సాధారణంగా మనిషికి ఏదైన అనారోగ్యం వచ్చిందంటే వెంటనే వైద్యున్ని సంప్రదిస్తాం. జలుబు, జ్వరం వస్తే అది తగ్గడానికి, కిడ్నీలో రాళ్లు వస్తే అవి కరిగిపోవడానికి లేదా వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం మనం చూస్తున్న వైద్య పద్ధతులు. కానీ హోమియో వైద్యంలో రోగానికి కాదు రోగికి చికిత్స చేస్తారు. అదేంటి రోగం వచ్చిన వారినే రోగి అంటారు కదా అంటే అక్కడే ఉంది.
రోగానికి మందు తాత్కాలిక ఉపశమనం
ఏదైన జబ్బు చేసినప్పుడు వెంటనే దాన్ని తగ్గించడం రోగికి తాత్కాలిక ఉపశమనం కలిగించడమే. హోమియో వైద్య విధానంలో వ్యాధికి కాకుండా సదరు వ్యాధి రావడానికి గల కారణాలను విశ్లేషిస్తారు. వ్యాధితో పాటు దాని మూలాలను వెలికితీయడం హోమియో ప్రత్యేకత. భారతీయ సంప్రదాయ వైద్య విధానాల్లో ఒకటైన అయుష్లోని హోమియో వైద్యవిధానానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ముఖ్యంగా ఇది దీర్ఘకాలిక వ్యాధులకు మంచి చికిత్స అందిస్తుంది.
సారుప్య సిద్ధాంతం ప్రకారం చికిత్స
హోమియో వైద్యవిధానం సారుప్య సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధానంలో వ్యాధి రావడానికి ఎంత సమయం పడుతుందో అది నయం కావడానికి కూడా అంతే సమయం పడుతుందనేది సారుప్య సిద్ధాంతం. సాధారణంగా ఏ వ్యాధి కూడా మనిషికి వెంటనే అటాక్ కాదు. వ్యాధి సోకడానికి ముందు శరీరంలో కొన్ని రకాల ప్రక్రియలు జరుగుతాయి. దశలవారీగా వ్యాధి కారకం రూపాంతరం చెంది ఒక వ్యాధిగా మారుతుంది. హోమియో వైద్యంలో ఒక వ్యక్తికి వచ్చిన వ్యాధిపై పూర్తి విశ్లేషణ (క్లీనికల్ స్టడీ) చేస్తారు. అదే సమయంలో రోగి మానసిక స్థితిపై కూడా విశ్లేషణ జరుగుతుంది. రోగి మానసిక స్థితిపై స్టడీ చేయకుండా కేవలం వ్యాధికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తే అది అసంపూర్తి చికిత్సగా మారుతుందని హోమియో వైద్యవిధానంలో భావిస్తారు.
శరీరంలో నుంచి రోగంతోపాటు అతడి మెదడులో నుంచి రోగముందనే ఆలోచనను సైతం తొలగిస్తే సదరు వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడిగా మారుతాడు. ఈక్రమంలో నే వ్యాధి రావడానికి జరిగిన ప్రక్రియలను తెలుసుకుని దానికి గల మూలకారణాన్ని గుర్తించి, వ్యాధి కుంభస్థలాన్ని పెకిలించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇతర వైద్య పద్ధతుల్లో కంటే హోమియోలో వ్యాధులు నయంకావడానికి కొంత సమ యం పడుతుంది.