అన్నం తింటూ టీవీ చూస్తున్నం. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన మా చిన్నాడు, 21 ఏండ్లు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో హింసాకాండను చూస్తూ, ఏం జరిగిందని అడిగితే, అగ్నిపథ్ గురించి చెప్పిన. ‘ఏం జరుగుతున్నది నాన్నా. అంతా వాళ్లిష్టమేనా? అట్లెట్ల చేస్తరు? కరోనా ముందు సెలెక్టయిన వారిని ఇప్పుడెట్ల కాదంటరు. నాలుగేండ్లు ఉద్యోగం చేసినంక పొమ్మంటే, పెళ్లాం పిల్లలతో అతడెట్ల బతుకాలె?’ అన్నాడు అసహనంగా! అంతకన్నా చర్చ జరగలేదు. చెప్పడం నాకిష్టమూ లేదు!
ఏం జరుగుతున్నది ఈ దేశంలో?.. ఏదో జరుగుతున్నది.. జరుగకూడనిది! అన్ని వైపుల నుంచీ ఒకరకమైన ఒత్తిడి. అందరిపైనా! విపక్షాలు ఒత్తిడిలో.. మీడియా ఒత్తిడిలో.. న్యాయవ్యవస్థ ఒత్తిడిలో.. రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడిలో.. అధికారులు ఒత్తిడిలో.. రైతులు ఒత్తిడిలో.. యువత ఒత్తిడిలో.. పేదలు ఒత్తిడిలో.. చివరికి అధికార బీజేపీ నేతలైనా, దానికి గురుతుల్యమైన సంఘమైనా, సమాజమైనా… ఒత్తిడిలోనే! లేనిదెవరు? దేశం దేశమే ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టున్నది! బయటే తిరుగుతున్నా బందిఖానాలో ఉన్న ఫీలింగ్! ఫోన్ కరకర అన్నదంటే నన్నెవరో వింటున్నారన్నమాటే.. ఏ నిఘా నేత్రమో నన్ను చూస్తున్నదన్న మాటే! అభివృద్ధి నమూనా చూపించి అధికారంలోకి వచ్చిన వారు, ఏ నమూనానూ పాటించకుండా, ‘మేం నిర్ణయం తీసేసుకుంటాం, పర్యవసానాన్ని దేశం అనుభవిస్తుంది’ అని ఒకదాని తర్వాత ఒకటిగా ప్రయోగాలు చేస్తుంటే, ఫలితాన్ని తట్టుకోలేక దేశం పరితపిస్తున్నది. పరిణతి లేని రాజకీయుల చేతిలో ప్రయోగశాలగా మారిపోయింది మన భారత్!
బ్రిటిష్ ఇండియాలో కూడా ఏదైనా జరిగినప్పు డు, కనీసం బ్రిటన్ పార్లమెంటులో అయినా చర్చ జరిగేది. స్వతంత్ర భారతంలో ఆ మాత్రం స్వాతంత్య్రమూ కరువైంది. భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించే నిర్ణయాలు కూడా అలవోకగా, ఆషామాషీగా!.. సమావేశాల్లేవు, సంప్రదింపులు లేవ్, కమిటీల్లేవ్, పైలట్ ప్రాజెక్టుల్లేవ్, రాయబారాల్లేవు. ఏకాభిప్రాయాల్లేవు. భిన్నాభిప్రాయాలకు తావు లేదు. ‘నేను చెప్తా-నువ్వు విను. నేను చేస్తా-నువ్వు చూడు.. ఇంతే!’ హిట్ అయితే మా ఘనత, ఫట్ అయితే విపక్షాల కుట్ర! నాగరిక సమాజం తన లక్షణాలను, స్వభావాన్ని కోల్పోతున్నదా? వ్యక్తులు ప్రధానమై వ్యవస్థలు నిర్వీర్యమైన దుస్థితి. వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరించే మూర్ఖత్వం, లోతుగా ఆలోచించడానికి ఇష్టపడని దుందుడుకుతనం, అన్నీ తమకే తెలుసనే సర్వజ్ఞత్వం, దేన్నైనా మాయ చేయవచ్చనే అతి విశ్వాసం, చరిత్రను తిరగరాయాలనే అత్యుత్సాహం, గుణపాఠాలు నేర్చుకోలేని అపరిపక్వత… రాజనీతి లేదిప్పుడు, అంతా రాజకీయమే! పౌరుడి ఆత్మవిశ్వాసాన్ని అధికారిక ఆధిపత్యం వెక్కిరిస్తున్న వేళ ఇది. సహనశీలతను సంచలనం చెండాడుతున్న సమయమిది! ఇదింకా సాగుతుందా? ఆగుతుందా? అమెరికా నుంచి వచ్చిన నా మిత్రుడు శ్రీకాంతరెడ్డి అన్నట్టు, పుష్ప, కేజీఎఫ్ సినిమాల సక్సెస్ ఇస్తున్న సందేశం ఏమిటి? నక్సలైట్ కథాంశం ఎందుకు మళ్లీ హిట్ ఫార్ములాగా మారుతున్నది?
