ఉమ్మడి జిల్లాకు కీర్తి శిఖరమై.. రాష్ట్ర ప్రతిష్టకు మణిహారమైన పోచారం ప్రాజెక్టు సగర్వంగా తలెత్తుకునేలా చేస్తూ చరిత్రపుటల్లో నిలుస్తున్నది. వ్యవసాయ రంగ అభివృద్ధికి చిహ్నమైన ఈ ప్రాజెక్టు.. కామారెడ్డి జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలోని పోచారంలో నిర్మించారు. నిజాం హయాంలో నిర్మించిన ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఇప్పటికీ వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. వందేండ్లు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుకు నిజాం హయాంలో ఉమ్మడి జిల్లాలో నిర్మించిన తొలి జలాశయంగా పేరున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు దుంకుతూ సందర్శకులకు కనువిందు చేస్తున్నది. పర్యాటక స్థలంగా ఆకట్టుకున్నది. ప్రాజెక్టు పక్కన ఉన్న పోచారం అభయారణ్యం పర్యాటకులను ఆకర్షిస్తున్నది.
కామారెడ్డి, జూలై 24: నిజాం నవాబుల హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు శతవసంతాలను పూర్తి చేసుకున్నది. పోచారం ప్రాజెక్టు రెండు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ కనువిందు చేస్తున్నది. వేలాది ఎకరాల పంటలకు వరప్రదాయినిగా మారింది. పక్కనే ఆహ్లాదకర వాతావరణంలో ఉండే అభయారణ్యం, విడిది కో సం నిజాం రాజులు కట్టించిన కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పోచారం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. దీంతో ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది. నిజాం ప్రభుత్వ ఇంజినీర్ నవాబ్ జంగ్ బహదూర్ మార్గదర్శకత్వంలో పోచారం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 1917లో నిజాం ప్రభుత్వం మంచిప్ప బ్రూక్లోని నాగిరెడ్డిపేట మండలం పోచా రం గ్రామంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది.
మంచిప్ప అడవి నుంచి చిన్నచిన్న కాలువలు, ఒర్రెలు కలిపి ఆలేరు వాగుపై పోచారం ప్రాజెక్టుగా రూపాంతరం చెందిం ది. పోచారం ప్రాజెక్టు నిర్మాణ పనులు 1922లో పూర్తయ్యాయి. అప్పట్లో రూ.27.11లక్షలతో నిర్మించారు. 17వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు వేయగా, 58కిలోమీటర్ల ప్రధాన కాలువను నిర్మించారు. 1931లో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం తో ఎల్లారెడ్డి మండలంలో పలు గ్రామాలు ముంపునకు గురికావడంతో పోచారం ఆయకట్టు తగ్గింది. ప్రస్తుతం 10,500 ఎకరాల ఆయకట్టుగా స్థిరీకరించినప్పటికీ మరో 2, 3వేల ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందిస్తున్నది. ప్రాజెక్ట్ పొడవు 1.7 కిలోమీటర్లు ఉండగా, ఇది మంచిప్ప బ్రూక్ మీదుగా 21 అడుగుల ఎత్తయిన కట్టను కలిగి ఉన్నది. దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువల నిర్మాణం ఉంది. దీనికి 73 పంపిణీదారులు ఉన్నారు.
సాగు, తాగునీటికి ప్రధాన వనరుగా పోచారం డ్యాం
ఈ ప్రాజెక్టు 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. సీల్ట్ కారణంగా ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 1.82టీఎంసీకి తగ్గింది. పోచారం రిజర్వాయర్ స్థాయి (ఎఫ్ఆర్ఎల్) 14.64 అడుగులుకాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి ఉన్నది. ప్రాజెక్ట్ నీటి వినియోగం కోసం ఏ,బీ జోన్లుగా విభజన చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద 10,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు ఏ జోన్లో 1 నుంచి 48 పంపిణీదారులు, బీ జోన్లో 49-73 పంపిణీదారులుగా కేటాయించారు. వానకాలంలో ఏ,బీ జోన్ల రైతాంగానికి, యాసంగిలో మాత్రం ఒక్క జోన్ పరిధి రైతాంగానికి సాగునీరు విడుదల చేస్తారు. పోచారం నీటి కేటాయింపు విషయంలో ప్రతి సంవత్సరం జోన్ మార్చుతూ అందరికీ అవకాశం కల్పించడం విశేషం. ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల పరిధిలోని 42గ్రామాలకు, మెదక్ జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఒక చెరువు నుంచి మరొక చెరువుకు నీరు ప్రవహించేలా గొలుసుకట్టు పద్ధతిలో పోచారం ప్రధాన కాలువ నిర్మించారు. ఆలేరు వాగుపై నిర్మించిన పోచారం ప్రాజెక్టు నిండిన ప్రతి ఏడాది కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. మంజీరా నదికి ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో ఇబ్బడిముబ్బడిగా చెక్డ్యాము లు, చిన్నతరహా ప్రాజెక్టులను నిర్మించడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గిపోయింది. దీనికి తోడు సింగూరు నిర్మాణంతో అరకొర వరద సైతం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్ట్కు ప్రధాన నీటి వనరుగా పోచారం నిలిచింది. ఏటా 3 నుంచి 4టీఎంసీల నీరు పోచారం నుంచి నిజాంసాగర్కు వెళ్తుంది.
