GST | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అనతికాలంలోనే తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదుగుతున్నది. తొమ్మిదేండ్లలోనే గణనీయమైన వృద్ధిరేటును సాధిస్తున్నది. కేంద్రంలోని మోదీ సర్కారు అక్కసు వెళ్లగక్కుతున్నా.. సొంతకాళ్లపై నిలబడుతూ ఆర్థికంగా ప్రబల శక్తిగా మారుతున్నది. పటిష్ట ఆర్థిక ప్రణాళికతో ఏటికేడు ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ముందుకెళ్తున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) వసూళ్లలో గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. కేంద్రం జీఎస్టీని ప్రవేశ పెట్టిన తర్వాత గడిచిన ఐదు ఏండ్లలో ఏటా జీఎస్టీ వసూళ్లలో వృద్ధిరేటును నమోదు చేస్తూనే ఉన్నది. సీఎం కేసీఆర్ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. తొమ్మిదేండ్ల క్రితంతో పోలిస్తే గణనీయమైన మార్పు వచ్చింది.
ప్రత్యేకించి.. ప్రజల ఆర్థిక స్థితుగతులు రెట్టింపు అయ్యాయి. కొనుగోలు శక్తి ఆశాజనకంగా మారింది. వ్యాపారాలు బాగా వృద్ధి చెందాయి. ఇటువంటి అనేక కారణాలతో జీఎస్టీ రాబడి అనూహ్యంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.28,786 కోట్ల జీఎస్టీ వసూలైతే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.41,889 కోట్ల జీఎస్టీ వచ్చింది. అంటే.. ఐదేండ్లలో జీఎస్టీ రాబడి రూ.13,103 కోట్లు పెరిగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్)కు తెలంగాణ ఆర్థికశాఖ సమర్పించిన నివేదికలో జీఎస్టీ ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవైపు కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాల కంటే తక్కువగానే అందుతున్నా.. తెలంగాణ మాత్రం ఏటికేడు ఆర్థిక వృద్ధిని సాధిస్తూనే ఉన్నది. దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
కేంద్రం జీఎస్టీని ప్రవేశపెట్టిన కొత్తలో.. అం టే 2018-19లో రూ.34,232 కోట్లు వసూలవుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేసింది. ఆ ఏడాది జీఎస్టీ రూపంలో రాష్ర్టానికి రూ.28,786 కోట్ల రాబడి వచ్చింది. అంటే, బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 84 శాతం రాబడి వచ్చినట్టు. ప్రపంచమంతా కరోనాతో ఆర్థికంగా అతలాకుతలం అవుతున్నా, తెలంగాణలో మాత్రం జీఎస్టీ వసూళ్లు ఆశాజనకంగానే వచ్చాయి. కరోనా లాక్డౌన్ అంతా స్తంభించిపోయినప్పటికీ ఆ రెండు సంవత్సరాలు జీఎస్టీ అంచనాలకు అనుగుణంగానే వసూలైంది. 2019-20లో రూ. 31,186 కోట్ల జీఎస్టీ వస్తుందని అంచనా వేయగా, రూ.28,053 కోట్లు వసూలైంది. బడ్జెట్ అంచనాల్లో ఇది 90 శాతం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.32,671 కోట్లు వస్తుందని అంచనా వేయగా, రూ.25,905 కోట్లు వచ్చింది. బడ్జెట్ అంచనాలో ఇది 80 శాతం. ఇక, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,520 కోట్లు వస్తుందని అంచనా వేయగా, రూ.34,489 కోట్ల రాబడి వచ్చింది. బడ్జెట్ అంచనాల్లో ఇది 97 శాతం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.42,189 కోట్లు వసూలవుతుందని అంచనా వేయగా, రూ.41,889 కోట్లు వసూలైంది. బడ్జెట్ అంచనాల్లో ఇది 99 శాతం. ఇలా.. ఏటికేడు జీఎస్టీ వసూళ్లలో వృద్ధిశాతం నమోదవుతూనే ఉన్నది. ఐదేండ్లలోనే జీఎస్టీలో 69 శాతం వృద్ధిరేటు నమోదైంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్థిక వనరులపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి రూపాయిని అభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చిస్తూ.. దాన్ని రెట్టింపు చేయటం ప్రారంభించింది. పన్ను వసూళ్లు, అవగాహన కల్పించటం తదితర అంశాలపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రతిస్థాయిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. మాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్ల జారీని పూర్తిగా తొలగించింది. శాఖాపరమైన పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటుచేసింది. ఎన్నో గొప్ప మార్పులతో పన్నుల రాబడి గణనీయంగా పెరిగింది. అందులోభాగంగానే జీఎస్టీలోనూ అనూహ్య వృద్ధిరేటు నమోదైంది. అందుకే.. తెలంగాణ వాణిజ్య పన్నులశాఖ పనితీరును పరిశీలించేందుకు గుజరాత్, ఉత్తరప్రదేశ్తోపాటు అనేక రాష్ర్టాలు వచ్చివెళ్లాయి. దేశంలోని అనేక రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది.