కేంద్రం బొగ్గు గనుల ప్రైవేటీకరణను కొనసాగిస్తున్నది. మరోవైపు ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలకు అవసరమైన మేరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు నిధులు లేకుండా చేస్తున్నది. దీంతో గత రెండేళ్లుగా దేశంలో పదే పదే బొగ్గు కొరత ఏర్పడుతున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు భారాన్ని మాత్రం కేంద్రం అధిక విద్యుత్తు ధరల ద్వారా ప్రజలపై మోపుతున్నది.
కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి దేశ సంపదను దోచి పెడుతున్నది. అందుకోసం చట్టాలను కూడా మార్చింది. బొగ్గు గనుల అభివృద్ధి నియంత్రణ చట్టం-1957ను రద్దు చేసి కోల్ మైన్స్ ప్రొవిజన్ యాక్ట్-2015 ద్వారా బొగ్గు గనుల వేలంలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ వ్యక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశీయ అవసరాల కోసం చాలా ప్రైవేటు కంపెనీలు బొగ్గు తవ్వకాలకు ముందుకు వచ్చాయి. అయితే ఆ కంపెనీల వల్ల బొగ్గు గనుల్లో ఎక్కువ ప్రమాదాలు జరిగేవి. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం 1973 మే 1న బొగ్గు గనుల జాతీయకరణ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1975లో కోల్ ఇండియా కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. 1956లో సింగరేణి సంస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
దేశానికి సంపదగా మారి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బొగ్గు గనులపై కార్పొరేట్ కంపెనీల కన్ను పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వ సాయంతో అవి బొగ్గు గనుల చట్టాన్ని మార్పించి వాటిని వేలంలో చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం మరొక సెట్ బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించింది. ఈ బొగ్గు గనులలో పూర్తిగా అన్వేషించబడిన మరియు పాక్షికంగా అన్వేషించబడిన కోకింగ్ మరియు కోకింగ్ కాని బొగ్గు, లిగ్నైట్ గనులు ఉన్నాయి. 2016-17 నుంచి ఇప్పటి వరకు 32 బొగ్గు గనులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేలం వేసింది. క్యాప్టివ్ బొగ్గు గనులు తమ ఉత్పత్తిలో 50 శాతాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు కేంద్రం అనుమతించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులన్నీ ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే క్యాప్టివ్ బొగ్గు గనులన్నీ(కంపెనీలు సొంతంగా కలిగిన బొగ్గు గనులు) వాణిజ్య బొగ్గు గనులుగా మారతాయి.
ఇదే జరిగితే బహిరంగ మార్కెట్లో తమ అదనపు ఉత్పత్తిని విక్రయించే ముందు ఆ గనులు తమకు కేటాయించబడిన సంస్థ క్యాప్టివ్ అవసరాలను ముందుగా తీర్చాల్సిన అవసరం లేదు. క్యాప్టివ్ బొగ్గు గని యాజమాన్యంలోని కంపెనీలు ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీల నుండి తక్కువ ధరకు బొగ్గును కొనుగోలు చేయడానికి ఇష్టపడతాయి. బొగ్గు ధర ఎక్కువగా ఉన్న బహిరంగ మార్కెట్లో స్వంత ఉత్పత్తిలో కొంత భాగాన్ని విక్రయించడం ద్వారా ఎక్కువ లాభాన్ని పొందుతాయి. 2021-22లో క్యాప్టివ్ బొగ్గు గనుల ద్వారా దాదా పు 90 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది. ఈ బొగ్గును ఎక్కువగా విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించారు. తెలంగాణలో గిరిజన ప్రాంతమైన ఇల్లందు దగ్గర్లోని కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిని ప్రైవేట్ కంపెనీకి అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. తద్వారా గిరిజనుల భూహక్కును కాలరాసే ప్రయత్నం చేస్తున్నది.
ఆళవందార్
వేణు మాధవ్