ఆ బాండ్ పేపర్ చెల్లదంట
బీజేపీ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఆ పార్టీ తీరు అప్పుడే బాగానే వంటబట్టినట్టుంది. హామీలకు పూచీకత్తుగా బాండ్ రాసిస్తానని ఓటర్లకు చెబుతున్నారట. అయినా జనం నమ్మకపోవటం కొసమెరుపు. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి పెన్షన్ రాని వారికి తన సొంత డబ్బులతో పెన్షన్ ఇస్తానంటూ రాజగోపాల్రెడ్డి హామీ ఇచ్చినా ఎవరూ నమ్మడం లేదట. తన మాట మీద అంత నమ్మకం లేకపోతే బాండ్ పేపర్పై రాసిస్తానని, సుశీల చారిటబుల్ ట్రస్టు ద్వారా నెలనెలా క్రమం తప్పకుండా పెన్షన్ డబ్బులు బ్యాంకులో పడే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పినా విశ్వసించడం లేదట. ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేదు ఎందుకని తన అనుచరులను రాజగోపాల్రెడ్డి అడిగితే, నిజామాబాద్లో ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ ఇలాగే పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి పత్తా లేకుండా పోయిన విషయాన్ని మన ప్రత్యర్థులు మునుగోడు దాకా తీసుకువచ్చారని, బాండ్ పేపర్ కాకుండా మరేదైనా మాట చెప్పి చూడండి నమ్ముతారేమో అని వారు సలహా ఇచ్చినట్టు సమాచారం.
వంద ఓట్లకేమి పొత్తు
టీడీపీతో తమకు ఎలాంటి పొత్తు ఉండదని, ఉంటే గింటే ఆంధ్రలో పవన్ కల్యాణ్ జనసేనతో ఉంటుంది తప్ప తెలంగాణలో తమది ఒంటరి పోరేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మీడియాకు తేల్చి చెప్పారు. అదేంటీ.. మోదీతో టీడీపీ అధినేత చంద్రబాబు, అమిత్షాతో లోకేష్ చర్చలు జరిపినట్టు చెబుతున్నారు కదా? అని ప్రశ్నిస్తే, వారితో పొత్తు ఉండేటట్టు అయితే అమిత్షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ జరిగేది కాదు కదా అని ఆఫ్ ది రికార్డుగా సందేహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి ఆంధ్రలో జనసేనతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో ఎందుకు వద్దు అనుకుంటున్నారని మీడియా గుచ్చిగుచ్చి అడిగితే, ఆయనే (పవన్ కల్యాణ్) తిరుపతిలో చెప్పారు కదా.. మునుగోడులో తాము పోటీ చేసినా వందో, వేయో ఓట్ల కంటే ఎక్కువ రావని, అలాంటప్పుడు వంద, వేయి ఓట్లకు పొత్తు ఎందుకు అని అనుకున్నామని అసలు సంగతి చెప్పుకొచ్చారు. ఎంతైనా వాస్తవాన్ని నిజాయితీగా అంగీకరించిన పవన్ కల్యాణ్ను, లక్ష్మణ్ను అభినందించక తప్పదు.
నాన్ సీరియస్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (టీపీసీసీ) రేవంత్రెడ్డిని అధ్యక్షునిగా నియమించినప్పటి నుంచి తలెత్తిన సమస్యలు, వివాదాల పరిష్కారాన్ని రాహుల్గాంధీ తన భుజాన వేసుకున్నారు. మునుగోడులో రాజగోపాల్రెడ్డి రాజీనామా వల్ల జరుగబోయే ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమాయత్తంపై నిర్వహిస్తున్న సమావేశాలన్నీ ప్రస్తుతం ప్రియాంకగాంధీ అధ్యక్షతన జరుగుతున్నాయి. రాహుల్గాంధీయే ఈ బాధ్యతలను సోదరి ప్రియాంకగాంధీకి అప్పగించారా? లేక ఆమెనే చొరవ తీసుకున్నారా? అని ఆరా తీస్తే టీపీసీసీ నేతలు, రాష్ట్ర ఇంచార్జీ, ఏఐసీసీ పరిశీలకులే ఆమెను ఆశ్రయించినట్టు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలువకపోతే తెలంగాణలో కాంగ్రెస్ కొంప కొల్లేరే అవుతుందని రాహుల్గాంధీ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఆయన సీరియస్గా తీసుకోలేదట. దీంతో సీరియస్ ఎన్నికలను నాన్ సీరియస్గా తీసుకుంటే ఎలా అని టీపీసీసీ నేతలు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ప్రియాంక బాట పట్టినట్టు గాంధీభవన్ వర్గాల వినికిడి.
-వెల్జాల