నిజామాబాద్, మార్చి 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శనగ పంట ఇంటికి వస్తున్న సమయంలో మార్కెట్లో ధర అమాంతం తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు తమ ఇష్టారాజ్యంగా పంటలను కొనుగోళ్లు చేయడంతో అన్నదాతలు నష్టపోతున్నారు. కనీస మద్దతు ధరకు భిన్నంగా ఎంతకైతే అంతకు రైతులు శనగ ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు. రైతుల దీన స్థితిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం వారికి మేలు చేకూర్చేందుకు అడుగు ముందుకేసింది. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్తో శనగ పంటను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో అన్నదాతలకు కాసింత ఊరట దక్కుతోంది. ప్రైవేటు మార్కెట్లో శనగకు క్వింటాలుకు రూ.4,500 మాత్రమే దక్కుతోంది. ప్రభుత్వం మాత్రం కనీస మద్దతు ధర రూ.5,100లకు శనగ పంటను కొనుగోలు చేసేందుకు సూత్రపాయంగా అంగీకారం తెలుపడంతో అన్నదాత హర్షం వ్యక్తం చేస్తున్నాడు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. రెండు, మూడు రోజుల్లోనే కొనుగోలు కేంద్రాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెరుచుకోనున్నాయి.
16వేల టన్నుల దిగుబడి అంచనా…
ప్రైవేటు వ్యక్తులు శనగలను క్వింటాకు రూ.4,500లకే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5,100 మద్దతు ధరతో కొనుగోలు చేయనుంది. దీంతో ప్రైవేటు దోపిడీకి ముకుతాడు పడనుంది. నిజామాబాద్ జిల్లాలో శనగ సాగు విస్తీర్ణం తక్కువే. ఈసారి సీజన్లో సుమారుగా 5వేల నుంచి 6వేల టన్నుల మేర దిగుబడి వస్తుందని మార్క్ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీగా శనగ పంట సాగవుతూ ఉంది. గతం నుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని రైతులు… శనగల సాగుకు ఉత్సాహం చూపుతుంటారు. ఈసారి కూడా 10వేల టన్నుల పైచిలుకు కామారెడ్డి జిల్లా నుంచి శనగ పంట వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,100గా నిర్ణయించారు. మార్కెట్కు శనగలు తీసుకు రావాలంటే గ్రామ రెవెన్యూ అధికారి, ఏఈవో సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, పట్టా పాసుపుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆయా వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోనే కేంద్రాలను నెలకొల్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
శనగ రైతులకు ఊరట…
పంట ఉత్పత్తులను రైతుల నుంచి దళారులు వెనువెంటనే కొనుగోళ్లు చేస్తుంటారు. చేతికొస్తున్న పంటను గమనించి వెంటనే రైతు వద్ద వాలిపోతుంటారు. బహిరంగ మార్కెట్లో డిమాండ్ను, కనీస మద్దతు ధరను అంచనా వేసుకుని దాదాపుగా 10శాతం లెస్కు రైతుల నుంచి ప్రైవేటు వ్యక్తులు పంటలు సేకరిస్తున్నారు. శనగల విషయంలోనూ ఉమ్మడి జిల్లాలో దోపిడీదారులు అదే విధంగా కొనుగోలు ప్రారంభించారు. క్వింటాకు రూ.500 నుంచి రూ.800 వరకు నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం కనీస మద్దతు ధరతో శనగ పంట కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. మార్కెట్లో శనగల ధర పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితి కాస్తా పత్తి, సోయా ఇతర పంటలపై ప్రభావం చూపినా.. శనగ పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. అయితే పంట ఉత్పత్తులు ఇండ్లకు చేరుకునే సమయానికి ధర ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధరతో శనగలు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రైతులకు ఊరట కలుగనుంది.