ముంబై : క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్ బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. విచారణను మరోసారి వాయిదా వేసింది. బాంబే హైకోర్టు జస్టిస్ సాంబ్రే సింగిల్ బెంచ్ ధర్మాసనం గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్ముమ్ ధమేచా బెయిల్ పిటిషన్లను విచారించనున్నది. మరో మూడు రోజుల్లో బాంబే హైకోర్టుకు దీపావళి సెలవులు రానున్నాయి.
ఆ లోపు బెయిల్ రాకుంటే నవంబర్ 15వ తేదీ వరకు వీరంతా జైలులోనే గడుపాల్సిన పరిస్థితి ఎదురుకానున్నది. ఈ క్రమంలో రెండుసార్లు విచారణ వాయిదాపడడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 3న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి జరుపగా.. ఆర్యన్ఖాన్తోపాటు పలువురు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఆర్యన్ఖాన్ ఉంటూ వస్తున్నాడు. గతంలో ఆర్యన్ఖాన్ బెయిల్ పిటిషన్లను మేజిస్ట్రేట్, ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టులు సైతం బెయిల్ పిటిషన్ను తిరస్కరించాయి.