శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. బుధవారం ఆయన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండావందనం చేశారు. అంతకు ముందు ఆలయంలో సంప్రదాయం మేరకు మహాగణపతిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
సీఎం వైఎస్ జగన్, దేవాదాయశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఆలయంలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరో వైపు క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొవిడ్ నేపథ్యంలో నివారణ చర్యలు పాటించడంతో పాటు లోక కల్యాణార్థం కరోనా వ్యాప్తిని అరికట్టేలా ఆలయంలో హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సైతం వివరించారు.