 32వ స్థానంలో అట్టడుగున ఉన్నది. దేశ సగటు అక్షరాస్యత 74.4 శాతం కంటే కూడా బాగా తక్కువ తెలంగాణ అక్షరాస్యత ఉండటం దేనికి సంకేతం?
గిరిజనులకు ఉన్నత విద్యను అందుబాటులోనికి తీసుకురావడం, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటే కేంద్రానికి ప్రధాన లక్ష్యం కావాలి. ఆధునిక విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని గిరిజన సంప్రదాయాలను, భాషలను, ఆచారవ్యవహారాలను పరిరక్షించుకోవాలి. వీటిపై పరిశోధనలు జరపడం, గిరిజనుల సంప్రదాయక వైద్య పద్ధతుల అధ్యయనం, అటవీ సంపద ఆధారంగా జరిగే ఆర్థిక కార్యక్రమాలు, వృక్ష జంతుజాలం వంటి అంశాలపై ఆధునిక పద్ధతులు వినియోగించి అభివృద్ధి చేయాలి. వివిధ గిరిజన తెగల అవసరాలకు అనుగుణంగా పథకాలను, అభివృద్ధి నమూనాలను వారే తయారుచేసుకునేలా తర్ఫీదునిచ్చి ప్రోత్సహించాలి. గిరిజనులు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ధిని సాధించేలా పలు రకాల బోధనలు జరగాలి. అప్పుడే గిరిజన వర్సిటీల విశేష లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకోసమైనా గిరిజన వర్సిటీ ఏర్పాటుకు పార్లమెంటులో ప్రత్యేకంగా చట్టం చేయాలి. కానీ, నేటికీ కేంద్రం ఆ పని చేయడం లేదు. గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రూ.1100 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర నిపుణుల కమిటీ తెలిపింది. అయితే కేంద్రం మాత్రం ఈయేడు బడ్జెట్లో రూ.10 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ నిధులను ఇంకా విడుదల చేయకపోవడం విడ్డూరం. ఒక గిరిజన వర్సిటీ ఏర్పాటు గిరిజనాభివృద్ధికి ఎలా సహకరిస్తుందో తెలియాలంటే ప్రస్తుతం దేశంలో ఉన్న ఒకే ఒక కేంద్రీయ గిరిజన వర్సిటీ గురించి తెలుసుకుందాం.
2007లో కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ ప్రాతంలో వర్సిటీ ఏర్పాటు కోసం ‘ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ చట్టం-2007’ను చేసింది. 400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ వర్సిటీలో 30 విభాగాలు, డిగ్రీ నుంచి పీజీ, రీసెర్చ్ వరకు పలు కోర్సులున్నాయి. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా వర్సిటీ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. గిరిజన భాషలను, సంప్రదాయాలను, సంస్కృతిని పరిరక్షించే ప్రత్యేక అధ్యయనాలు ఇక్కడ జరుగుతున్నాయి. గిరిజన భాషల అర్థాలతో కూడిన నిఘంటువును తయారుచేస్తున్నారు. లిపి లేని గిరిజన భాషలకు ప్రత్యేక లిపిని రూపొందించే కృషి జరుగుతున్నది. అలాంటి వర్సిటీని తెలంగాణలో కూడా ఏర్పాటుచేస్తే మొత్తం ఈ ప్రాంత అభివృద్ధికి సహాయకారిగా ఉంటుంది. శాస్త్ర, సాంకేతికరంగాల్లో స్థానిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం, అడ్మిషన్లలో స్థానిక గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా మరింత గిరిజనాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్నా కేంద్రం మాత్రం గిరిజన వర్సిటీల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టకపోవడం విచారకరం.
తెలంగాణ మొత్తం జనాభాలో 9 శాతం మంది గిరిజనులున్నారు. గిరిజనుల్లో నిరక్షరాస్యత ఎక్కువ. అందుకే కేంద్రం గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఇంకేమాత్రం జాప్యం చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించాలి. వీసీ, ఇతర సిబ్బందిని
వెంటనే నియమించి, నిర్మాణ పనులను ప్రారంభించాలి.
గిరిజన వర్సిటీ వంటి ఒక ఉన్నత విద్యాసంస్థను కేంద్ర ప్రభుత్వ నిధులతో స్థాపించడానికి, అందులోనూ ప్రత్యేక చట్టం చేయవలసి రావ డం కేంద్రానికి అసలు మింగుడుపడటం లేదు. అందుకే ఏండ్లు గడిచినా నేటికీ ఏ చర్యలూ చేపట్టడం లేదు. తెలంగాణ మొత్తం జనాభాలో 9.08 శాతం మంది గిరిజనులున్నారు. గిరిజనుల్లో నిరక్షరాస్యత ఎక్కువ. అందుకే కేంద్రం గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఇంకేమాత్రం జాప్యం చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలి. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించాలి. వీసీ, ఇతర సిబ్బందిని వెంటనే నియమించి, నిర్మాణ పనులను ప్రారంభించాలి. నిర్మాణం పూర్తయ్యేలోగా తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుచేసి విద్యార్థులకు పాఠాలు బోధించాలి. రాష్ట్ర విభజన హక్కుల ప్రకారం రావలసిన గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరం కేంద్రంపై ఉన్నది. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపకుంటేనే అది సాధ్యమవుతుంది.
(వ్యాసకర్త: ఓయూ రీసెర్చ్ స్కాలర్)
జటావత్ హనుము
85198 36308