Volvo XC40 Recharge | స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా దేశీయ మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్సీ40 రీచార్జీని ఆవిష్కరించింది. బెంగళూరు ప్లాంట్లో తొలిసారి అసెంబ్లింగ్ చేసిన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఇది. దీని ధర రూ.55.9 లక్షలు ఉంటుందని సంస్థ తెలిపింది. ఒక్కసారి రీచార్జి చేస్తే 418 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. కేవలం 4.9 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది.అయితే, రెండు విద్యుత్ మోటార్లతో నడిచే ఈ కారు గరిష్ట వేగాన్ని 180 కేఎంపీహెచ్కు పరిమితం చేశారు.
బుధవారం నుంచి ఎక్స్సీ40 రీచార్జి లగ్జరీ కార్ల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే వోల్వో కారు `ఎక్స్సీ40 రీచార్జి` డెలివరీ చేస్తారు. వోల్వో కార్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్లి, ఆన్లైన్లో రూ.50 వేలు చెల్లించి కారు కోసం ఆర్డర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా తెలిపారు. 408 హెచ్పీ విద్యుత్ సామర్థ్యంతో వివిధ సేఫ్టీ ఫీచర్లతో వోల్వో ఎక్స్సీ40 రీచార్జి కారు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది.
78కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో రూపుదిద్దుకున్న వోల్వో ఎక్స్సీ40 రీచార్జి కారు 150 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 40 నిమిషాల్లో 80 శాతం చార్జి అవుతుంది. స్టాండర్డ్ 11కిలోవాట్ల ఏసీ చార్జర్తో బ్యాటరీ చార్జి కావడానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది.