భారతీయ క్రిప్టో పన్ను విధానంపైనే ఇప్పుడు అంతటా చర్చ.
కొత్త పన్నులతో క్రిప్టో పరిశ్రమకు ముప్పేనన్న ఆందోళన ట్రేడర్లు, ఎక్సేంజ్ ఆపరేటర్లలో కనిపిస్తున్నది.
వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్న క్రిప్టో ట్యాక్స్ పాలసీలో మోదీ సర్కారు గరిష్ఠంగా 30% పన్నును, 1% టీడీఎస్ను ప్రతిపాదించింది మరి.
న్యూఢిల్లీ, మార్చి 25: కేంద్ర ప్రభుత్వ కొత్త పన్ను విధానాలపై క్రిప్టో పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ రకమైన పాలసీ అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీని నిర్వీర్యం చేయగలదని ట్రేడర్లు, ఎక్సేంజ్ ఆపరేటర్లు భయపడుతున్నారు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్న ఈ నయా ట్యాక్స్ పాలసీ.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను గత నెల 1న ప్రకటించిన బడ్జెట్లో క్రిప్టో కరెన్సీలపై ఆదాయం పన్ను (ఐటీ)ను మోదీ సర్కారు గరిష్ఠంగా ప్రతిపాదించిన సంగతి విదితమే. 30 శాతం ఆదాయ పన్నుతోపాటు సెస్సు, సర్చార్జీలను వేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. జూదం, లాటరీ టిక్కెట్లు, గుర్రపు పందేలపైనా ఈ తరహాలోనే అధిక పన్ను పడుతుండటం గమనార్హం. ఇదీగాక 1 శాతం టీడీఎస్ (ఆదాయ వనరు వద్దే పన్ను కోత)నూ విధించారు. ఈ టీడీఎస్పైనే ఇప్పుడు క్రిప్టో ట్రేడర్లు, ఎక్సేంజ్ ఆపరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఏటా రూ.10వేలకు మించి క్రిప్టో లేదా వర్చువల్ కరెన్సీలకు జరిపే చెల్లింపులపై 1 శాతం టీడీఎస్ను కేంద్రం ప్రతిపాదించింది. బహుమతుల రూపంలో ఉన్నా టీడీఎస్ తప్పదు. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానుండగా, ఇదే జరిగితే ఎక్సేంజ్లు దివాలా తీయడం ఖాయమేనన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రతీ క్రిప్టో లావాదేవీపై 1 శాతం టీడీఎస్ వేస్తే ఎక్సేంజ్ల్లో ద్రవ్య కొరత తలెత్తుతుందని క్రిప్టో ఎంటర్ప్రెన్యూర్స్, ఎక్సేంజ్ ఆపరేటర్లు భయపడుతున్నారు. కొత్తగా వచ్చే మదుపరులూ ఇండస్ట్రీకి, ట్రేడింగ్కు దూరంగా ఉంటారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే 30 శాతం పన్ను అనేది ఇప్పుడు అసలు అంశం కాదని, 1 శాతం టీడీఎస్సే సమస్యని అంటున్నారు. మరికొందరు నిపుణులైతే ఏప్రిల్ 1లోగా తమ వద్దనున్న క్రిప్టో హోల్డింగ్స్ను అమ్మేయాలని, కొత్తగా మళ్లీ కొనుక్కోవడం ఉత్తమమని ట్రేడర్లకు సలహా ఇస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీర్ఘకాల పెట్టుబడులే మేలంటున్నారు.
క్రిప్టో కరెన్సీలపై గరిష్ఠ పన్నులు వేస్తున్న దేశం భారత్ మాత్రమే కాదు. గతంలో థాయ్లాండ్ సైతం ఆ దేశంలో గరిష్ఠ స్థాయిలో 15 శాతం పన్ను వేసింది. దీనివల్ల చిన్న, రిటైల్ మదుపరుల నుంచి భారీగా వ్యతిరేకత ఎదురైంది. ఫలితంగా ఈ 15 శాతం పన్నును తొలగించడమేగాక, రెగ్యులేటెడ్ ఎక్సేంజ్లపై ట్రేడింగ్ కోసం 7 శాతం తప్పనిసరిగా ఉన్న వ్యాట్ నుంచి కూడా ట్రేడర్లకు మినహాయింపును ఇవ్వాల్సి వచ్చింది. దక్షిణ కొరియా సైతం 20 శాతం పన్నును ప్రతిపాదించి, చివరకు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక ఆసియా దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న క్రిప్టో హబ్లలో ఒకటిగా ఉన్న సింగపూర్లోనైతే క్రిప్టోపై మూలధన లాభాల పన్నే లేదు. ఐరోపా దేశాల్లోనూ పన్ను రహిత క్రిప్టో ప్రోత్సాహక విధానాలు నడుస్తున్నాయి.
మొదట్నుంచీ లాభమే తప్ప ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేయడం లేదు కేంద్రంలోని బీజేపీ సర్కారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వీలైతే ప్రైవేటీకరణకు దిగుతున్న మోదీ ప్రభుత్వం.. అన్ని రంగాల్లో కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నది చూస్తూనే ఉన్నాం. చివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నగదు నిల్వల్నీ డివిడెండ్ల రూపంలో దోచుకు తింటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాంటి చట్టం తేకుండానే క్రిప్టో కరెన్సీలపై పన్నులు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఇది పలు విమర్శలకు దారితీస్తున్నది. ఆర్బీఐ వద్దంటున్నా.. ఏమాత్రం స్పష్టత లేకున్నా.. క్రిప్టోకరెన్సీలపై పన్నులు వేసి తీవ్ర ఒడిదుడుకులుండే క్రిప్టో పరిశ్రమకు మోదీ సర్కారు చట్టబద్ధత కల్పించిందని అంతా అంటున్నారు. అమాయక మదుపరులు నష్టపోతే ఎవరిది బాధ్యత అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆదాయం కోసం చట్టాలకు పదును పెడుతున్న కేంద్రం.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయిప్పుడు.