దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లవుతుందని, దేశమంతటా అమృతోత్సవాలు ‘హర్ ఘర్ తిరంగా’ అని అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరుగుతున్నాయి. కానీ అమృతోత్సవాలు చేసుకునేంతగా అభివృద్ధి దేశంలో కనిపించడం లేదు. రాజస్థాన్లో తొమ్మిదేండ్ల దళిత విద్యార్థి సవర్ణుల కుండలోని నీళ్లు తాగాడని టీచర్ కొట్టి చంపినటువంటి ఘటనలు ఇంకా కొనసాగుతుంటే ఈ స్వాతంత్య్ర ఉత్సవాలు దళితులకు చేరగలవా!
ఎప్పుడో వందేండ్ల కింద స్వాతంత్య్రానికి పూర్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ బడిలో సవర్ణుల నీళ్లకుండలు ముట్టిన సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నరు. కానీ ఇప్పుడు స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో తొమ్మిదేండ్ల బాలుడు ఇంద్రకుమార్ మేఘవాల్ స్కూల్లో సవర్ణుల నీళ్ల కుండ ముట్టుకొని నీళ్లు తాగాడని ప్రాణాలు తీసే క్రూరంగా కులం జడలు విచ్చుకుందంటే.. కుల హత్యల్ని స్వాతంత్య్రమని స్వాగతించగలమా?
గుజరాత్ మారణకాండలో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులు మామూలు నేరస్థులు గాదు. ఆమె పసిబిడ్డను, కుటుంబాన్ని మొత్తం క్రూరాతిక్రూరంగా చంపి, అత్యాచారాలు జరిపిన సామాజిక నేరస్థుల్ని యావజ్జీవ జైలుశిక్ష లేకుండా విడుదల చేసి, రేపిస్టులకు, హంతకులకు అండగా నిలిచిన స్వాతంత్య్రాన్ని చూసి మహిళలు సంబురాలు చేసుకోగలరా! బేటీ బచావో, నారీ శక్తి, మహిళాశక్తి, మహిళోద్ధరణ అంటే… ఇదా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. దేశ సంపద ప్రధానంగా శ్రమ కులాల చెమట, రక్తం నుంచి వృద్ధి చెందింది గానీ అభివృద్ధి వారి చుట్టూతా జరగడం లేదు. కనీసం అశేష పీడిత కులాల అభివృద్ధి ఇంకా మిగిలే ఉంది అనే ఒప్పుకోలు ఆత్మవిమర్శ కూడా జరగడం లేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినంక మహిళల పరిస్థితి అందులోనూ సామాజిక ఉత్పత్తి శక్తులైన శ్రామిక కులాల (దళిత, ఆదివాసీ, ఓబీసీ, పేద ముస్లిం) మహిళలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో అమృతాలు పొంది ఉత్సవాలు చేసుకునేంతగా అభివృద్ధి జరిగిందా అనేది చర్చనీయాంశం.
శూద్రులకు, అంటరానివారికి, మహిళలకు చదువుపై నిషేధం ఉన్న ఈ భారత సమాజాన్ని ధిక్కరించి, ఆయా సమూహాల పిల్లలకు చదువునందించడానికి అనేక పాఠశాలలను, బాలికా పాఠశాలలను నెలకొల్పి, మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్తలు సావిత్రీబాయి, ఫాతిమాబేగం జాతీయోద్యమ చరిత్ర కంటికి మసకలే. స్వాతంత్య్ర పోరాటంలో లక్షల మంది బహుజన మహిళలు పాల్గొన్నారని బ్రిటిష్ గెజిట్స్ చెప్పినా, పాల్గొన్న లక్షల్లో కొందరికైనా స్వాతంత్య్ర రజతోత్సవాల్లో, స్వర్ణోత్సవాల్లో, అమృతోత్సవాల్లో కూడా ప్రస్తుతించకపోవడం అన్యాయం. చరిత్రలో అన్యాయాలు, అవమానాలు జరిగినా శ్రామిక కులాల మహిళలు ఏ సంతోషాల్ని నెమరేసుకుంటూ స్వాతంత్య్ర సంబురాల్లో పాల్గొనగలరు?
స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ వలస పాలన అంతమైతే… మన దేశాన్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుందామని అశేష పీడిత కులాలకు వాగ్దానం చేసింది నాటి జాతీయోద్యమం. కానీ, అలా జరుగలేదు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో శ్రామిక కులాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పేద ముస్లిం మహిళలకు జరిగిన అభివృద్ధి చెప్పుకోదగినది కాదు. స్వాతంత్య్రం వస్తే చదువుకుంటాం, ఎట్టి బానిసత్వం నుంచి విముక్తి పొందుతాం, అంటరానితనాలు పోతాయి, సమానావకాశాలు దక్కుతాయని, మానవ హక్కులతో ఆత్మగౌరవంగా బతుకుతామనే ఆశ, ఆకాంక్షలతో పోరాడినవారు బహుజన మహిళలు.
