బిజీగా పెద్దపల్లి-కరీంనగర్- నిజామాబాద్ రైల్వే లైన్
నిత్యం పదికిపైగా గూడ్స్ రైళ్ల రాకపోకలు
వేలాది వాహనాలతో రద్దీగా కరీంనగర్-మంచిర్యాల రహదారి
కరీంనగర్-తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక నిత్య నరకం
ఆర్వోబీ కోసం నాడు ఎంపీగా వినోద్ కుమార్ ప్రయత్నాలు
రెండేళ్ల క్రితమే దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రతిపాదనలు
తర్వాత ఢిల్లీ స్థాయిలో పెండింగ్లో ఫైల్
కనీస చొరవచూపని నేటి ఎంపీ బండి సంజయ్
శనివారం మరోసారి రైల్వేబోర్డుకు లేఖ రాసిన వినోద్
కరీంనగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కీలకమైన పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వేలైన్లో కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న కరీంనగర్-తీగలగుట్టపల్లి క్రాసింగ్ వద్ద రాకపోకలకు ప్రజలు చుక్కలు చూస్తున్నారు. ఒకనాడు ఒక్క రైలు మాత్రమే ఈ క్రాసింగ్ మీదుగా వెళ్లేది. కానీ, నిజామాబాద్ దాకా రైల్వే లైన్ పూర్తయిన తర్వాత రైళ్ల సంఖ్య భారీగా పెరిగింది. డీజిల్, పెట్రోల్, బొగ్గు, వివిధ రకాల సరుకుల గూడ్స్ రైళ్లన్నీ ఈ మార్గం గుండానే వెళ్తున్నాయి. రైల్వే అధికారుల గణాంకాల ప్రకారం చూస్తే.. రోజుకు పది నుంచి పన్నెండు రైళ్లు ఈ క్రాసింగ్ మీదుగా వెళ్తున్నాయి. అందులో ఎక్కువగా ఉదయం నుంచి సాయంత్రం మధ్యలో నడిచేవే. దీంతో రైలు వచ్చి వెళ్లే సమయంలో ఇక్కడి ప్రధాన రహదారి (కరీంనగర్-మంచిర్యాల)పై ఉన్న క్రాసింగ్ వద్ద గేటు వేస్తున్నారు. ఒక్కోసారి రైలు వచ్చి వెళ్లడానికి సుమారు 20 నుంచి 30 నిమిషాల టైం తీసుకుంటున్నది. దీంతో ఈ రహదారి మీదుగా వెళ్లే వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు.
ప్రతిపాదనలకు మోక్షమేది?
కరీంనగర్ మంచిర్యాల రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన గత ఎంపీ ప్రస్తుత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఈ ప్రాంతంలో ఆర్వోబీ నిర్మించాలని కేంద్ర మంత్రులకు, గతంలో రైల్వే బోర్డుకు అనేక సార్లు లేఖలు రాశారు. అయితే, ఇక్కడ ఒకటి రెండు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయంటూ కేంద్ర మంత్రులు దాటవేస్తూ వచ్చారు. అయినా వినోద్ ఒత్తిడి మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం రెండేళ్ల క్రితం ఆర్వోబీ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. అయితే, వాటిని ఫాలో చేసి ఆర్వోబీ వచ్చేలా చూడాల్సిన ప్రస్తుత ఎంపీ బండి సంజయ్కుమార్ ఈ విషయంలో పట్టీపట్టనట్లుగా వ్యహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. అంతేకాదు, కేంద్రం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లోనూ కరీంనగర్-తీగలగుట్టపల్లి ఆర్వోబీ ప్రస్తావన లేకపోవడం సంజయ్పై వచ్చే విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలను చూస్తే ఇప్పట్లో ఈ పనులు జరుగుతాయా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆర్వోబీల నిర్మాణం కోసం తన వాటా ప్రకారం చెల్లింపు చేయడానికి తాజా బడ్జెట్లో నిధులను ప్రతిపాదించింది. ఇటీవలే ప్రకటించింది. ఈ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణం విషయంలో జరుగుతున్న జాప్యం వల్ల ప్రజలు అవస్థల పాలవుతున్నారు. మున్ముందు మరిన్ని రైళ్లు పెరుగుతాయని, మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాహనదారులు చెబుతున్నారు.
రైల్వేబోర్డుకు మరోసారి వినోద్ లేఖ..
తీగలగుట్టపల్లి వద్ద క్రాసింగ్పై వెంటనే ఆర్వోబీ పనులు చేపట్టాలని కోరుతూ కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్కు శనివారం వినోద్కుమార్ లేఖ రాశారు. నిర్మాణ ఆవశ్యకతను ఆ లేఖలో వివరించడంతోపాటు ఎంపీగా 2014 నుంచి 2019 మధ్య లేఖలు రాసిన విషయాన్ని ఆ లే ఖలో గుర్తు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం ద్వారా రైల్వే బోర్డుకు కరీంనగర్ ఆర్వోబీ ప్రతిపాదనలు పంపి రెండేళ్లవుతున్నా ఢిల్లీ స్థాయిలో ఇంకా పెండింగ్లోనే ఉండడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్వోబీ మంజూరు విషయంపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, పనులను వెంటనే ప్రారంభించాలని రైల్వేబోర్డు చైర్మన్ను కోరారు.
వినోద్కుమార్కు వినతి..
ఆర్వోబీ నిర్మాణం కోసం స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, వాసాల రమేశ్, చొక్కారెడ్డి, చంద్రారెడ్డి, తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఆనంద్, నగునూరు గ్రామ సర్పంచ్ శ్రీధర్ శనివారం కరీంనగర్లోని నివాసంలో వినోద్ కుమార్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.