ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించేది కాదు. పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేక వచ్చిన ధరకు అమ్ముకునే పరిస్థితులు. కానీ ప్రస్తుతం అన్నదాతలకు గోదాముల గోస తీరింది. రాష్ట్ర ప్రభుత్వం పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో ఎనిమిదేండ్ల కాలంలోనే గిడ్డంగుల సామర్థ్యం మూడున్నర రెట్లు పెరిగింది. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. సాగునీటి వసతి మొదలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వరకు అన్నదాతకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. గోదాముల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. 2014 వరకు జిల్లాలో కేవలం 39,640 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా.. ప్రస్తుతం 20 గోడౌన్లు నిర్మించడంతో వాటి సామర్థ్యం 1,43,140 మెట్రిక్ టన్నులకు పెరిగింది. వీటికి అదనంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కింద 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు అందుబాటులోకి వచ్చాయి.
కమ్మర్పల్లి, ఏప్రిల్ 12: వ్యవసాయ రంగానికి అన్ని విధాలా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పోత్సాహాన్ని అందిస్తున్న తెలంగాణ సర్కారు.. రైతులు పండించిన ధాన్యం నిల్వ కోసం అంతే ప్రాధాన్యతను ఇస్తున్నది. సాగు నీటి రంగాన్ని బలోపేతం చేయడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడులు గణనీయంగా వస్తున్నాయి. పంట వేసే ముందు పెట్టుబడి మొదలు.. పంట చేతికి వచ్చాక కొనుగోలు కేంద్రాల ఏర్పాటు దాకా అన్నదాతకు అండగా నిలుస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. రైతు పండించిన ధాన్యం నిల్వ చేసుకునే గోడౌన్ల సంఖ్య, సామర్థ్యం పెంచింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2014 వరకు అరకొరగా ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ గోడౌన్ల సౌకర్యం.. తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఎనిమిదేండ్ల కాలంలోనే ఎంతో మెరుగుపడింది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ గోడౌన్ల మొత్తం సామర్థ్యం కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. స్వరాష్ట్రంలో ఈ సామర్థ్యం కేవలం ఎనిమిదేండ్లలోనే 25.4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ గిడ్డంగుల సామర్థ్యం కేవలం గడిచిన ఎనిమిదేండ్లలోనే మూడున్నర రేట్లు పెరిగింది. ఈ వృద్ధి జిల్లాలో సాగునీటి సౌకర్యం పెరగడంతో అందుతున్న దిగుబడుల నిల్వ సౌకర్యానికి అనుకూలంగా ఉంది.
2014 వరకు జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయ మార్కెట్ గోడౌన్లు ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం నిల్వ చేయడానికి గిడ్డంగుల ఆవశ్యకతను సమైక్య పాలనలో విస్మరించారు. గ్రామాల్లో పండే ధాన్యం పట్టణ ప్రాంత మార్కెట్లకు తరలిస్తారని, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే గోడౌన్లు నిర్మించారు. కానీ స్వరాష్ట్రం సిద్ధించాక.. గ్రామీణ ప్రాంతంలో పండే ధాన్యాన్ని అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనడం, లేదంటే రైతులకు ధాన్యాన్ని మార్కెట్లో ధర లభించే వరకు నిల్వ ఉంచడం కోసం గ్రామాల్లోనే గిడ్డంగులు నిర్మించాలన్న ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేసింది. దీంతో నేడు నిజామాబాద్ జిల్లాలో గ్రామాల్లోనే పెద్ద సంఖ్యలో భారీ గోడౌన్లు కనిపిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో 2104 వరకు సాగు నీటి రంగంపై అప్పటి ప్రభుత్వాల వివక్ష, నిర్లక్ష్య ధోరణితో వ్యవసాయ రంగం దీనస్థితిలో ఉండేది. మూడేండ్లకు ఒకసారి మాత్రమే ఎస్సారెస్పీ నుంచి తగినంత సాగు నీటిని ఇచ్చుకోలేని దుస్థితి. ఎత్తిపోతలు అలంకార ప్రాయంగా, ఓ ఏడాది నడిస్తే మరో ఏడాది బంద్ అనే చందంగా ఉండేవి. కాలువలు ధ్వంసమై, చెరువులు మరమ్మతులకు నోచుకోక, మాటు కాలువలు ఆనవాళ్లు కోల్పోయి ఉండేవి. ఎత్తిపోతల కింద చెరువులు ఉన్నా నామమాత్రంగా నీరందేది. వాగులు వేసవి రాక ముందే వట్టి పోయి ఎడారిలా మారేవి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, కుంటలు, ఎత్తిపోతల కింద ఆయకట్టు ఓ ఏడాది పండితే మరో ఏడాది ఎండినట్లే అన్నట్లు వ్యవసాయం సాగేది. అధ్వానమైన, వేళాపాలాలేని, లో వోల్టేజీ కరెంటుతో బోరుబావుల కింద నష్టాల సాగు జరిగేది. సమయానికి ఎరువులు అందక, పంట వేసే కాలానికి పెట్టుబడి డబ్బులు లేక, పంటలను తెగుళ్లు ఆశిస్తే పరిశీలించి తగు నివారణ చర్యలు సూచించే వ్యవసాయ సిబ్బంది సరిపడా లేక, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక సాగు విస్తీర్ణం నానాటికి తగ్గుతూ వచ్చేది. పంట దిగుబడులు కూడా తక్కువగా వచ్చేవి.
స్వరాష్ట్రం సిద్ధించాక జిల్లాలో సాగు నీటి రంగం అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఎస్సారెస్సీ పునర్జీవం పథకంతో కొత్తగా సాగు నీటి లభ్యత మార్గాలను సృష్టించారు. కాకతీయ, వరద, లక్ష్మీ కాలువల కింద ఎత్తిపోతలను కావాల్సినన్ని రోజులు నడుపుకొని నడి వేసవిలోనూ వానకాలాన్ని తలపించేలా చెరవులు మత్తడి దూకే పరిస్థితి కల్పించారు. నిజాంసాగర్, గుత్ప, అలీసాగర్ కాలువలను బాగుచేశారు. 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేశారు.కాలువలు మూడు కాలాలూ నిండు కుండల్లా మారాయి. వాగుల్లో విరివిగా చెక్డ్యామ్లు కట్టారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. వరి కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం గ్రామాల్లోనే కొంటున్నారు. ఇలా సాగునీటి రంగం బలోపేతం కావడం, ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడులు పెరిగాయి. పెరిగిన ధాన్యం దిగుబడులకు అనుగుణంగా నూతనంగా భారీ సామర్థ్యం కలిగిన గోడౌన్లను నిర్మించారు.
2014కు ముందు జిల్లాలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గోడౌన్లు తక్కువగా, అరకొర సామర్థ్యంతో మాత్రమే ఉండేవి. అప్పట్లో జిల్లావ్యాప్తంగా కేవలం 39 వేల 640 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 34 గోడౌన్లు ఉన్నాయి. 2014 అనంతరం కేవలం ఎనిమిదేండ్ల కాలంలోనే మరో 20 గోడౌన్లను నిర్మించారు. కొత్తగా గోడౌన్ల నిర్మాణంతో జిల్లాలో ధాన్యం నిల్వ సామర్థ్యం 39 వేల 640 మెట్రిక్ టన్నుల నుంచి ఏకంగా లక్షా 43 వేల 140 మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే 2014 అ నంతరం జిల్లాలో లక్షా రెండు వేల 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు అదనంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కింద 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్లు అందుబాటులో ఉన్నాయి.