హైదరాబాద్ : ‘అన్నా అంటే నేనున్నా’ అంటూ అండగా నిలిచే కేటీఆర్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట మేరకు నిరుపేద వైద్య విద్యార్థికి అండగా నిలుస్తున్నారు. మొదటి సంవత్సరం ఫీజు చెల్లించిన ఆయన.. తాజాగా రెండో సంవత్సరం పూర్తి ఫీజు చెల్లించి ఔదార్యాన్ని చూపారు. కొల్లాపూర్ నియోజకవర్గం, వీపనగండ్ల మండలం కల్వరాలకు చెందిన బోరెల్లి నర్సింహ కుమార్తె గౌరి నిరుడు పటాన్చెరు మహేశ్వరం మెడికల్ కాలేజీలో సీటు సాధించింది.
ఫీజు కట్టలేక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న నర్సింహ, గౌరి దీనస్థితిని ఎక్స్ ద్వారా తెలుసుకున్న కేటీఆర్ చలించిపోయారు. ఆ విద్యార్థిని చదువు భారాన్ని భరించేందుకు ముందుకువచ్చారు. 2024 అక్టోబర్లో మొదటి సంవత్సరం ఫీజు చెల్లించారు.
శుక్రవారం తెలంగాణ భవన్లో రెండో ఏడాదికి సంబంధించి రూ.1.30 లక్షల చెక్కు అందజేశారు. చెక్కు అందుకున్న గౌరి, కుటుంబసభ్యులు మాట నిలుపుకొని అండగా నిలిచిన కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయబోనని సెకండ్ ఇయర్లో మంచి మార్కులు సాధిస్తానని స్పష్టంచేసింది.