Hanmanth Shinde | పెద్ద కొడప్ గల్ (జుక్కల్), ఆగస్టు 27 : జుక్కల్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యలపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మండలంలోని మహ్మదాబాద్ చౌరస్తా నుండి జుక్కల్ చౌరస్తా వరకు గురువారం పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ చౌరస్తా నుండి కండెబాల్లూరు వరకు రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించి బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సైతం పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రపోతోందని, అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే గుర్తించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2015-16లో రహదారిని వెడల్పు చేసి బీటీ రోడ్డు నిర్మించామని, రోడ్డు మరమ్మతులకు రావడంతో తమ ప్రభుత్వ హయాంలో రోడ్డు పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. జుక్కల్ చౌరస్తా నుండి కండెబాల్లూరు వరకు రోడ్డు పనులను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు సురక్షితమైన రహదారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల కోసం,అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర కొనసాగుతోందని ఆయన చెప్పారు.