న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యూండాయ్ ఎస్యూవీ మోడల్ కారు క్రెటా అరుదైన మైలురాయిని దాటింది. కంపాక్ట్ ఎస్యూవీ క్యాటగిరీలో తిరుగులేని మోడల్గా నిలిచి ప్రజల మనస్సులు దోచుకున్నది.
ఈ మోడల్ కారు 2015లో విపణిలోకి విడుదలైంది. గత ఆరేండ్లలో ఆరు లక్షల కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది నుంచి కరోనా లాక్డౌన్తో ఆటోమొబైల్ విక్రయాలు మందకోడిగా సాగాయి. కానీ, క్రెటా మోడల్ కార్ల అమ్మకాల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించలేదు.
వాస్తవంగా గత ఎనిమిది నెలల్లోనే చివరి లక్ష కార్లను హ్యుండాయ్ విక్రయించింది. అత్యధికంగా ఇప్పటి వరకు డీజిల్ వేరియంట్ కార్లు 3,99,787 యూనిట్లు అమ్ముడయ్యాయి.
గతేడాది మార్చిలో సెకండ్ జనరేషన్ క్రెటా కారును ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీఎస్-6 నిబంధనలు అమల్లోకి వచ్చాక ఈ కారు మూడు ఇంజిన్లలో అందుబాటులోకి వచ్చింది.
1.4 లీటర్ టర్బో పెట్రోల్, 1.5లీటర్ పెట్రోల్,1.5లీటర్ డీజిల్ ఇంజిన్లతో ఈ మోడల్ కారు లభిస్తుంది. ఇక ఐదు రకాల ట్రాన్స్మిషన్ ఆఫర్లను హ్యుండాయ్ తన కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.
గత 14 నెలల్లో 1,39,204 కార్లు అమ్ముడయ్యాయి. మొత్తం విక్రయాల్లో 20శాతం ఆటోమేటిక్ వేరియంట్వే కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో 10,60,750 ఎస్యూవీలను విక్రయించారు.
గతేడాదిలో అమ్ముడైన ఎస్యూవీల్లో 11 శాతం క్రెటా మోడల్ కార్లే. ఈ మోడల్ ఎగుమతులు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు హ్యుండాయ్ 2,21,626 క్రెటా మోడల్ కార్లను ఎగుమతి చేసింది.