Israel-Iran | న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. మరో 48 గంటల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులకు దిగొచ్చన్న మీడియా కథనాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ.. ఇరాన్ కూడా యుద్ధంలోకి దిగనుందనే వార్తలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. రెండు వారాల కిందట సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ రెవల్యూషరీ గార్డ్స్కు చెందిన టాప్ జనరల్తోపాటు ఆరుగురు ఉన్నతాధికారులు మరణించడం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్పై ఇరాన్ పగతో రగలిపోతున్నది. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ దాడికి దిగొచ్చన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
సిద్ధంగా ఉన్నాం: ఇజ్రాయెల్ సైన్యం
తమ కాన్సులేట్పై దాడికి ప్రతీకారంగా 48 గంటల్లో ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడులు చేసేందుకు ఇరాన్ సిద్ధమైందని ఇరాన్ నేత ఒకరిని ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జర్నల్ శుక్రవారం కథనం ఇచ్చింది. యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడితో జరిగే రాజకీయ నష్టాలపై తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంచనాలు వేస్తున్నారని ఖమేనీ సలహాదారు ఒకరు పేర్కొన్నారు. ఇరాన్ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ కూడా సిద్ధమవుతున్నదని నివేదికలు వెల్లడించాయి. ఇజ్రాయెల్పై డ్రోన్లు, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నదని అమెరికా అధికారులు కూడా వెల్లడించారు. మరోవైపు ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొన్నది. తమ బలగాలు హై అలర్ట్లో ఉన్నాయని, పరిస్థితిని నిరంతరంగా పర్యవేక్షిస్తున్నామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియెల్ హగేరి పేర్కొన్నారు.
ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు
ఇజ్రాయెల్కు అండగా ఉంటామని మిత్రదేశం అమెరికా హామీ ఇచ్చింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్ రక్షణ మంత్రికి గురువారం రాత్రి ఫోన్ చేశారు. ఒకవేళ ఇరాన్ దాడికి దిగితే రక్షణగా ఉండేందుకు అమెరికా అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ బుధవారం ఓ సందర్భంగా మాట్లాడుతూ ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ఇరాన్ బెదిరిస్తున్నదని, ఈ సమయంలో ఇజ్రాయెల్కు తమ ‘ఉక్కు కవచం’ లాంటి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో సంయమనం పాటించాలని రష్యా, జర్మనీ, యూకే పశ్చిమాసియా దేశాలను కోరాయి.
దాడి మా భూభాగంపై జరిగినట్టే: ఖమేనీ
ఈ నెల 1న సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఇరాన్కు చెందిన టాప్ మిలటరీ జనరల్తో పాటు ఆరుగురు అధికారులు మరణించారు. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడి ఇజ్రాయెలే చేసిందని, ఆ దేశాన్ని తప్పకుండా శిక్షిస్తామని దాడి అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. అయితే ఇరాన్ కాన్సులేట్పై దాడి గురించి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఖమేనీ బుధవారం టీవీ ప్రసంగంలో మాట్లాడుతూ డమాస్కస్లోని తమ కాన్సులేట్పై జరిగిన దాడిని ఇరాన్ భూభాగంపై జరిగినట్టుగానే భావిస్తున్నామని అన్నారు.
ఆ దేశాల్లో ఉండే వారు జాగ్రత్త!
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ ప్రతిదాడులకు దిగొచ్చనే వార్తల నేపథ్యంలో భారత్, ఫ్రాన్స్, అమెరికా తమ దేశ పౌరులకు పలు కీలక సూచనలు చేశాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలకు ఎవరూ ప్రయాణించవద్దని భారత విదేశాంగ శాఖ శుక్రవారం అడ్వైజరీ జారీచేసింది. అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్లో ఉంటున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని, బయటి ప్రయాణాలను తగ్గించుకోవాలని పేర్కొన్నది. భారత రాయబార కార్యాలయాలతో టచ్లో ఉండాలని, తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వెళ్లాల్సిన భారతీయ కార్మికులకు అనుమతి ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా రీజియన్కు ప్రయాణాలను మానుకోవాలని ఫ్రాన్స్ కూడా తన పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్లో తమ ఎంబసీ సిబ్బంది ప్రయాణాలపై అమెరికా నియంత్రణ విధించింది. జెరూసలేం, టెల్ అవివ్ దాటి ప్రయాణాలు చేయొద్దని సూచించింది.
ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బొల్లా క్షిపణుల వర్షం
లెబనాన్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు ఉత్తర ఇజ్రాయెల్ భూభాగంపైకి డజన్ల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఇరన్ డోమ్ను బలహీనం చేసే లక్ష్యంతో ఈ దాడి చేసినట్టు నివేదికలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ఆర్టిలరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేశామని హెజ్బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్పైకి ఇరాన్ యుద్ధానికి సిద్ధమవుతున్నదనే వార్తల నేపథ్యంలో హెజ్బొల్లా దాడులు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. మరోవైపు సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ శుక్రవారం భారీగా వాయు దాడులు, ఆర్టిలరీ షెల్లింగ్తో విరుచుకుపడింది. గురువారం 60కి పైగా హమాస్ లక్ష్యాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొన్నది.