గల్ఫ్ వలస బతుకులను బచ్పన్ నుంచీ చూసింది. అదే గల్ఫ్ జిందగీలో తానూ భాగం అవుతానని మాత్రం అనుకోలేదు. దేశం కాని దేశమే అయినా.. మనదైన భాష కాకున్నా.. మన కథ నడవకున్నా.. సొంతంగా ఒక ఉపాధి మార్గం వెతుక్కుంది. ఖాళీ దొరికినప్పుడల్లా పాటకు పదునుపెట్టింది. జానపద జడివానలో తడిసిముద్దయి తరిస్తున్న భార్గవి ప్రసాద్ పాటల ముచ్చట!
మాది జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండలం సిరికొండ. అమ్మగారి ఊరు అంబారిపేట. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఏ చిన్న పాట వినిపించినా లయబద్ధంగా అడుగులు కదిలేవి. నేను చిట్టిచిట్టి స్టెప్పులేస్తుంటే అందరూ మురిసిపోతుండె. అమ్మ దేవి బీడీలు చుట్టేది. తనకు ఆసరాగా నేనూ చుట్టడం నేర్చుకున్న. పనిచేస్తూ అమ్మ పాటలు పాడేది. అవన్నీ అచ్చమైన జానపదాలు. అమ్మతో కలిసి బీడీలు చుడుతూ పాడటం నేర్చుకున్న. అమ్మ నా పాటల గురువు. మా మామయ్యకు కూడా చాలా పాటలు వచ్చేవి. ఏదైనా భజనకు వెళ్తుంటే ‘వస్తవా అమ్మా!’ అని తీసుకెళ్తుండె. ఆ పాటల్ని ఇంట్ల బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. నాన్న మాత్రం ‘ఎప్పుడూ ఏం పాటలూ’ అంటుండె.
ఇంటర్ కాంగనే నాకు పెండ్లి చేసిండ్రు. మా ఆయన ప్రసాద్. పెండ్లయినంక దుబాయ్ పోవాలన్నరు. నా మనసుకు బాధయింది. ఎందుకంటే, గల్ఫ్ వలస బతుకుల గురించి బచ్పన్ నుంచి ఎరుకే. ఏ ఊరు, ఏ ఇల్లు చూసినా ఆడోళ్లూ పిల్లలతోనే కనిపించేది. మొగదిక్కు ఉన్నా పొట్టకూటి కోసం గల్ఫ్కు వలస పోయెటోళ్లు. ఏడాది, ఆర్నెల్ల కథనా అంటే అదీ కాదు. ఏండ్లకేండ్లు వాళ్లక్కడ, వీళ్లిక్కడ. పానంతోటి పోయిన మనుషులు ఒక్కోసారి శవాలుగా వస్తుండె. అక్కడేం తింటరో, ఏడ పండుకుంటరో తెల్వని పరిస్థితులు. ‘నేను పోయేది కూడా అక్కడనే కదా?’ అనే ఆలోచన మనసును గుచ్చుతుంటే మస్తు రందివడ్డ. కానీ మా ఆయన నన్నుగూడ తీస్కపోతా అన్నడు. కట్టుకున్నోడికి తోడుగా వెళ్తున్నందుకు ఒకరకంగా సంతోషమే. కానీ ఉన్న ఊరు, అయినోళ్లను వదిలి దేశంగాని దేశం పోవాల్నంటెనే పానం ఎటో అయ్యేది.
