సాధారణంగా వెన్ను ఎముకల్లో జరిగే అరుగుదల కన్నా మించి జరగడాన్ని స్పాండిలోసిస్ అంటాం. ఈ సమస్యనే డిస్క్ ప్రొలాప్స్, స్పాండిలోలిస్థిసిస్, కెనాల్ స్టెనోసిన్ అని కూడా అంటారు. వెన్నుపై శక్తికి మించి బరువు, ఒత్తిడి పెరగడం, తగినంత వ్యాయామం లేకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనివల్ల ముఖ్యంగా వెన్నెముక బలం తగ్గి అప్పటికే అరిగిన వెన్నెముకపై అకస్మాత్తుగా అధిక ఒత్తిడి పడడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.
అవగాహన..
పై లక్షణాలను గుర్తించినపుడు వెంటనే దగ్గర్లోని జనరల్ సర్జన్ లేదా న్యూరో సర్జన్ని సంప్రదించడం మంచిది. పలు పరీక్షలు చేయించుకుని సమస్యను తెలుసుకోవచ్చు. ఎక్స్రే ద్వారా మెడ, నడుము భాగాల్లోని ఎముకల పటుత్వం, ఆకారాల్లోని లోపాలను గమనించవచ్చు. ఎమ్ఆర్ఐ స్కానింగ్ ద్వారా మరింత క్షుణ్ణంగా సమస్యను నిర్ధారించే వీలుంటుంది. ఈ పరీక్ష ద్వారా వెన్నులో ఉన్న అన్ని అవయవాల పరిస్థితి తెలుస్తుంది. వెన్నుపూస, నరాల ఒత్తిడికి కారణమైన పరిస్థితులు తెలుసుకుని సరైన చికిత్స మార్గాలను అన్వేషించవచ్చు. ఎముకల్లోని లోపాలను తెలుసుకోవడానికి సీటీ స్కానింగ్ సహాయపడుతుంది.
చికిత్స
స్పాండిలోసిస్ ప్రథమదశలో ఉన్నవారు పలురకాల మందులను వాడడం ద్వారా సమస్యను ఎదుర్కొనవచ్చు. మెడ, నడుము నొప్పితో బాధపడేవారు నొప్పి నివారణ మాత్రలు (పెయిన్ కిల్లర్స్) వాడి తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చు. కానీ వీటిని ఎక్కువ కాలం వాడడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చేయి, కాలు నొప్పితో బాధపడేవాళ్ళు న్యూరో మాడ్యులేటర్ డ్రగ్స్ (నరాల మీద పనిచేసేవి) అయిన ప్రెగాబాలిన్(Pregabalin), గాబాపెంటిన్ (Gabapentin) వాడితే ఫలితం ఉంటుంది. అయితే ఏ మందులైనా డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే వాడడం మంచిది.
శస్త్ర చికిత్స
రెండు రకాల శస్త్ర చికిత్సల ద్వారా స్పాండిలోసిస్ సమస్యను పరిష్కరించవచ్చు. మొదటి పద్ధతిలో ఒత్తిడి నిర్మూలన పద్ధతులను వాడడం ద్వారా సమస్యను పరిష్కరిస్తారు. ఒత్తిడిని ఎదుర్కొంటున్న నరాలు, ఎముకల్లో ఒత్తిడిని నివారిస్తారు. సాధారణంగా డిస్క్ప్రొలాప్స్ సమస్యకు చేసే చికిత్సను ‘డిస్కెక్టమి’ అని అంటారు. ఇది రెండు రకాలు. ఓపెన్ పద్ధతిలో సమస్య భాగంలో చర్మాన్ని చీల్చి సమస్యను గుర్తించి ఒత్తిడిని నిర్మూ లిస్తారు. రెండవ పద్ధతిలో సూక్ష్మద్వార పద్ధతి (మైక్రోస్కోపి లేదా ఎండోస్కోపి) ద్వారా ఒత్తిడిని తగ్గిస్తారు. రెండోరకం చికిత్సలో పాడైపోయిన డిస్క్ని తీసేసి, దాని స్థానంలో కృత్రిమ డిస్క్ని అమరుస్తారు. చాలా భాగాల్లో ఒత్తిడిని ఎదుర్కొనే వారికి ‘లామినెక్టమీ’ ద్వారా ఒత్తిడిని నిర్మూలిస్తారు.
స్పాండిలోసిస్ సమస్యను ఎదుర్కొనే వారిలో బలం పెంచే పద్ధతుల ద్వారా కూడా చికిత్స చేస్తారు. రెండు వెన్నుపూసలు ఒకదానిపైకి ఒకటి జారడం వల్ల కలిగే బాధకు రెండింటి మధ్యా కృత్రిమ పరికరాలను అమర్చి మద్దతివ్వడం ద్వారా వెన్నెముకకు బలం చేకూరుస్తారు. సాధారణంగా ఈ పద్ధతిలో టైటానియం పరికరాన్ని వాడటం వల్ల ఉపయోగాలు ఉంటాయి. ఈ చికిత్సను కూడా ఓపెన్ లేదా మినిమల్లీ ఇన్వాసివ్ (సూక్ష్మదారిలో) పద్ధతిలో చేయవచ్చు.
ఈ వ్యాధితో బాధపడేవారు సమస్యను గుర్తించిన వెంటనే చికిత్స ప్రారంభించడం మంచిది. ఏ రకం చికిత్స తీసుకున్నా ఫిజియోథెరపీ (వ్యాయామం) చేయడం ద్వారా మరింత త్వరగా సమస్యనుంచి ఉపశమనం లభిస్తుంది.
లక్షణాలు..
ఈ సమస్యతో బాధపడేవారిలో ముఖ్యంగా మెడ, నడుము భాగాల్లో నొప్పి, ఒక చేయి లేదా ఒక కాలు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలికంగా ఈ సమస్యను ఎదుర్కొనేవారిలో రెండు చేతులు, రెండు కాళ్ళలో తీవ్రమైన నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఒక కాలు లేదా చేయి బలహీనంగా మారడం, మొద్దు బారడం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు. అయినప్పటికీ సమస్యను గుర్తించి జాగ్రత్త పడకపోతే మల, మూత్ర వ్యవస్థలపై కూడా ప్రభావం ఉంటుంది.
Dr. S. SRINATH
MBBS (OSM) ; M.Ch (NIMS)
Consultant Neurosurgeon
Brain & Spine Surgeon
Renova Hospitals, Kompally
18005998989, 9121241005