మేడ్చల్ రూరల్, డిసెంబర్ 24 : భావి జీవితంలో సమాజ హితమే ధ్యేయంగా విద్యార్థులు పని చేయాలని జేఎన్టీయూహెచ్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి సూచించారు. మండల పరిధి గౌడవెల్లిలోని హితం ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భావి ఇంజినీర్లుగా సమాజంలో అడుగుపెడుతున్న విద్యార్థులు సంపాదన ఒక్కటే ధ్యేయంగా కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. నూతన ఆవిష్కరణలతో సమాజంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ఎఫియా సాఫ్ట్ సీఈవో కౌశిక్ మాట్లాడుతూ కళాశాలలో పొందిన పరిజ్ఞానాన్ని సరియైన మార్గంలో వినియోగించుకొని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అనంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ కన్సల్టెంట్ అప్పలరాజు, కళాశాల చైర్మన్ ఆరుట్ల ప్రశాంత్, ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ రెడ్డి, కెరీర్ డిజైన్ సెంటర్ హెడ్ మదన్హారతి, తదితరులు పాల్గొన్నారు.