దుబాయ్లనే నాలుగేండ్లు గడిచినయి. పేరుకు వేరే దేశమే అయినా మన సంస్కృతి, సంప్రదాయాలకు అక్కడ గౌరవం ఉంది. ఏటా బతుకమ్మ, బోనాలు గొప్పగా చేస్తరు. నేనూ వెళ్తుండేదాన్ని. అవకాశం వస్తే దుబాయ్ వేదికగా జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో పాట పాడాలె అనిపించేది. ఆ కోరిక తీరకుండానే కొవిడ్ ఫస్ట్వేవ్ వచ్చింది. దుబాయ్లో పరిస్థితి బాగలేక ఊరికి వచ్చేసినం. అంతా అయినంక వెళ్దామనుకున్నం. ఓ రోజు మా టెన్త్ క్లాస్మేట్ మల్లేశ్ ‘సింగర్ కావలెను’ అని వాట్సప్ స్టేటస్ పెట్టిండు. వాళ్ల బావ మల్లికార్జునన్న నడిపే సీఎంకే క్రియేషన్స్ చానెల్ కోసమంట. ‘నేను పాడతా. అవకాశం ఉంటే చూడు’ అని మల్లేశ్కు మెసేజ్ చేసిన. మల్లేశ్ ఈ ముచ్చటను మల్లికార్జునన్నకు చెప్పిండు. అప్పటిదాక పాట పాడింది వేరు. రికార్డింగ్లో పాడటం వేరు. పాట రచయిత పరశురాం అదంతా నేర్పించిండు. ‘బలమైన కాపల బలటుంగుటుయ్యాల అన్నలున్నరు బావయ్యా’ పాట అది. నెల రోజుల్లోనే నేనెవరో అందరికీ తెలిసిపోయేంతగా హిట్టయ్యింది.
‘బలమైన కాపల’ పాట నాకు ఎన్నో అవకాశాలు వచ్చేట్లు చేసింది. ‘ఓసారోసారోసారోయ్’, ‘గంగాదారి ఒడ్డున దొంగలెవరు దోసిరో’, ‘సాదబాయికాడ నీళ్లుచేదవోతున్నా’, ‘బంగురాల్లాడేటి బోడల్లా.. బోడల్లా నాయిరాజ’, ‘పచ్చనీ పొలాల నడుమ నాగమల్లెలో’ వంటి అచ్చమైన జానపదాలు అరవైకిపైగా పాడిన. తాజాగా ‘నీలా నీలం చీరలో నీలా’ పార్ట్-2 పాట పాడిన. దాన్ని కూడా జనాలు బాగా ఆదరిస్తున్నరు. ఇంతలోనే, మల్లా దుబాయ్ నుంచి పిలుపు వచ్చింది. మా ఆయనైతే వెళ్లిండు. నా చేతిలో చాలా పాటలున్నయి. ఇవన్నీ వదిలేసి ఏం పోతం? ఇక్కడే ఉండిపోయిన. ఎంతో కష్టపడితేనే నాకు ఈ అవకాశాలు వచ్చినయి. దుబాయ్ నుంచి రాంగనే ‘ఏంజేయాలె?’ అనే ప్రశ్న మొదలైంది. మల్లా కుట్టు మిషిన్కు పని చెప్పాల్సిందేనా? బీడీలు చుట్టాల్సిందేనా? అనుకున్న. వచ్చిన మొదటి అవకాశాన్నే సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్ సింగర్గా పేరు సంపాదించుకున్న. దీంట్లో కుటుంబం, దోస్తులు, కొలీగ్స్, చుట్టాలు, శ్రేయోభిలాషులు అందరికీ క్రెడిట్ ఉంది!
ఆడవాళ్లు గల్ఫ్ పోవుడు తక్కువ. నేనైతే వెళ్లిన. అక్కడ మా ఆయన డ్రైవర్. తెల్లందాక పొద్దుందాక కష్టపడేటోడు. ‘నేనుగూడ ఏదైన పని చూసుకుంట’ అన్నా. నాకు పాటలు, డ్యాన్స్ ఇష్టం కాబట్టి ఆ రకమైన అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే.. ఒక స్కూల్లో డ్యాన్స్ టీచర్గా అవకాశం దొరికింది. మొదట్లో వాళ్లు మాట్లాడేది నాకు అర్థంగాకపోయేది. మెల్లమెల్లగా భాషపై పట్టు సంపాదించిన. ఇష్టమైన పనే కాబట్టి ఎలాంటి అసౌకర్యమూ కలగలేదు. అక్కడి పనివేళలు, నిబంధనలు కఠినంగా ఉంటయి. ఒత్తిడి దరిచేరకుండా పల్లె పాటలు పాడుకునేదాన్ని.
దాయి శ్రీశైలం