ఢిల్లీ ,మే 26: ‘జాతీయ పింఛను వ్యవస్థ’ (ఎన్పీఎస్), ‘అటల్ పెన్షన్ యోజన’ (ఏపీవై) పరిధిలోని “నిర్వహణలోని ఆస్తులు” (ఏయూఎం) 13 ఏండ్ల తర్వాత రూ.6 లక్షల కోట్లు (రూ.6 ట్రిలియన్లు) దాటాయని ‘పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఏయూఎంలో చివరి రూ.లక్ష కోట్లు కేవలం 7 నెలల్లోనే వచ్చాయని వెల్లడించింది. కొన్నేళ్లుగా 74.10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 28.37 లక్షల మంది ప్రభుత్వేతర రంగ వ్యక్తులతో ఎన్పీఎస్ చందాదారుల్లో గణనీయమైన వృద్ధిని పీఎఫ్ఆర్డీఏ చూసింది. వీరితో కలిపి మొత్తం చందాదారుల సంఖ్య 4.28 కోట్లకు పెరిగింది.
“రూ.6 ట్రిలియన్ల ఏయూఎం మైలురాయిని చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. ఏడు నెలల్లోపు, 2020 అక్టోబర్లో 5 ట్రిలియన్ల దగ్గరున్నాం. ఎన్పీఎస్, పీఎఫ్ఆర్డీఏ పట్ల చందాదారులకు ఉన్న నమ్మకానికి ప్రస్తుత ఘనతే నిదర్శనం. ఈ మహమ్మారి కాలంలో, పదవీ విరమణ ప్రణాళికలకు, ఆర్థిక భద్రతకు వ్యక్తులు ప్రాధాన్యమిస్తున్నారు” అని పీఎఫ్ఆర్డీఏ అధ్యక్షుడు సుప్రతిం బందియోపాధ్యాయ వెల్లడించారు. ఈ ఏడాది మే 21 నాటికి, ఎన్పీఎస్, ఏపీవై చందాదారుల సంఖ్య 4.28 కోట్లు చేరగా, ఏయూఎం రూ.603,667.02 కోట్లకు పెరిగింది.