లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణికులకు కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. అయితే, మూడుశాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల నుంచి యూపీకి ప్రయాణించే వారికే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తొమ్మిది మంది ఉన్నతాధికారుల బృందం ఈ నిర్ణయం తీసుకున్నది. కొత్త మార్గదర్శకాల.. మేరకు ఉత్తరప్రదేశ్కు ప్రయాణించే ఎవరైనా నెగెటివ్ కొవిడ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది.
వాయు, రహదారి, రైలు మార్గాల ద్వారా వచ్చే వారికి కొత్త నిబంధన వర్తించనుంది. వ్యక్తిగత వాహనాల ద్వారా వచ్చే వ్యక్తులు ప్రోటోకాల్స్ను అనుసరించాల్సి ఉంటుంది. అయితే, వ్యాక్సిన్ రెండు మోతాదులను పొందిన వ్యక్తులను కొత్త మార్గదర్శకాల నుంచి తప్పించాలా? వద్దా? నూతన మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత తెలియనుంది. మరో వైపు రాష్ట్రంలో అత్యధిక కరోనా పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికీ వేగంగా యాంటిజెన్ పరీక్షలు, థర్మర్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు.
టెస్ట్, ట్రాక్, ట్రీట్తో పాటు ఇతర కొవిడ్ ప్రోటోకాల్లను కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా.. యూపీలో గత 24 గంటల్లో 56 కొవిడ్ కేసులు నమోదవగా.. 69 మంది కోలుకున్నారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవని అదనపు చీఫ్ సెక్రెటరీ నవనీత్ సెహగల్ పేర్కొన్నారు. యూపీలో రికవరీ రేటు 98.6శాతానికి పెరిగింది.