న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ బిగ్ రిలీఫ్ కల్పించింది. సొంతింటిని నిర్మించుకునే ప్రభుత్వోద్యోగులకు కల్పించిన హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (హెచ్బీఏ) బెనిఫిట్ను వచ్చే ఏడాది (2022) మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. దీనికోసం తీసుకునే రుణంపై 7.9 శాతం వసూలు చేస్తుంది. గతేడాది అక్టోబర్ ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రారంభించింది.
హెచ్బీఏ నిబంధనలు, ఏడవ వేతన కమిషన్ సిఫారసులకు అనుగుణంగా సంబంధిత ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ (రుణం) మంజూరు చేస్తారు. ఈ రుణం 34 నెలల బేసిక్ శాలరీ గానీ, గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు మంజూరవుతుంది.
180 నెలల్లో అంటే 15 ఏండ్లలో ఈ రుణ వసూళ్లు చేస్తారు. మరో ఐదేండ్ల వరకు ప్రతి నెల రుణ వాయిదాపై వడ్డీ ప్రాతిపదికన వసూలు చేస్తారు. సొంతంగా నూతన ఇల్లు లేదా ఫ్లాట్ నిర్మించుకోవడానికి కేంద్రం ఇచ్చే హెచ్బీఏను బ్యాంకు నుంచి అడ్వాన్స్ లేదా రుణం తీసుకుని చెల్లిస్తారు.
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపునకు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇస్తారు. అయితే అడ్వాన్స్ ఇచ్చిన నెల రోజుల్లోపు ఉద్యోగులు తప్పనిసరిగా హెచ్బీఏ యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
శాశ్వత ఉద్యోగులతోపాటు ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఈ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇస్తారు. ఇల్లు లేదా ఇంటి స్థలం కొనుగోలు చేయడానికి ఈ అడ్వాన్స్ ఉపయోగించుకోవచ్చు. సొంతిల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుకు వాడుకోవచ్చు.