శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. శ్రీనగర్లోని షేర్ ఐ కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్)లో వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తనకు వ్యాక్సిన్ వేసిన వైద్య బృందానికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు. ఇంతకు ముందు ఒమర్ అబ్దుల్లా తండ్రి, ఎన్సీ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కరోనా పాజిటివ్గా పరీక్షించారు.
అనంతరం ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అంతకు ముందే ఆయన వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. జనవరి 16న ప్రారంభమైన.. టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వ్యక్తులకు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 8.70 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.