వరంగల్ అర్బన్ : సురవరం ప్రతాపరెడ్డి అంటే తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సురవరం ప్రతాప రెడ్డి 125వ జయంతి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు.
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మెఫీ (మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా) తెలంగాణ సారస్వత పరిషత్, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య, వైజయంతి ట్రస్టులు సంయుక్తంగా తెలుగు జర్నలిజంలో నాటి నుంచి నేటి వరకు వస్తున్న మార్పులపై సదస్సు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడు, రచయిత, ప్రేరకుడు, క్రియాశీల ఉద్యమకారుడన్నారు. తెలంగాణలో కవులే లేరనే నిందను సవాలుగా తీసుకొని
354 మంది కవులతో కూడిన‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన మహానుభావుడు సురవరం అన్నారు.
నిజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యం చేశాడని ప్రశంసించారు. ఆయన నెలకొల్పిన విలువలను కాపాడటం నేటి జర్నలిస్టుల విధి, పరమావధి కావాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో మన జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం.
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తున్నదని తెలిపారు. వరంగల్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు కృష్ణ వర్ధన్ రెడ్డిని మంత్రి సన్మానించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఐజేయు అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, కార్యదర్శి విరాహత్ అలీ, ప్రెస్ క్లబ్ బాధ్యులు శ్రీధర్ రెడ్డి, వెంకట్, జర్నలిస్టులు పాల్గొన్నారు.