Karnataka CM : కర్ణాటక (Karnataka) లో నాయకత్వ మార్పుపై గత కొన్ని నెలలుగా కొనసాగిన ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు నాయకత్వ మార్పు ఖరారైంది. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) తన మంత్రివర్గానికి తెలియజేశారు. గురువారం తన నివాసంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింట్లో సిద్ధూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. తదుపరి సీఎం ఎవరనేదానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తదుపరి సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించినా.. వారికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
సిద్ధరామయ్య రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ అందుబాటులో లేరు. కుటుంబపరమైన కారణాల రీత్యా ఆయన బెంగళూరు వీడి వెళ్లారు. అయినప్పటికీ సీఎం రాజీనామా ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తున్నది. మరోవైపు, కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపై కూడా ఇంకా ప్రకటన వెలువడలేదు. కొత్త సీఎం శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఉదయం క్యాబినెట్ మంత్రుల కోసం సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు చేపట్టనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజా పరిణామాలతో డీకే సీఎం అవ్వడం ఖాయంగానే కన్పిస్తోంది.
కాగా 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సిద్ధరామయ్య సీఎం అయ్యారు. అయితే అప్పటి నుంచే రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారం జరిగింది. గత ఏడాది చివరలోనే సిద్ధరామయ్య సర్కారుకు రెండున్నరేళ్లు నిండాయి. దాంతో నాయకత్వ మార్పుపై ప్రచారం జోరందుకుంది. కానీ, అలాంటిదేమీ లేదని, ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య ప్రకటించారు. దాంతో ఆ ప్రచారం సద్దుమణిగింది. కానీ అనూహ్యంగా మంగళవారం రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సిద్ధరామయ్య రాజీనామా ప్రకటన చేశారు.