పర్యాటకుల సందడి
ప్రకృతి అందాలతో పోచారం ప్రాజెక్టు పరిసరాలు కనువిందు చేస్తున్నాయి. నవంబర్తోపాటు వేసవికాలంలో వలస పక్షులు ఈ ప్రాంతంలో సందడి చేస్తాయి. ఈ అభయారణ్యంలో జింకలు, దుప్పిలు, నెమళ్లు, అడవిపందులతోపాటు ఇతర జంతువులు సంచరిస్తుంటాయి. ఉదయం, సాయంత్రం ప్రాజెక్టు పరిసరాల్లో పక్షులు కనువిందు చేస్తుంటాయి. వీటిని చూసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వానలకు పోచారం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తోపాటు పలువురు ప్రముఖులు కృషి చేశారు. ప్రతి సంవత్సరం మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు హైదరాబాద్ నుంచి వేలాది మంది పర్యాటకులు పోచారం ప్రాజెక్ట్, అభయారణ్యాన్ని సందర్శిస్తుంటారు.
చెక్కు చెదరని కట్టడాలు
వానకాలంలో పచ్చదనాన్ని పంచే పోచారం ప్రాజెక్టు ఈ ఏడాదితో వందేండ్లు పూర్తి చేసుకున్నది. నిజాంరాజులు ఈ ప్రాంతంలో విడిది కోసం ఎత్తయిన గుట్టపై నిర్మించిన పురాతన కట్టడాలు వందేండ్లు పూర్తయినా చెక్కు చెదరలేదు. ఈ ప్రాజెక్టుతోపాటు పక్కనే పోచారం అభయారణ్యం కనువిందు చేస్తుంది. నిజాం రాజులు ఈ ప్రాంతంలో జంతువులను వేటాడేందుకు హైదరాబాద్ నుంచి వచ్చేవారని పూర్వీకులు చెబుతుంటారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గుట్టపైకి రోడ్డుమార్గం నిర్మించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని పర్యాటకులకు ఆహ్లాదం పంచేలా ప్రాజెక్టులో బోటును ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి 36 కి.మీ, నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి 90కి.మీ, రాజధాని హైదరాబాద్ నుంచి 110 కి.మీ, మెదక్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో పోచారం ప్రాజెక్టు ఉంది.
పోచారంతో సస్యశ్యామలంగా మారిన ప్రాంతం
నిజాంహయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టుతో సాగునీటి వనరులు పెరిగాయి. ఎల్లారెడ్డి, నాగిరేడిపేట మండలాల్లో పం టలు పండే పరిస్థితి ఏర్పడింది. రెండు పంటలు పండేలా ఓ చక్కని ప్రణాళికతో నిర్మించిన ప్రాజెక్టు వందేండ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉన్నది.
– మనోహర్రెడ్డి, జడ్పీటీసీ, నాగిరెడ్డిపేట
రైతుల అవసరాన్ని గుర్తించి కట్టిండ్రు..
పోచారం ప్రాజెక్టును రైతుల అవసరాలను గుర్తించి నిర్మించారు. వందేం డ్ల క్రితమే ఈ ప్రాంత అవసరాల కోసం నిర్మించి సాగునీటి వనరులను పెంచా రు. పర్యాటకంగా ఈ ప్రాజెక్టు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో పార్కు నిర్మాణంతో ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. పోచారం ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉండడం, వందేండ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది.
– లింగం గౌడ్, రైతు, గోలిలింగాల్