ముంబై : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూసివేసిన ఆలయాలు దాదాపు ఆరు నెలల తర్వాత గురువారం మళ్లీ తెరుచుకున్నాయి. నవరాత్రి వేడుకల నేపథ్యంలో ఆలయాలను తెరిచేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షిర్డీ సాయిబాబా దేవస్థానం, సిద్ధి వినాయకుడి టెంపులు, ముంబాదేవి ఆలయం, శనిశింగపూర్లోని శనేశ్వర్ దేవాలయం, నాందేడ్లోని ప్రసిద్ధ సచ్ఖండ్ హజూర్ అబ్చల్నగర్ సాహిబ్ గురుద్వారా, అష్టవినాయక్ ఆలయం, మహాలక్ష్మీ ఆలయం, హాజీ మలంగ్ దర్గా, నాసిక్లోని త్రయంబకేశ్వర్, సప్తశృంగి దేవాలయం, పాల్ఘర్లోని జీవదానీ దేవాలయం, పూణేలోని జెజూరి దేవాలయాలు తెరుచుకోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. తప్పనిసరిగా భక్తులు మాస్క్లు ధరించడంతో పాటు కొవిడ్ నిబంధనలన్నీ పాటించాలని ఆదేశించింది. సిద్ధి వినాయకుడి ఆలయానికి వచ్చే భక్తులు ట్రెంపుల్ ట్రస్ట్ యాప్లో క్యూఆర్ కూడ్ ద్వారా ఉచితంగా బుక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఉన్న వారికి దర్శనం కల్పిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు ఆదేశ్ బండేకర్ పేర్కొన్నారు. ప్రతి గంటకు 250 మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. షిర్డీ సాయిబాబా ఆలయం సైతం కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆన్లైన్ బుకింగ్ ఉన్న భక్తులకే బాబా దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు 15వేల మందికే అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబా దేవి ఆలయంలోనూ ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్న భక్తులకే అవకాశం కల్పిస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. భక్తులు టికెట్తో పాటు కొవిడ్ టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ తీసుకురావాలని కోరింది. ఆలయం తెరిగి తెరిచిన సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం సమయంలో ముంబాదేవిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా అన్ని ఆలయాల్లో పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు అనుమతి ఇవ్వడం లేదని ట్రస్టులు తెలిపాయి.