SBI Q1 Results | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర లాభం 6.7 శాతం తగ్గి రూ.6068 కోట్లకు పడిపోయింది. జూన్ త్రైమాసికంలో ఇన్వెస్ట్మెంట్ బుక్లో నష్టాలతో వడ్డీయేతర ఆదాయం గణనీయంగా పడిపోవడం దీనికి కారణం. పెట్టుబడుల్లో రూ.6,549 కోట్ల నష్టాలతో వడ్డీయేతర ఆదాయం 80 శాతం తగ్గిపోయి రూ.2,312 కోట్ల వద్ద స్థిర పడింది. గతేడాది (2020-21) తొలి త్రైమాసికంలో ఎస్బీఐ రూ.6,504 కోట్ల నికర లాభం గడించింది. అయితే ఎస్బీఐ రూ.8,392 కోట్ల నికర లాభం గడిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు.
నికర వడ్డీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 13 శాతం పెరిగి రూ.31,196 కోట్లకు చేరుకున్నది. ఇక గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా కాసింత పడిపోయింది. గతేడాది రూ.77,347 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.74,998 కోట్లకు పరిమితమైంది.