న్యూఢిల్లీ : కరోనా కాలంలో కోటీశ్వరులు దేశం విడిచి వెళ్తున్నారు. ఐదేండ్లలో 29 వేలకు పైగా ధనవంతులు దేశం విడిచి వెళ్లారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా వేలాది మంది ఎందుకు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు..? అనేది పెద్ద ప్రశ్నగా మారిపోగా.. వీరి తీరు కారణంగా మరింత నిరుద్యోగం పెరుగుతుందని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారతదేశంలోని ధనిక పౌరులు దేశం విడిచి వెళ్తున్నారు. ఈ విషయాన్ని గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2020 లో భారతదేశానికి చెందిన ధనవంతులు 2 శాతం మంది దేశం విడిచి వెళ్ళారు. హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక ప్రకారం, 2019 లో కంటే 2020 లో 63 శాతం ఎక్కువ మంది భారతీయులు దేశం విడిచి వెళ్ళడం గురించి ఆరా తీశారు. అయితే, విమానాల మూసివేత, లాక్డౌన్ నేపథ్యంలో అనేక డాక్యుమెంటరీ సంబంధ పనులు మందగించడంతో 2020 లో వెయ్యి మంది మాత్రమే ధనవంతులు దేశం విడిచి వెళ్లారంట. కానీ ప్రస్తుత సంవత్సరంలో ఈ సంఖ్య వేగంగా పెరుగుతున్నదంట. కరోనా సెకండ్ వేవ్ సమయంలో విదేశాలకు సంబంధించిన ఎంక్వైరీలు ఎక్కువగా జరగాయంట.
2021 లో గత సంవత్సరం కంటే ధనవంతులు దేశం విడిచి వెళ్ళవచ్చని ఈ నివేదికలు చెప్తున్నాయి. 2015-2019 మధ్యకాలంలో 29 వేల కోట్లకు పైగా ధనవంతులు భారత పౌరసత్వాన్ని విడిచిపెట్టారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హెన్లీ & పార్ట్నర్స్ నివేదిక ప్రకారం, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రియా, మాల్టా, టర్కీ, యూఎస్, యూకేలలో స్థిరపడటం గురించి భారత ప్రజలు ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. ఈ ధనవంతులు భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది.
విదేశాలలో స్థిరపడటానికి 2 ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. ఒకటి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, రెండోది భారీ మొత్తంలో ఫీజు చెల్లించడం ద్వారా పౌరసత్వం పొందగలగడం వంటి మార్గాలను ధనవంతులు అన్వేషిస్తున్నారు. చాలామంది భారతీయులు మొదటి పద్ధతిని అనుసరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. భారతీయులు అమెరికాలో స్థిరపడటానికి గ్రీన్ వీసా పొందాలంటే.. రూ.6.5 కోట్ల పెట్టుబడి పెట్టాలి. బ్రిటన్లో రూ.18 కోట్లు, న్యూజిలాండ్లో రూ.10.9 కోట్లు పెట్టుబడి పెడితే సరిపోతుంది. కొన్ని కరేబియన్ దేశాలు, సెయింట్ కిట్స్, నెవిస్, డొమినికాలలో రూ.72 లక్షల పెట్టుబడికే పౌరసత్వాన్ని అందిస్తున్నాయి.
చాలా మంది ధనికులు దేశం విడిచి వెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. ముఖ్యంగా వ్యాపారంలో ఇబ్బందులు, ఆరోగ్య సంరక్షణ, కాలుష్యం, పన్ను, ఆస్తి వివాదాల వంటివాటిని పలువురు చెప్తున్నారు. భారత్లో అవకాశాలు లేకపోవడం, రాజకీయ రుగ్మత, అవినీతి, కాలుష్యం వంటి అనేక సమస్యలు ఇతర దేశాలకు వలస వెళ్లేలా చేస్తున్నాయని, ఈ కారణంగానే నేను జమైకాలో వ్యాపారాన్ని ప్రారంభించానని చెప్తున్నారు ఛత్తీస్గఢ్ నుంచి వలస వెళ్లి జమైకాలో స్థిరపడిన రాజ్కుమార్ సబ్లానీ.
కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల గురించి ఎక్కువ మంది సమాచారం సేకరిస్తున్నారని, అమెరికా అంటే ఆకర్షణ తగ్గిపోయిందని ఎకౌస్ట్ అడ్వైజర్ సీఈఓ పరేష్ కరియా అంటున్నారు. గ్రీన్ వీసా కోసం పెట్టుబడి మొత్తం 5 మిలియన్ డాలర్ల నుంచి 9 మిలియన్ డాలర్లకు పెరగడం కూడా ఒక కారణమని ఆయన చెప్పారు.
భారతదేశంలో ఉపాధి రేటు ఇప్పటికే చాలా ఘోరంగా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ధనికులు తమ వ్యాపారాన్ని వేరే చోటికి తీసుకొనిపోవడం వల్ల ఇక్కడ నిరుద్యోగిత రేటును పెరుగుతుందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. అలాగే, ఇది మన దేశంలో ధనిక-పేద మధ్య అంతరాన్ని మరింత పెంచుతుందని వారంటున్నారు. ధనవంతులు విదేశాలకు వెళ్లిపోతుండటంతో పన్ను వసూళ్లు కూడా మందగించే అవకాశాలు ఉన్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబర్లను పన్ను కిందకు తెచ్చిన అమెరికా
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..