మారుతి లాంటి దర్శకుడు వచ్చి కథ చెప్తే కచ్చితంగా ఏ హీరో అయినా ఓకే అంటాడు. ఎందుకంటే ఈయన కథలు మినిమమ్ గ్యారెంటీ ఉంటాయి. మారుతి సినిమాలలో ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేదు. బాబు బంగారం, శైలజారెడ్డి అల్లుడు కూడా యావరేజ్ అనిపించాయి కానీ ప్లాపులు కాదు. మిగిలిన సినిమాలన్నీ బాగానే ఆడాయి. గత సినిమా ప్రతిరోజూ పండగే కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు మారుతి. నిజానికి ఈ కథ రవితేజ కోసం రాసుకున్నాడు మారుతి. కచ్చితంగా ఈ సినిమా చేస్తాను అని మాటిచ్చిన తర్వాతే మారుతి ఈ కథను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత చివర్లో పక్కకు తప్పుకున్నాడు మాస్ రాజా.
అందుకే చివరి నిమిషంలో హీరోగా గోపీచంద్ ఎంపికయ్యాడు. కేవలం పారితోషికం తక్కువగా ఇస్తున్నారనే ఒకేఒక్క కారణంతోనే మారుతి సినిమా నుంచి రవితేజ బయటికి వచ్చేసాడనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో కాదు.. అంతకంటే బలమైన కారణం మరోటి ఉందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ సినిమా అంటే మిగిలిన ప్రొడక్షన్ హౌజ్ లతో పోలిస్తే తక్కువ పారితోషికం ఇస్తారు. కానీ రవితేజ ఈ సినిమాకు నో చెప్పడానికి మరో ప్రధాన కారణం కథ.. ఈ మధ్యే త్రినాథరావు నక్కిన చెప్పిన కథకి రవితేజ ఓకే చెప్పాడు. ఈ కాంబినేషన్ కు సంబంధించిన సినిమాపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కేవలం ఈ సినిమా కోసమే మారుతి సినిమాకు రవితేజ నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటంటే మారుతి చెప్పిన కథలో హీరో లాయర్.. ఇప్పుడు త్రినాథరావు చెప్పిన కథలో కూడా హీరో లాయరే. ఈ రెండు కథలు కూడా కోర్టు నేపథ్యంలోనే సాగనున్నాయి. ఒకేసారి రెండు సినిమాల్లో లాయర్ పాత్రలు చేయడం రవితేజకు అంతగా నచ్చకపోవడంతోనే మారుతికి నో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. రెండు కథలు బేరీజు వేసుకుని.. ఏది బాగుందో సెలెక్ట్ చేసుకున్నాడు మాస్ రాజా. ఒకవేళ ఇదే సమయంలో త్రినాథరావు కూడా మరో కథ చెప్పుంటే కచ్చితంగా రెండు సినిమాలకు రవితేజ ఓకే చెప్పేవాడేమో..? కానీ అలా జరగలేదు. ఏదేమైనా కూడా మరుతి సినిమా వదిలేసినందుకు గోపీచంద్కు బంపర్ ఆఫర్ వచ్చింది.