మహబూబ్నగర్, వరంగల్, హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటిదాకా ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. బుధవారం నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవం కాగా, గురువారం మరో మూడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ నుంచి కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి ఎన్నికయ్యారు.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండటంతో మిగిలిన 6 స్థానాల్లోనూ నామినేషన్ దాఖలు చేసిన ఇతర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకొని టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. కొన్నిచోట్ల ఎన్నికలు అనివార్యమైనా అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు సునాయాసంగా గెలవనున్నారు. ఎన్నికలు జరిగే చోట ఆయా జిల్లాలకు చెందిన మంత్రులకు బాధ్యతలను పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఖమ్మం, మెదక్ స్థానాల్లోనే పోటీచేస్తున్న కాంగ్రెస్ ప్రభావం అంతగా ఉండదని ఆ పార్టీలోనే అనుకొంటున్నారు. బరిలో నిలవటం కన్నా గౌరవంగా తప్పుకొంటేనే బెటర్ అని, లేకపోతే హుజూరాబాద్ అనుభవమే ఎదురవుతుందని ఆ పార్టీలోని మెజారిటీ వర్గం అభిప్రాయపడుతున్నది.
విజయం టీఆర్ఎస్దే
12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్దే సునాయస విజయమని తేలిపోయింది. టీఆర్ఎస్కు ఉన్న సంఖ్యాబలం రీత్యా ఎన్నిక నామమాత్రమే కానున్నది. ఎన్నికలు అనివార్యమైనా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 5,329 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 90 శాతానికి పైగా టీఆర్ఎస్ ఓటర్లే. మిగతా పార్టీ నేతలు, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినవారు కూడా సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరారు. సంఖ్యాబలం రీత్యా వార్ వన్ సైడ్ కానున్నదని తెలుస్తున్నది.
మంత్రులకు బాధ్యత
ఎన్నికలు అనివార్యమైతే ఖమ్మం జిల్లా బాధ్యతలు మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డికి, కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆదిలాబాద్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డికి అప్పగిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.
కేటీఆర్ అభినందనలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అభినందించారు. గురువారం అబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్తో కలిసి మహబూబ్నగర్ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారిని అభినందించారు. వరంగల్ నుంచి ఏకగ్రీవమైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని మంత్రి ఫోన్లో అభినందించారు.