మరోవైపు, 1880 నుంచి 1930 దాకా అనేక మహిళా సంఘాలు ఏర్పడినాయని, ఆధిపత్య కులాల నుంచి వచ్చిన మహిళలు వీటిని ఏర్పాటు చేశారని, వీరు తమ చదువుల కోసం, మూఢాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని జాతీయోద్యమ చరిత్ర, సంస్కరణోద్యమ చరిత్రలు చెప్తున్నయి.
1857లో జరిగిన మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో తెల్లవారి సేనలతో తలపడి దేశ విముక్తి కోసం వీర మరణం పొందిన జల్కారీ బాయి, ఉదాదేవి వంటి ఎందరో సైనిక కమాండర్లు ఉన్నా కూడా ఈ వీరాంగణల చరిత్రలను భారత మనువాద చరిత్రకారులు భారత సమాజానికి అందనివ్వలేదనేది వాస్తవం. కానీ వీరి పేర్లు, చరిత్రలను బ్రిటిష్ ప్రభుత్వ డైరీలు, గెజిట్లు, ప్రచురణలు చెప్తున్నయి. లక్షల మంది దళిత కులాల నుంచి సైనికులుగా, సైనిక కమాండర్లుగా, యుద్ధ నిపుణులుగా కుటుంబాలను వదిలి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీశాలులని రికార్డులు ఉన్నాయి. దేశ మొదటి స్వాతంత్య్ర పోరాటంలో (1857లో) దళిత కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున యువతీ యువకుల్ని కూడగట్టి వారికి నవాబులు, రాజులు యుద్ధ, సైనిక శిక్షణను ఇప్పించారు.
రాణులు దళిత మహిళల్ని అంగరక్షకులుగా చేర్చుకొని వారికి యుద్ధ విద్యల్ని నేర్పించేవారు. వీరంతా బ్రిటిష్ సైన్యాలకు ఎదురొడ్డి పోరాడారు. అట్లా ఝాన్సీ లక్ష్మీబాయి కోరి కులానికి చెందిన జల్కారీ బాయిని, హజ్రత్ మహల్ అనే రాణి పందులను కాసుకునే పాసీ కులానికి చెందిన యువతిని బెటాలియన్ కమాండర్గా యుద్ధానికి పంపినట్లుగా వెల్లడైంది. ఝాన్సీరాణి తాను స్వయంగా యుద్ధరంగంలో దిగకుండా, తనకు మారుగా జుల్కారీ బాయిని యుద్ధానికి పంపినట్లుగా బ్రిటిష్ డైరీలు, గెజిట్లు చెబుతున్నయి. ఇట్లా సైనికాధికారులుగా యుద్ధంలో నిలిచిన ఈ దళిత మహిళలు బతుకుదెరువు కోసం ఆ పని చేయలేదు. సొంతగడ్డను విదేశీయుల నుంచి రక్షించాలనే దేశభక్తి ఉంటే తప్ప యుద్ధ సాహసాలకు, ప్రాణాలు పణంగా పెట్టే ఆ త్యాగాలకు సిద్ధపడలేరు. అట్లాంటి దేశభక్తిని కనబరిచిన దళిత వీరాంగణల అమరత్వం ఆధిపత్య మనువాద చరిత్రకారులకు కనబడదు.
జాతీయోద్యమం అన్ని పోరాట దశల్లోనూ దళిత మహిళలు లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్ల పాలయ్యారు, యుద్ధాలు చేశారు. ఒక్క జాతీయోద్యమమే కాదు తెలంగాణ సాయుధ పోరాటంతో సహా దేశంలో జరిగిన అన్ని రైతు, కార్మిక, మహిళ, కమ్యూనిస్టు, నక్సలైట్ ఉద్యమాల్లో దళిత మహిళల భాగస్వామ్యం గొప్పది. అయినప్పటికీ, ఆయా ఉద్యమాలు వారికి ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చాయి? అంబేద్కర్ హిందూకోడ్ బిల్లులో రూపొందించిన చట్టాలు, సమాన పనికి సమాన వేతనం, ఎనిమిది గంటల పని దినం, ప్రసూతి సెలవులు వంటి వాటికి రాజ్యాంగ రక్షణలున్నా దళిత మహిళల పట్ల అవి అమలుకు నోచుకోవడం లేదు.
జాతీయోద్యమంలో కొనసాగిన సంస్కరణోద్యమం తాలూకు ఫలితాలు అంటే.. సతి, బాల్యవివాహాలపై నిషేధం, వితంతు వివాహానికి, పునర్ వివాహానికి అనుమతి వంటివి సవర్ణ మహిళలకు అందినయి. కానీ ఈ మూఢాచారాలు లేని దళిత, బహుజన మహిళలకున్న జోగినీ, స్కావెంజింగ్ పని వంటి సమస్యల్లో మాత్రం ఏ సంస్కరణలూ జరగలే. అవిద్య, పేదరికం, జోగినీ, ఉపాధి లేమి నుంచి, పీతి బకీట్లు ఎత్తే మోత నుంచి, లైంగికదాడుల నుంచి, హత్యాచారాల నుంచి దళిత మహిళలకు ఇప్పటికీ విముక్తి లభించలేదు. వారు చేసిన పోరాటాల ఫలితాలు వారికి న్యాయంగా దక్కలేదు. కుల పీడన, మతంతో కలిసి కొత్త పుంతలతో ముందుకుపోయే రాజకీయమే ఇప్పుడు నడుస్తున్నది. రాజ్యాంగం అమలులో నిర్లక్ష్యం కారణంగా దళిత మహిళల జీవితాల్లో మార్పు రాలేదు.
కుల వివక్ష కారణంగా దళిత మహిళలు చదువు, ఉద్యోగం, రాజకీయ, ఆర్థిక రంగాలకు ఆమడ దూరంలో ఉన్నారు. వీటికి తోడు సామాజిక హింసలైన లైంగికదాడులు, హత్యలు, అత్యాచారాలు దళిత మహిళల మీదనే ఎక్కువ జరుగుతున్నాయని క్రైమ్ రిపోర్టులు చెపుతున్నయి. ఖైర్లాంజీ ఘటన, టేకులక్ష్మి, మనీషా, మైసమ్మ, మరియమ్మల మీద హత్యాచారాలు వంటివి దేశమంతటా నిత్యకృత్యమైపోయినయి. ఇన్ని దుక్కాల నడుమ, ఏం మిగిల్చినయని దళిత మహిళలు స్వాతంత్య్ర ఉత్సవాలు చేసుకోగలరు?
1994 నుంచి 2020 దాకా అందుబాటులో ఉన్న క్రైమ్ రిపోర్టులు గమనిస్తే.. ఈ దేశంలో అంటరాని మహిళల పట్ల ఎంత దుర్మార్గమైన కులాధిపత్య హత్యలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 1994 నుంచి 2020 వరకు 44,506 దాడులు, హత్యాచారాలు జరిగాయి. 2004లో 1157 అత్యాచారాలు జరగగా 2020లో 3,396కి పెరిగాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నివేదిక ప్రకారం భారతదేశంలో దళిత మహిళల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందనీ, బాలకార్మిక వ్యవస్థ, కులవివక్ష, పేదరికం పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, దళిత మహిళలు బానిస కూలీలుగా బతుకుతున్నారనీ, ఇప్పటికీ దళిత మహిళలు సఫాయి కర్మచారీలుగా, మానవ మలాన్ని ఎత్తిపోసే వృత్తుల్లో ఉన్నారని వెల్లడించిందంటే…
నిజంగా భారతదేశం దళిత మహిళలను భారతమాతగా, ఇండియన్ డాటర్స్గా చూస్తుందా? చూస్తే దళిత మహిళల బానిసత్వాలను, వారి మీద జరిగే హత్యాచారాలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నది? వీరు ఈ దేశ పుత్రికలైతే వారిని మనుషులుగా మానవ గౌరవాలతో ఎందుకు బతుకనియ్యడం లేదు? వీరి మీదనే నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీలురు దళిత, శ్రామిక కులాల మహిళల మీద జరిగే దాడుల పట్ల, హత్యాచారాల పట్ల, సామాజిక హింసల పట్ల పెద్ద ఎత్తున ఉద్యమిస్తే గానీ దళిత మహిళాభివృద్ధి జరుగదు. లేకుంటే దేశాభివృద్ధి అమృతోత్సవాలకాన్నే ఆగిపోతది.
ఝాన్సీరాణి తాను స్వయంగా యుద్ధరంగంలో దిగకుండా, తనకు మారుగా జుల్కారీ బాయిని యుద్ధానికి పంపినట్లుగా బ్రిటిష్ డైరీలు, గెజిట్లు చెబుతున్నయి. ఇట్లా సైనికాధికారులుగా యుద్ధంలో నిలిచిన ఈ దళిత మహిళలు బతుకుదెరువు కోసం ఆ పని చేయలేదు. సొంతగడ్డను విదేశీయుల నుంచి రక్షించాలనే దేశభక్తి ఉంటే తప్ప యుద్ధ సాహసాలకు, ప్రాణాలు పణంగా పెట్టే ఆ త్యాగాలకు సిద్ధపడలేరు. అట్లాంటి దేశభక్తిని కనబరిచిన దళిత వీరాంగణల అమరత్వం ఆధిపత్య మనువాద చరిత్రకారులకు కనబడదు.
జూపాక సుభద్ర
94410 91305