వారం రోజులపాటు ఒడిదుడుకులతో ట్రేడై చివరకు గత వారం 170 పాయింట ్లలాభంతో నిఫ్టీ ముగిసింది. అయితే కీలక రెసిస్టెన్స్ స్థాయిలను అధిగమించడంలో మాత్రం ఈ సూచీ విఫలమైంది. సోమవారంనాటి కనీస స్థాయి నుంచి 707 పాయింట్లు పెరిగినప్పటికీ.. నిలదొక్కుకోలేకపోయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాల ఒత్తిడి, ఒమిక్రాన్ వ్యాప్తి వంటి అంశాలు మార్కెట్ కదలికలను ప్రభావితం చేశాయి. ఐటీ రంగ ఇండెక్స్ కాస్త మార్కెట్ పతనాన్ని అడ్డుకోగలిగినప్పటికీ మిగతా అన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణ స్పష్టంగా కనిపించింది. గత మూడు రోజుల్లోనే ఎఫ్ఐఐలు రూ.7,031.72 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. దీంతో రెండు రోజుల ఇండెక్స్లు పెరిగినా గరిష్ఠ స్థాయిల్లో నిలవలేకపోయాయి. స్వల్పకాల 5, 8 చలన సగటులకు ఎగువన ఒక రోజుకు మించి నిఫ్టీ నిలదొక్కుకోలేకపోయింది. అలాగే 20, 50 రోజుల చలన సగటులు కూడా డౌన్ట్రెండ్లో ఉన్నాయి.
ఈ అంశాలు మార్కెట్ బలహీనతకు నిదర్శనం. రిలేటివ్ స్ట్రెన్త్ ఇండికేటర్ బేరిష్ జోన్లోనే కొనసాగుతున్నది. ఇది కనీసం 45 స్థాయిని అధిగమిస్తే తప్ప మార్కెట్లో ర్యాలీ వచ్చే అవకాశాలు తక్కువ. 100 రోజుల చలన సగటు 17,169. ప్రస్తుతానికి ఇది మద్దతుగా ఉన్నది. ఈ వారం ఈ స్థాయిని దిగి ముగిస్తే తదుపరి మద్దతు స్థాయిగా.. క్రితం కనీస స్థాయిలు 16,782-580 పనిచేస్తాయి. దీర్ఘకాల మద్దతు 16,134 స్థాయిలో ఉన్నది. మళ్లీ అప్ ట్రెండ్ను కొనసాగించాలంటే 17,500 స్థాయిని నిర్ణయాత్మకంగా అధిగమించాలి. ఈ నేపథ్యంలో లాభాలను స్వీకరించడమే ఉత్తమ వ్యూహం.