వన్యప్రాణి చట్టానికి కేంద్రం మార్పులు.. జీవవైవిధ్య చట్టానికీ సవరణలతో బిల్లు ఏనుగులు సహా పలు జాతుల కనుమరుగు.. ఆదివాసీలకు, ఆయుర్వేదానికి పెను ముప్పు రాష్ర్టాల అధికారాలకు మోదీ సర్కారు గండి.. ఆఫీస్ ఆర్డర్ల పేరుతోనూ చట్టాలకు బొక్కలు ఒకటేమో వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972, ఇంకొకటి జీవవైవిధ్య చట్టం-2002.. ఈ రెండు చట్టాలకు సవరణలు చేస్తున్నట్టు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందు ఉంచింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఈ బిల్లులను తేవటంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావటంతో జీవవైవిధ్య బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, వన్యప్రాణి బిల్లును
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపింది. ఈ కమిటీలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి. మరి ఆ రెండు చట్టాల్లో చేపట్టే సవరణలు ఏంటి? వాటి పర్యవసానాలేంటి? అని లోతుగా పరిశీలిస్తే.. కేంద్ర కుట్రపూరిత వైఖరి బట్టబయలవుతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలను చెప్పుచేతుల్లో పెట్టుకోవాలి.. చెప్పినట్టు ఆడించుకోవాలి.. కావాలంటే హక్కులను హరిస్తాం.. అధికారాలకు కత్తెర వేస్తాం.. మాక్కావల్సింది ఒక్కటే.. మాది మాత్రమే నడవాలి. మేము చెప్పిందే చేయాలి. ఇదీ కేంద్రంలోని బీజేపీ తీరు. రాష్ర్టాలను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారు.. ఇప్పుడు జీవవైవిధ్య చట్టానికి (బయోడైవర్సిటీ యాక్ట్-2002) సవరణలు ప్రతిపాదించింది. జీవవైవిధ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలుంటాయి. కానీ కేంద్రం ఏకపక్షంగా బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఆ బిల్లు ఆమోదం పొందితే రాష్ర్టాల హక్కులకే కాకుండా, విలువైన దేశ సంపద కార్పొరేట్లు, విదేశాల చేతుల్లోకి వెళ్లిపోతుంది. జీవవైవిధ్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే ఈ సవరణలు చేపట్టామని చెప్తున్నా.. చట్టం ద్వారా ఈ రంగంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుంది. అంటే.. అడవులను అమ్మేసి, వ్యాపార వనరుగా మార్చటమే కేంద్రం అసలు కుట్ర. ఈ బిల్లుతో అటవీ వనరులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విలువైన ఔషధ మొక్కలు కనుమరుగై, ఆయుర్వేదానికి ముప్పు ఏర్పడుతుందని చెప్తున్నారు. ఖనిజాల తవ్వకంతో రేడియోధార్మికత పెరిగి పశుపక్ష్యాదుల సమతుల్యతకు ప్రమాదం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలోని 240 దేశాల్లో కేవలం 17 దేశాల్లోనే మెరుగైన జీవవైవిధ్యం ఉన్నట్టు పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అందులోనూ భారత్లో జీవవైవిధ్యం మరింత ఎక్కువగా ఉన్నదని పేర్కొంటున్నారు. ఎంతో విలువైన ఔషధ మొక్కలు, జీవరాశులు భారత్ సొంతం. ఇప్పటికే ఎంతో విలువైన సంపదను ఇతర దేశాలు దోచుకెళ్లడమే కాకుండా వాటిపై పేటెంట్ హక్కులు దక్కించుకొని కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నాయి. ఒంగోలు గిత్త, బాస్మతి బియ్యం, ఎర్ర చందనం, వేప, పసుపు వంటి సంపదపై ఇతర దేశాలు పేటెంట్ పొందాయి.
జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేసేవారి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు మూడు స్థాయిల్లో నియంత్రణ సంస్థలను ఏర్పాటుచేశారు. జాతీయస్థాయిలో జాతీయ జీవవైవిధ్య మండలి. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర జీవవైవిధ్య అథారిటీ, క్షేత్రస్థాయిలో గ్రామ జీవవైవిధ్య మండలి. వీటిలో గ్రామ మండలికే ఎక్కువ అధికారాలున్నాయి. క్షేత్రస్థాయిలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించేది, రక్షణ కల్పించేది గ్రామ పంచాయతీలే. అయితే, ఈ నియంత్రణ వ్యవస్థలను నీరుగార్చేందుకు కేంద్రం చట్టంలో సవరణలు చేసింది. దీనివల్ల అటవీ, జీవవైవిధ్య రక్షణకు ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడవులు, వన్యప్రాణుల వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలుంటాయి. బిల్లు ముసాయిదా రూపకల్పనలో రాష్ర్టాల నుంచి అభిప్రాయాలను తీసుకోకుండా కేంద్రం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసింది. కేంద్రం బిల్లు రూపొందించేటప్పుడు రాష్ర్టాలు, స్థానిక సంస్థలు, ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
– పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వర్
జీవవైవిధ్య సవరణ బిల్లు ద్వారా విలువైన దేశ సంపదను విదేశాలు దోచుకుపోయే ప్రమాదం ఉన్నది. కార్పొరేట్ సంస్థలు లాబీయింగ్ చేస్తాయి. ప్రతి కార్పొరేట్ పరిశోధన సంస్థకు ఇతర దేశాలతో సంబంధం ఉంటుంది. విలువైన జీనోమ్ను తస్కరించే ప్రమాదం ఏర్పడుతుంది.
– ప్రముఖ జీవవైవిధ్య శాస్త్రవేత్త డాక్టర్ తులసీదాస్రావ్
వన్యప్రాణి, జీవవైవిధ్య చట్టాలకు సవరణ బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. పర్యావరణ అనుమతులపై చాటుగా ఆఫీస్ ఆర్డర్లు తీసుకొస్తున్నది. గత కొన్ని నెలలుగా చూస్తే కేంద్ర పర్యావరణ శాఖ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో దేశ పర్యావరణ నిబంధనలను బలహీనపరుస్తున్నది. సాధారణంగా సవరణలకు ప్రజాభిప్రాయం అవసరం. కానీ, ఆఫీస్ ఆర్డర్లకు ఏం అవసరం లేదు. అలా.. కేంద్ర ప్రభుత్వం జనవరి 17న, 24న రాష్ర్టాలకు ఆఫీస్ ఆర్డర్లను జారీ చేసింది. జనవరి 17న జారీచేసిన ‘స్టార్ రేటింగ్ సిస్టమ్’ ఆఫీస్ ఆర్డర్ ప్రకారం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం పర్యావరణ అనుమతుల ప్రక్రియ వేగంగా పూర్తవ్వాలి. ఇందులో అనుమతులకు పట్టే సమయం తగ్గాలి. ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. జనవరి 24న జారీ చేసిన ఆఫీస్ ఆర్డర్ ప్రకారం.. అసాధారణ పరిస్థితుల్లో అటవీ ప్రాంతాల్లోని ఒక హెక్టార్ వరకు స్థలాన్ని నివాస ప్రాజెక్టులకు కేటాయించవచ్చు అని రాష్ర్టాలకు స్పష్టం చేసింది. ఆ భూమి వాడకానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి. ఆ భూమిలో పరిశ్రమలు, రెసిడెన్షియల్ కాలనీలు, సంస్థలు, రీహాబిలిటేషన్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతి లేదు. అయితే, ‘అసాధారణ సందర్భాలు’ పదానికి మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.