ఎనకటి కాలంల ఎవుసమంటేనే ఏడాదంతా రకరకాల పంటలతో నేలతల్లి పులకించేది. వానకాలంలో ఆహార, యాసంగిలో ఆరుతడి పంటలతో భూములన్నీ పచ్చగా కనిపించేవి. పొద్దుతిరుగుడు, పల్లికాయ, మక్క, జొన్న, సజ్జ, నువ్వులు తదితర తీరొక్క పంటలు కనిపించేవి. పంట దిగుబడులతో ఇండ్లన్నీ కళకళలాడేవి. ప్రస్తుతం యంత్రాల వినియోగం, పుష్కలంగా లభిస్తున్న సాగునీరుతో పాతతరం పంటలు కనిపించకుండా పోతున్నాయి. ఏ వైపు చూసినా ఎక్కువ మొత్తంలో వరి మాత్రమే దర్శనమిస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరి సాగులో ముందున్నది. కానీ యాసంగిలో వడ్లు కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతుండడంతో రైతన్న ఆందోళన చెందుతున్నాడు. నాడు మన పెద్దలు పంట సాగులో అవలంబించిన పద్ధతులు, సాగు చేసిన పంటలతో ఏ విధంగా లాభాలు సాధించారో తెలుసుకుందాం..!
యాభై ఏండ్ల కిందటి దాకా రైతంటేనే రాజు. తీరొక్క పంట ఉత్పత్తులతో పల్లెలన్నీ కళకళలాడుతుండేవి. వానకాలంలో వేసిన పంట, యాసంగిలో వేయకుండా సమర్థవంతంగా సాగు చేసేవారు. ప్రస్తుతం పెరిగిన సాంకేతికత, యాంత్రీకరణ, నీటి వనరుల లభ్యతతో వరి మాత్రమే సాగు చేస్తూ రైతులు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. యాసంగిలో ధాన్యం కొనబోమని కేంద్రం చెబుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతన్న ఇబ్బంది పడకుండా ఇతర పంటలు సాగు చేసే అధిక లాభాలు ఆర్జించేలా రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక్కసారి యాభై ఏండ్ల కింద ఎవుసంలో మన పెద్దలు పాటించిన పద్ధతులు, వేసిన పంటలు, సాధించిన దిగుబడులపై ప్రత్యేక కథనం.వ్యవసాయరంగానికి పెట్టింది పేరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఏడాదంతా రకరకాల పంటలతో పుడమి తల్లి కళకళలాడుతుండేది. వానకాలం ఆహార పంటలతో, యాసంగిలో ఆరుతడి పంటలతో పంట భూములు పచ్చగా తులతూగేవి. పంట ఉత్పత్తులు ఇంటికి వచ్చాక ఇండ్లన్నీ వాటితో గోదాముల్లా కనిపించేవి. ఇది చూసిన రైతన్న గుండెను నిబ్బరం చేసుకొని ఏడాదంతా కుటుంబాన్ని సాకేందుకు ఏ బాదరా బందీ లేదని భుజాన కండువా వేసుకొని గట్టిగా ఊపిరిపీల్చుకునేవాళ్లు. అయితే ఇప్పుడు కాలం మారిందో.. లేక మనిషే మారాడో తెలియదు కానీ అన్నీ వేగంగా మారిపోతున్నాయి. ఏది కావాలన్నా నిమిషాల్లో తెచ్చుకోగలుగుతున్నాడు రైతన్న. ఒక్క కూలీవాళ్లు తప్ప అన్ని పనులూ యంత్రాలతోనే జరిగిపోతున్నాయి. రోజుల తరబడి సాగే పనులు గంటల్లోనే ముగిసిపోతున్నాయి. ఫోన్ల మీదనే పనులు చక్కబెడుతున్నారు. ఇదీ ఇప్పటి మాట. ఒకప్పుడు పనులు రోజుల తరబడి సాగేవి. అందరికీ కూలీ పని దొరికేది. పల్లెల్లో అందరూ కలిసి పనులు చేసుకునేవారు. ఆనందంగా ఉండేవారమని ఆనాడు ఎవుసం చేసిన పలువురు తాతలు, పెద్ద మనుషులు అంటున్నారు. విత్తు వేయాలన్నా, నారు పోసి నాటు వేయాలన్నా, పంట కోయాలన్నా, తూర్పార పట్టాలన్నా అన్నీ రెక్కల కష్టం మీదనే చేసుకునేవాళ్లం అని వారు చెప్పే మాటల్లో ఆనందంతోపాటు నాటి కష్టం వారి కండ్లల్లో కనిపించింది.
యాసంగిలో ఆరుతడికే మొగ్గు..
ప్రస్తుతం యాసంగి కాలంగా పిలుస్తున్న సీజన్కు నిన్న మొన్నటి వరకు రబీ పంట కాలంగా పిలిచేవారు. ఈ యాసంగి సీజన్లో రైతులందరూ దాదాపు ఆరుతడి పంటలు వేసేందుకే మొగ్గు చూపేవారు. అంటే వేరుశనగ, పొద్దుతిరుగుడు, మక్కజొన్న, జొన్న, రాగులు, కొర్రలు, సజ్జలను సాగుచేసేవారు. తద్వారా పంట మార్పిడి విధానంతోపాటు నీటి యాజమాన్య పద్ధతులను కూడా అనుసరించేవారు. అంతేకాకుండా వానకాలంలో ఆహార పంటలకు ప్రాధాన్యతనిచ్చే అన్నదాతలు యాసంగి సీజన్కు వచ్చే సరికి వాణిజ్య పంటలను వేసేవారు. వీటి ద్వారా రైతులు తమ కుటుంబానికి ఆదాయం సంపాదించుకునేవారు. యాసంగి సీజన్లో చేతికొచ్చే పంటలను దాదాపు విక్రయించుకునేవారు. ఆరుగాలం శ్రమించే అన్నదాతలు ఇలా రెండు సీజన్లలోనూ తమ కష్టానికనుగుణంగా ప్రభుత్వాల సూచనల మేరకు పంటలను సాగు చేసుకునేవారు. అయితే నేటి టెక్నికల్ యుగంలో సాగు పనులన్నీ యంత్రాలతో పూర్తి చేసుకుంటున్నారు నేటితరం రైతులు.