దేశాన్ని థియేటర్గా మార్చి, 8 ఏండ్లు బంధించి, చూపించిన సినిమా క్లైమాక్స్కు చేరుకున్నట్టు కనిపిస్తున్నది. దృశ్యం మారిపోతున్నది. కళ్ల ముందు కనిపించే వైఫల్యాన్ని కూడా కాదని కనికట్టు చేయడం ఎంతకాలం సాధ్యం? సమాజపు దొంతరల మధ్య, భిన్నతరాల మధ్య పెరుగుతున్న అంతరాలు పంతాలుగా మారుతున్నయి. బంధించి ఉంచిన బాధలేవో బయటపడేందుకు ఉబికి వస్తున్నట్టున్నయి. 4జీ-జియో ఎలక్ట్రానిక్ తోలుబొమ్మలాటలో ఆడించిన బొమ్మలిప్పుడు, రోబో సినిమాలోలాగా ప్రాణం పోసుకుంటున్నట్టున్నయి. ఇనుములో హృదయం కాదు; ప్లాస్టిక్ స్క్రీన్ నుంచి పదునైన ఆలోచన మొలుస్తున్నది. నాడు రైతులైనా, నేడు యువకులైనా! అప్పటి ప్రేక్షకుడు ఇప్పుడు పాత్రధారి. నిన్నటి ఉద్వేగం, నేటి ఉద్రేకం. మనసులో మసిలిన అగ్నిపర్వతం నుంచి మొలిచిన అగ్గిపుల్ల అంటించిన జ్వాల.. ఈ మంటలు! అబద్ధాల ప్రచారానికి నిన్న ఇచ్చిన సెల్ఫోన్-సోషల్ మీడియా.. నేడు వాస్తవాన్ని పంచుకునే ఆయుధం. ప్రజలను ప్రతిసారీ మొబిలైజ్ చేయనక్కర్లేదు. రేగిన మంటలు విస్తరించి విలీనమైనట్టు, కొన్నిసార్లు రగిలిన ఉద్వేగాలు కూడా మనుషుల్ని ఒక్క దగ్గరకు చేరుస్తాయి. మీడియా, న్యాయవ్యవస్థ, ఇన్ఫ్లుయెన్సర్లు… ఇలా ప్రతి ఒక్కరి విశ్వసనీయతనూ పథకం ప్రకారం చంపేసినప్పుడు, ప్రతి ఘటనా తనంతతానే ప్రతిఘటనకు విశ్వసనీయతను తెచ్చుకుంటుంది. దీర్ఘకాల పర్యవసానాలను ఊహించే ఆలోచనాపరులను మందబలంతో మనం అణచివేసినప్పుడు, ఆలోచన వంద రకాల లోచనాలను వెతుక్కుని వస్తుంది. మీరు అనాలోచితంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఆలోచించి తెలుసుకోండి అనే హక్కు ఎక్కడిది? ఆయుధం పట్టడం నేర్చిన చేతుల్ని నాలుగేండ్ల తర్వాత అర్ధాంతరంగా సమాజంలో వదిలేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారా? కఠోర క్రమశిక్షణ అవసరమైన చోట టూరిస్టు సైనికులు ఇమడగలరా అని ఆలోచించారా? దేశాన్ని కాపాడే దళంలోకి నాలుగేళ్లకో నాలుగు లక్షల మందిని పంపించి, తొలగిస్తే కలిగే ముప్పును ఆలోచించారా? ఈ పని చేస్తే ఎట్లా ఉంటదని ఎవరితోనైనా ఆలోచించారా? మరి ఆలోచించాలని ఇప్పుడెలా అడగగలరు? అన్నింటికీ పైసల లెక్కే పరామితి కాదు. కిసాన్లు, జవాన్లు.. వంటి కొన్ని మినహాయింపులుంటాయి. అందుకే రుణ భారతమిప్పుడు రణ భారతమవుతున్నది. నువ్వు మార్మికంగా చేస్తే, సమాజం ధార్మికంగా స్పందిస్తుంది. నువ్వు మోటుగా చేస్తే, సమాజం ఘాటుగా బదులిస్తుంది. నువ్వు దాయాలనుకుంటే సమాజం బరిమాతల నిలబెడుతుంది. నువ్వు నిర్ణయాన్ని రుద్దితే సమాజం ధిక్కరించి తీరుతుంది. భ్రమలు ఎల్లకాలం నిలువవు. మాయ ఎల్లెడెలా పని చేయదు. తప్పులెన్నడమే తమ పని అనుకున్నప్పుడు, తమరి తప్పులెన్నే వాడూ తప్పక బయల్దేరుతాడు. ప్రతి ధ్వనికీ ఒక ప్రతిధ్వని ఉండనే ఉంటుంది… కొంచెం ఆలస్యంగానైనా! జాతి, మతం, ప్రాంతం, బతికే హక్కు ప్రతి ఒక్కడి ఉద్వేగం. దాన్ని కాదంటే మిగిలేది ఉద్రేకం. దేశ సేవ చేసేందుకు ఉరకలెత్తే ఉడుకు రక్తానికి, ఆకలితోపాటు ఆయుధ శిక్షణ కూడా ఇచ్చి వదిలేస్తే ఏమైపోతుంది ఈ దేశం?!
– తిగుళ్ల కృష్ణమూర్తి