వరంగల్ అర్బన్ : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఇక సమరమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. హన్మకొండ బాలసముంద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, నగర మేయర్ గుండా ప్రకాశ్రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీజేపీ దొందు..దొందేనని అన్నారు. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని కాజీపేటకు వచ్చే కోచ్ ఫ్యాక్టరీని అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ లోంగోవాల ఎకాడ్ ఒప్పందంలో భాగంగా పంజాబ్కు తరలించగా, బీజేపీ దేశంలో ఎక్కడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని స్పష్టంగా తేల్చి చెప్పిందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇదిగో అదిగో అంటూ వరంగల్ ప్రజలను నమ్మించి నట్టేట ముంచిందని ఆరోపించారు. కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వరంగల్ ప్రజల చిరకాలవాంఛ అని, దీన్ని అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని వినోద్కుమార్ పేర్కొన్నారు.
2001 ఏప్రిల్ 7న ఆవిర్భవించిన టీఆర్ఎస్ వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న డిమాండ్తో ప్రజలను చైతన్యపర్చడమే కాకుండా పార్లమెంట్ వేదికగా అప్పుడు ఎంపీగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నాయకత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగా తమ గళాన్ని వినిపించారని, ప్రధాన మంత్రి, కేంద్ర సహాయ రైల్వే శాఖ మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలిసిందని, దానిని సాధించేందుకు మరో సమరం తప్పదని ఆయన వెల్లడించారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తెలంగాణ విభజన చట్టంలో పొందుపర్చారని, ఆ హామీలను సైతం బీజేపీ అమలు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేను ప్రైవేటీకరణ చేసేందుకే కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదంటోందన్నారు. రైల్వేను అంబానీ, అధానీ చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతుందన్నారు. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణలో అభివృద్ధి బీజేపీ నేతలే అడ్డుకుంటున్నట్లు ఆయన మండిపడ్డారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమం చేపడుతామన్నారు.