ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలు సాధారణ విషయం కాదు. భారత ప్రజాస్వామ్యంలో ఇది ఒక కీలక మలుపుగా నిలిచిపోతుంది. న్యాయమూర్తుల పక్షపాతం, నిష్పాక్షికత గురించి చర్చలు ఎప్పుడు వచ్చినా, ఆయన వాదనలు గుర్తుకువస్తాయి. తనకు, తన పార్టీకి న్యాయవ్యవస్థపై గౌరవం, విశ్వాసం ఎప్పటికీ ఉందని, అయితే తాను చేసిన ఈ రిక్యూసల్ (recusal) అభ్యర్థనకు బలమైన 10 కారణాలు ఉన్నాయని అన్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన రిజాయిండర్ను రికార్డుల్లోకి తీసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు సోమవారం అంగీకరించింది.
జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తన వాదనలు వినిపించినప్పుడు, కేజ్రీవాల్ ప్రశాంతంగా వ్యవహరించారు. పూర్తిగా ప్రొఫెషనల్గా మాట్లాడారు. అత్యంత గంభీరమైన అనుమానాలను కూడా ఎంతో జాగ్రత్తగా, తగిన మాటలతో వ్యక్తపరిచారు. ఒక్కసారి కూడా న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడలేదు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయని ఒక రాజకీయ నాయకుడి నుంచి కోర్టు వ్యవహారాలపై ఇంత స్పష్టత, నియంత్రణ కనిపించడం అసాధారణం. తనపై న్యాయమూర్తి పక్షపాతం చూపవచ్చని భావించే వారికి ఇప్పుడు ఆయన ఒక మార్గదర్శకంగా నిలిచారు. ఇప్పుడు ఆయన చేసిన వాదనల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి, వాటిపై చర్చ అవసరం. తర్వాత వచ్చే తీర్పు ఎలా ఉన్నా. మార్చి 9న సీబీఐ అప్పీల్ వేయడం ద్వారా హైకోర్టును ఆశ్రయించినప్పుడు, జస్టిస్ స్వర్ణకాంత శర్మ, సెషన్స్ కోర్టు జడ్జి జితేంద్ర ప్రసాద్ సింగ్ ఇచ్చిన డిశ్చార్జ్ ఆర్డర్ను, మరో పక్షాన్ని వినకుండానే తప్పుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సమయంలో కేజ్రీవాల్ తరఫున అక్కడ ఎవరూ లేరు.
నెలల తరబడి విచారణ జరిగిన తర్వాత వచ్చిన ఆర్డర్పై, ట్రయల్ కోర్టు రికార్డు లేకుండా ఇంత గంభీర వ్యాఖ్యలు ఎలా చేయగలరు? దీనివల్ల కేజ్రీవాల్కు అనుమానం కలుగడం సహజం. సెషన్స్ కోర్టు జడ్జి లిక్కర్ స్కాం కేసులో తీర్పునిస్తూ విచారణాధికారి సరైన విచారణ చేపట్టకుండా అప్రూవర్లు ఇచ్చిన స్టేట్మెంట్ను ఆధారం చేసుకుని చార్జిషీట్ వేశారు కాబట్టి ఆ (IO)పై డిపార్ట్మెంట్ విచారణకు ఆదేశించారు. అలాగే ఆయనపై గంభీర వ్యాఖ్యలు చేశారు. విచారణ ముందే కేసును ఎవరిపై నమోదు చేయాలో నిర్ణయించుకున్నట్లు ఉన్నదని కూడా పేర్కొన్నారు. అయితే, ఆ IO కోర్టులో లేకపోయినా, అతని నుంచి అభ్యర్థన రాకపోయినా, అతనిపై చర్యలను వెంటనే నిలిపివేశారు జస్టిస్ స్వర్ణకాంత శర్మ.
గతంలో ఇదే కేసులో బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ జస్టిస్ స్వర్ణకాంత శర్మ చేసిన వ్యాఖ్యలు మీడియాకు మరింత ప్రచారం చేయటానికి అవకాశమిచ్చాయి. అభియుక్తులను నేరస్థులుగా చూపించేందుకు, సాధారణంగా బెయిల్ విషయంలో కోర్టు అనుమతిస్తుంది. లేదా తిరస్కరిస్తుంది. విచారణ పూర్తికాకముందే ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయటం మూలంగా వారు నేరస్థులు అని అర్థం వచ్చేలా అవకాశం ఇచ్చారు. ఈ బెయిల్ కేసులన్నింటిలోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఒకటి రెండు కేసుల్లో తప్పు జరిగిందనుకోవచ్చు. కానీ అన్ని కేసుల్లోనూ రద్దు కావడం గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నది.
జస్టిస్ స్వర్ణకాంత శర్మ కుటుంబ సభ్యులు బీజేపీ ప్రభుత్వంలో ఎంప్యానెల్ అయ్యారు. వారు ప్రస్తుత భారత ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్గా ఉన్న తుషార్ మెహతా (సీబీఐ కేసులో అతనే వాదిస్తారు) ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో, రాజకీయ ప్రత్యర్థులతో సంబంధం ఉన్న కుటుంబ సభ్యులు ఉన్న న్యాయమూర్తి నుంచి నిష్పాక్షికత ఎలా ఆశించగలరు? ఒక న్యాయమూర్తి ఏ సిద్ధాంతానికి చెందిన కార్యక్రమాలకు హాజరైనా అది సాధారణమే కావచ్చు. కానీ ఆమె ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన చెందిన అధివక్త పరిషత్ కార్యక్రమాలకు నాలుగుసార్లు హాజరయ్యారు. ఇతర సిద్ధాంతాల కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఇలాంటి పరిస్థితిలో నిష్పాక్షిక తీర్పు ఎలా ఆశించాలి?
