జైపూర్ : రాజస్థాన్ శాసనసభలో బుధవారం బీజేపీ నేత మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతాన్ని ‘మినీ పాకిస్తాన్’ అంటూ సంబోధించారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. మదన్ దిలావర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మేవాత్లో హిందువులు భయభ్రాంతులకు గురవుతున్నారని, దీంతో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు. ‘మేవాత్ ప్రాంతంలో ముప్పు పెరుగుతోంది, అసమర్థ గెహ్లాట్ ప్రభుత్వం కారణంగా మహిళలపై అనేక అత్యాచారాలు, అఘాయిత్యాలు నమోదవుతున్నాయి’ అని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మతమార్పిడులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దొటసారా స్పందిస్తూ.. ‘మీకు (బీజేపీ) హిందూ ముస్లిం రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు. దీంతో మీకు ఒక్క ఓటు కూడా రాదు’ అన్నారు. ఇదిలా ఉండగా.. మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో ఉంటారు. రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్పై సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ను తాలిబానీ ఆలోచన ఉన్న పార్టీగా అభివర్ణించారు.