కరీంనగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రైతుల ఉసురు పోసుకుంటున్న బీజేపీకి ఓటెందుకు వెయ్యాలో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు 15 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. శనివారం హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో లేఖను ప్రదర్శించిన ఆయన.. రైతుల ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. రైతులు టీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో తాను వంద కారణాలు చెప్తానని, బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలో ఒక కారణం చెప్పాలని అడిగారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై దేశ రైతాంగమంతా ఏడాది కాలంగా పోరాడుతున్నదని అన్నారు. ఇంత నిర్దయగా, దుర్మార్గంగా, క్రూరంగా ప్రవర్తించే కేంద్రంలోని ప్రభుత్వం ప్రపంచంలోనే మరొకటి లేదని విమర్శించారు. బీజేపీ పారిశ్రామిక వేత్తల పక్షపాతి అని, టీఆర్ఎస్ రైతుల పక్షపాతి అని స్పష్టంచేశారు. కేసీఆర్ సంపద పెంచి రైతులు, బడుగు, బలహీనులకు పంచాలని చూస్తుంటే..కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం బడుగులను కొట్టి బడా పారిశ్రామికవేత్తలకు అందించాలని చూస్తున్నదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే ఇప్పటివరకు బీజేపీ నాయకుల నుంచి స్పందన లేదని అన్నారు. దీన్నిబట్టే బీజేపీ నిజాన్ని అంగీకరించినట్టు అర్థం చేసుకోవచ్చన్నారు.దళితబంధు నిలిపి వేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి రాసిన లేఖను ఆధారాలతో సహా బయటపెట్టినా, ఈటల తెలివిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.బీజేపీ రాస్తే ఒకటి, ఆయన రాస్తే ఒకటా? అని ప్రశ్నించారు. తప్పు చేశామని ఒప్పుకొని దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని బరిలో నిలపడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో కలిసినట్టు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అంగీకరించటం మరో నిదర్శనమని చెప్పారు. మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి ఇక్కడికి వచ్చి కరపత్రాలు పంచడం దేనికి సంకేతమని అడిగారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని బహిరంగంగా తెలిసిపోయిందని స్పష్టంచేశారు.