కేజ్రీవాల్ చేసిన వాదనల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆయన రిక్యూసల్ కోరిన అదే న్యాయమూర్తి ఎదుట నిలబడి మాట్లాడటం చాలా అసౌకర్యకరమైన పరిస్థితి. కానీ ఆయన తన వాదనలు వినిపించిన తీరు అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆయన వాదనలు దేశంలో ఏదో మార్పునకు నాంది పలికాయి. అదేమిటో ఇప్పుడే చెప్పలేం, కానీ న్యాయవ్యవస్థను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆ మార్పును అనుభూతి చెందుతున్నారు. ఈడీ వేసిన పీఎంఎల్ఏ (Prevention Money Laundering Act) కేసు విచారణ జరుగకుండానే కొట్టుకుపోయేది, కానీ ఆ కేసులో ఈడీ పిటిషన్ లేకుండానే స్టే వచ్చింది.
కేజ్రీవాల్ తన వాదనల్లో ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తారు. ఇప్పటివరకు కోర్టులపై పూర్తి విశ్వాసం తనకు ఉందని. అయితే, ఈ ప్రత్యేక సందర్భంలో కొన్ని పరిస్థితుల వల్లే ఈ తిరస్కరణపై అభ్యర్థన చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇది వ్యవస్థపై అవిశ్వాసం కాదు, కానీ న్యాయ ప్రక్రియపై విశ్వాసాన్ని మరింత బలపర్చే ప్రయత్నమని ఆయన వివరించారు.
కేజ్రీవాల్ చేసిన అత్యంత ప్రభావవంతమైన వాదనల్లో ఒకటి: Justice should not only be done, but also be seen to be done. ఈ భావన ద్వారా ఆయన చెప్పినది ఏమిటంటే..న్యాయం జరిగితే సరిపోదు. ప్రజలకు అది న్యాయంగా జరిగిందనే నమ్మకం కూడా కలగాలి. ఈ భావన భారత న్యాయవ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం కలిగిన సూత్రం. ఈ వాదనలు పూర్తిగా న్యాయపరమైనవే అయినప్పటికీ, వాటి వెనుక రాజకీయ ప్రాధాన్యం కూడా ఉన్నది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయ ఒత్తిళ్లు, విచారణ సంస్థల పాత్ర వంటి అంశాలు ఈ కేసు చుట్టూ తిరిగాయి. కేజ్రీవాల్ తన వాదనల్లో ఈ అంశాలను ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా స్పృశించారు.
ప్రజాస్వామ్యంలో అధికారాల సమతౌల్యం (Balance of Power) ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. ఈ వాదనలు కేవలం ఒక కేసుతో ముగిసిపోవు. భవిష్యత్తులో..న్యాయమూర్తుల రిక్యూసల్ అంశం, న్యాయవ్యవస్థలో పారదర్శకత, రాజకీయ కేసుల్లో నిష్పాక్షిక విచారణ ఇవన్నీ చర్చకు వస్తే, కేజ్రీవాల్ వాదనలు ఉదాహరణగా నిలుస్తాయి. భారత ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థపై విశ్వాసం అత్యంత కీలకం. అదే సమయంలో, ఆ విశ్వాసం నిలబెట్టేందుకు న్యాయం జరిగిందనే భావన కూడా ప్రజల్లో ఉండాలి అనే సూత్రం తరచూ ప్రస్తావనకు వస్తుంది.
ఇంత బలమైన విషయాలను ప్రస్తావిస్తూ కేజ్రీవాల్ వాదనలను పరిగణలోకి తీసుకుని జస్టిస్ స్వ ర్ణకాంత శర్మ తనంత తానుగా ఈ కేసు నుంచి తప్పుకోవడం సమంజసం. ‘నిర్మొహమాటంగా నువ్వు తప్పుకో, ఎందుకంటే మాకు అనేక భయా లు, సంశయాలు ఉన్నాయి, నీ సమక్షంలో మాకు న్యాయం జరుగదు’ అంటూ తన కేసు ఉన్న హైకోర్టు జడ్జి ముందుకు వెళ్లి చెప్పడం ఆషామాషీ కాదు. అంతేకాకుండా ‘నీ కొడుకు, కూతురు పేర్లు బీజేపీ ప్రభుత్వం నియమించిన ఎంప్యానెల్ లిస్టులో ఉన్నాయి. వారిద్దరూ తుషార్ మెహతా ఆఫీస్లో పనిచేస్తున్నారు’ అని అన్నారు. అంతేకాదు.. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. అంటే ఇక్కడ ఏమి తీర్పు ఇవ్వాలో నిర్ణయం జరిగిందని, తనకు న్యాయం జరుగదని, కనుక కేసు నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తికి చెప్పడానికి చాలా గుండె ధైర్యం కావాలి.
– (వ్యాసకర్త: న్యాయవాది) తన్నీరు శ్రీరంగారావు