వనపర్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చి ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన చిన్నంబావి మండలం అమ్మాయిపల్లిలో చోటు చేసుకుది. స్థానికుల కథనం మేరకు..ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న గ్రామానికి చెందిన గంగిరెడ్డి కుమారులు సాయిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చారు.
సోమవారం ఉదయం స్వగ్రామంలో సొంత పొలాలను పరిశీలించడానికి నలుగురు అన్నదమ్ములు సాయిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పరమేశ్వరెడ్డి, లోకారెడ్డి కలసి వెళ్లారు.
పొలాల పరిశీలన అనంతరం ఇద్దరు అన్నదమ్ములు పరమేశ్వర్ రెడ్డి, లోకారెడ్డి ద్విచక్ర వాహనంపై ముందు అమ్మాయిపల్లికి వెళ్లారు. కాగా, సాయిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి కాలినడకన వస్తుండగా.. పెబ్బేరు వైపు వెళ్తున్న పాల వ్యాన్ ఒక్కసారిగా వారిద్దరి పైనుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు.
నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పాల వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆటోడ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అతడిని వీపనగండ్ల దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.