ముంబై: నన్ను ఎందుకు ప్రేమించవు?… అని అమ్మాయిని ప్రశ్నించిన ఒక వ్యక్తి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ దారుణం జరిగింది. 18 ఏళ్ల సుఖ్ప్రీత్ కౌర్ అలియాస్ కాశీష్ ప్రీత్పాల్సింగ్ గ్రంథి, ఔరంగాబాద్లోని దేవగిరి కళాశాలలో బిజినెస్ అడ్మినిష్ట్రేషన్ డిగ్రీ చదువుతున్నది. ఔరంగాబాద్కు చెందిన 20 ఏళ్ల శరణ్ సింగ్ సేథీ శనివారం మధ్యాహ్నం దేవగిరి కళాశాల సమీపంలో ఆ విద్యార్థిని అడ్డుకున్నాడు. ‘నువ్వు నన్ను ఎందుకు ప్రేమించవు?’ అని ప్రశ్నించాడు. వెంట తెచ్చిన కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న వేదాంత్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. విద్యార్థిని సుఖ్ప్రీత్ కౌర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెను హత్య చేసిన నిందితుడు శరణ్ సింగ్ సేథీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాసిక్లోని నిఫాద్ తాలూకా లాసల్గావ్లోని సోదరి ఇంట్లో అతడు ఉన్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న ఔరంగాబాద్ స్థానిక పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నాసిక్ పోలీసులు ఆ ఇంటికి వెళ్లి నిందితుడ్ని ఆదివారం అరెస్ట్ చేశారు.