కోల్కతా: మనవారి కోసం ప్రాణాలిస్తామని మనం మాటల్లో చెబుతుంటాం. అయితే ఒక ఏనుగు మాత్రం దీనిని నిజం చేసి చూపించింది. ఆపదలో ఉన్న బిడ్డను రక్షించుకునేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టింది. జీవ పరిరక్షణ శాస్త్రవేత్త నేహా సిన్హా తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక కథనం నెటిజన్లు హృదయాలను ద్రవింపజేసింది.
పశ్చిమ బెంగాల్లోని అటవీ ప్రాంతానికి చెందిన గంగా అనే ఏనుగు, దాని పిల్లను అవిజన్ సాహా అనే వ్యక్తి ఇటీవల ఫొటో తీశారు. అయితే గంగతోపాటు దాని మందను అటవీ సమీప గ్రామస్తులు వెళ్లగొట్టేందుకు వెంబడించారు. అడవి బాట పట్టిన ఆ ఏనుగులకు మధ్యలో రైలు పట్టాలు ఎదురయ్యాయి.
కాగా, ఏనుగులన్నీ రైలు పట్టాలు క్రాస్ చేశాయి. అయితే గంగ పిల్ల మాత్రం రైలు పట్టాలను దాటలేకపోయింది. ఇంతలో రైలు వస్తుండటాన్ని తల్లి ఏనుగు గంగ గమనించింది. బిడ్డ పట్టాలు దాటేందుకు అది రైలుకు అడ్డంగా నిలిచి దానిని కాపాడింది. ఇంతలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో గంగ చనిపోయింది.
జీవ పరిరక్షణ శాస్త్రవేత్త నేహా సిన్హా తన ట్విట్టర్లో ఏనుగు గంగ, దాని పిల్ల ఫొటోతో ఈ కథనాన్ని పోస్ట్ చేశారు. ‘మన కుటుంబాల కోసం చనిపోతామని మనం అంటుంటాం. అయితే ఏనుగులు వాస్తవంగా చేస్తాయి’ అని అందులో వ్యాఖ్యానించారు. కాగా, నేహా సిన్హా పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
మరోవైపు బిడ్డ కోసం ప్రాణాలర్పించిన ఏనుగు గంగ గురించి తెలుసుకున్న నెటిజన్ల మనసు ద్రవించిపోయింది. హృదయ విదారకమైన ఘటన అని పలువురు వ్యాఖ్యానించారు. ‘రక్షించడంలో మనం విఫలమయ్యాం. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయడం లేదు. మనం కూడా మన గొంతును వినిపించలేకపోతున్నాం’ అని ఒకరు స్పందించారు.
ఇది దురదృష్టకరమని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. మనం అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నామని, ప్రకృతి గురించి మరిచిపోతున్నామని పేర్కొన్నారు. చాలా విచారకర ఘటన అంటూ చాలా మంది ఏడుస్తున్న ఎమోజీలను పోస్ట్ చేశారు.