బెంగళూరు : కేరళను ఓ వైపు కరోనా, మరో వైపు నిపా వైరస్ వణికిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కొవిడ్ కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే నిపా వైరస్తో 12 సంవత్సరాల బాలుడు మృతి చెందగా.. 68 మందిని ఐసోలేషన్కు తరలించారు. ఈ క్రమంలో పొరుగున కర్ణాటక అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు అత్యవసరమైతే తప్పా అక్టోబర్ వరకు కేరళ వెళ్లడం మానుకోవాలని అధికారులు సూచించారు. అలాగే అన్ని కళాశాలలు, పాఠశాలలు, విద్యా సంస్థల్లో విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరు కావొద్దన్నారు.
జిల్లాలో వైరస్ నియంత్రణకు పరిశ్రమలు సైతం అక్టోబర్ వరకు వర్క్ఫ్రం హోమ్ కొనసాగించాలని చెప్పారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో నిపా వైరస్ వ్యాప్తి నివారణకు అడ్వైజరీని సైతం జారీ చేసింది. జ్వరం, మారిన మానసిక స్థితి, తీవ్రమైన బలహీనత, తలనొప్పి, శ్వాసకోశ ఇబ్బంది, దగ్గు, వాంతులు, కండరాల నొప్పి, మూర్ఛ, విరేచనాలు వంటి లక్షణాలతో కేరళ నుంచి వచ్చే వారిని పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరింది.