Priyanka | బుల్లితెరపై ఇటీవల ప్రారంభమైన రియాల్టీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రేమజంటల మధ్య బంధాన్ని పరీక్షించే ఈ షోలో మొత్తం 10 జంటలు ఒక అందమైన మాన్షన్లో పాల్గొంటున్నాయి. ఈ షోలో మొదటగా ఎంట్రీ ఇచ్చిన జంట ప్రియాంక జైన్ – శివ్ కుమార్. షోలో భాగంగా యాంకర్ రాధ జంటలను ప్రశ్నిస్తూ, “మీ పెళ్లి ఎప్పుడు?” అని నేరుగా అడగగా, ప్రియాంక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. “ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాం, కానీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే త్వరలోనే మా పెళ్లి జరుగుతుంది” అంటూ రివీల్ చేసింది. ప్రత్యేకంగా, ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ త్రియుగి నారాయణ్ ఆలయం లో అఖండ ధుని సాక్షిగా వివాహం చేసుకుంటామని వెల్లడించింది.
రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న త్రియుగి నారాయణ్ ఆలయం ఆలయం హిందూ పురాణాల్లో అత్యంత పవిత్ర స్థలంగా గుర్తింపు పొందింది. శివపార్వతుల వివాహం ఇక్కడే జరిగిందని నమ్మకం. ఆ వివాహ సమయంలో వెలిగించిన అఖండ అగ్ని మూడు యుగాలుగా ఇంకా వెలుగుతూనే ఉందని విశ్వాసం. శ్రీ మహావిష్ణువు పార్వతికి అన్నగా కన్యాదానం చేశాడని పురాణ కథనాలు చెబుతాయి. ఈ ఆలయం నిర్మాణం కేదార్నాథ్ ఆలయం ను పోలి ఉంటుంది. ప్రస్తుత నిర్మాణాన్ని ఆది శంకరాచార్యులు సుమారు 1200 సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. సముద్ర మట్టానికి సుమారు 1980 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం, సోన్ ప్రయాగ్కు సమీపంలో ఉంది.
ఆలయంలోని బ్రహ్మశిలను శివపార్వతుల వివాహ వేదికగా భావిస్తారు. అలాగే సరస్వతి కుండ్, విష్ణు కుండ్, రుద్ర కుండ్ వంటి పవిత్ర జలాశయాలు ఇక్కడ ఉన్నాయి. వీటికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. శివపార్వతుల వివాహం జరిగిన ప్రదేశం కావడంతో ఇక్కడ పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని విశ్వాసం. అందుకే ఇటీవలి కాలంలో ఇది ప్రముఖ వెడ్డింగ్ డెస్టినేషన్గా మారింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇక్కడ ఎక్కువగా వివాహాలు జరుగుతున్నాయి. ఈ ఆలయానికి చేరుకోవడానికి సమీప రైల్వే స్టేషన్ హరిద్వార్ రైల్వే స్టేషన్. అక్కడి నుంచి సుమారు 275 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. వాయు మార్గంలో డెహ్రాడూన్ విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. కేదార్నాథ్ యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని సందర్శించడం కూడా సులభం.