వానకాలం.. ఓ యజ్ఞంలా..
అప్పట్లో వానకాలం పంటను ఓ యజ్ఞంలా చూసేవాళ్లమని తాతలు అంటున్నారు. విత్తు వేసింది.. పంట చేతికొచ్చే వరకు అందరం కలిసే పని చేసుకునేవాళ్లం అని చెబుతున్నారు. వానకాలంలో ఇంటికి పనికి వచ్చే పంటలే వేసేవారు. అంటే వరి, చెరుకు, మక్క, జొన్న, బెబ్బర్లు, రాగులు, సజ్జలు, పెసర్లు, మినుములు వంటివి సాగుచేసేవారు. ప్రధానంగా వరి, చెరుకు, మక్కజొన్న పంటల విషయంలో గ్రామాల్లోని రైతులు ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా అంటే బదిలీ పద్ధతుల్లో వారు పనులు పూర్తి చేసుకునేవారు. ఇలా ఒకరి తర్వాత ఒకరి పంటలను పూర్తి చేసుకునేవారు. చెరుకు పంట విషయంలో అయితే బెల్లం వండడం కోసం నెలల తరబడి కష్టించేవారమని పెద్దలు చెబుతున్నారు. అన్ని రోజులంటే అదో ఆనందకర ఘట్టంగా భావిస్తామని వారు తెలిపారు. ఇలా చేయడం ద్వారా పల్లెల్లోని కూలీలందరికీ చేతినిండా పని దొరికేదని అని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లోనే బాగుండేది…
నాకు ఐదు ఎకరాల పొలం ఉన్నది. అప్పట్ల అంటే మా కాలంల అంతా రెక్కల కట్టం మీదనే ఎవుసం చేసుకునేటోళ్లం. ఒకరి తర్వాత ఒకరి పొలంల పని పూర్తి చేస్తుంటిమి. అందరం ఒకే చోట ఉంటుంటిమి. దీంతో ఓ పండుగలా అనిపించేది. ఏ ఒక్కరి చేలల్లో కొట్లాటలు అయ్యేటివి కాదు. బదిలీలు చేసుకునేటోళ్లం. అంతా ఒకటిగానే అనుకుంటుంటిమి. ఇప్పటితో పోల్చితే అప్పట్లనే చాలా బాగుంటుండె.
-వాచర్ మల్లయ్య, రైతు, ఇందల్వాయి
పంట మార్పిడి విధానం బాగుంటుంది..
మాకు కోటార్మూర్లో సుమారు 10 ఎకరాల భూమి ఉన్నది. నాకున్న భూమి లో వరి, మక్కజొన్న, ఎర్రజొన్న, కూరగాయలు, నువ్వుల పంటలను సాగు చేస్తున్నాను. ప్రస్తుతం కోటార్మూర్లో పంటల సాగుకు అడవి, ఊర పందులు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వీటి ఇబ్బందుల నుంచి రైతులను కాపాడేందుకు ప్రభు త్వం సబ్సిడీ ఇచ్చి పంట క్షేత్రాల చుట్టూ ట్రెం చ్ కట్లు వేయించేలా చూడాలి. మాకున్న భూమిలో వచ్చిన పంట మళ్లీ రాకుండా పంట మార్పిడి చేస్తూ వ్యవసాయం చేస్తున్నాం.
-కొప్పెల అచ్యుత్రెడ్డి, యువరైతు, కోటార్మూర్
డబ్బా రేకుతో సప్పుడు జేసేటోళ్లం..
నా పేరు కుమ్మరి చిన్న గంగారాం, మా ది సుద్దపల్లి. నాకు ఏడు ఎకరాల పొలం ఉన్నది. 50ఏండ్ల సంది ఎవుసంజేస్తున్న. ఎనకటికి నీళ్లు లేకుంటుండె. ఆనల మీదనే ఆధారపడుతుంటిమి. ఒకసారి వరి, మళ్లోసారి మక్క, ఇంకొకసారి పల్లికాయ వేసేటోళ్లం. పొద్దుగాల్ల ఇంటికాన్నుంచి సద్ది కట్టుకొని గొడ్డుగోదా తొలుకొని పొలంకాడికి పోయి చీకటిపడేటాల్లకు ఇంటికి వచ్చేటోళ్లం. పంట కాత కాసినంక పిట్టలు రాకుంట డబ్బా రేకుతో సప్పుడు జేసేటోళ్లం. గడ్డి, కుండతోని బొమ్మలు చేసి కట్టేటోళ్లం. అప్పట్ల మందులు, ఎరువులు లేవు కాబట్టే బలమైన ఆహారం తింటుంటిమి.. అందుకే ఇప్పుడు బలంగా ఉన్నం.