ఆ కవి కలంలోంచి పదం రాలితే చాలు పల్లె సంస్కృతి ఉట్టిపడుతుంది. ఆ కవి ‘గల్లీ చిన్నది’ అని రాసినా.. ‘గరీబోళ్ల కథ పెద్దది’ అని పాడినా… చిన్న చిన్న గల్లీల్లో మనం తిరుగుతున్నట్టే, ఆ గరీబోళ్ల కథలు చూస్తున్నట్టే మన కండ్లముందు దృశ్యాలు ఆవిష్కారమవుతాయి. ‘సంతా మా ఊరి సంతా’ అని జానపద జనగీతం రాసినా, చిన్న చిన్న పదాలతో పొదుపుగా గానం చేసినా మనకు వినసొంపు అనిపిస్తుంది. అందుకే యువ రచయితలైనా, యువ గాయకులైనా ఆ కవి, గాయకుడినే ఆదర్శంగా తీసుకుంటారు. ఆయనెవరో కాదు మన కవి తాత్తికుడు, అలతి అలతి పదాలతో గానం చేసే గాయకుడు గోరటి వెంకన్న.
కులం, ప్రాంతం, సామాజికస్థాయి, ఆర్థిక స్థితి ఇవన్నీ మనిషికి అనేక పరిమితులు విధిస్తాయి. అతని ఎదుగుదలకు ముందుగానే అడ్డుగోడలు కడతాయి. ఆ పరిమితులను అధిగమించి, ఆ గోడలు కొంచెం కొంచెం కూల్చుకుంటూ ఎంత ముందుకన్నది మనిషి ఎదుగుదలకు ప్రమాణంగా నిలుస్తుంది. ఆ విధంగా చూస్తే, గోరటి వెంకన్న తన పరిమితులన్నింటినీ దాటుకొని అడ్డు గోడలను కూల్చుకొని తానొక సాహితీ శిఖరంగా నిలబడ్డాడు.
హైదరాబాద్ బుక్ఫెయిర్ ప్రాంగణంలో చిందు ఎల్లమ్మ కళావేదిక మీద ఒక పుస్తకావిష్కరణ జరుగుతూ ఉంటుంది. ప్రసంగాలు కొనసాగుతూ ఉంటాయి. గోరటి వెంకన్న ప్రసంగం కూడా ముగుస్తుంది. ఇంకా ఒకరిద్దరు వక్తలుంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ సభలో, పరిసరాల్లోనూ అక్కడే ఒక యువ సమూహం ఆ వేదికను, సభా ప్రాంగణాన్నీ దట్టంగా కమ్ముకుంటుంది. వారంతా వెంకన్న వేదిక దిగేవరకు వేచి ఉంటారు. కనులారా చాచిన చేతులతో ఎదురు చూస్తారు. వెంకన్న మెట్లు దిగి కిందికి వస్తున్నప్పుడు అతడిని దాదాపుగా తమ చేతులతో ఎత్తుకుని వేదిక దింపుతారు. అతనిని హత్తుకొని పులకిస్తారు. అతనితో ఒక ఫొటో తీసుకోవాలని తహతహలాడుతారు. అతనితో కరచాలనం చేస్తారు. కడుపారా కౌగిలిస్తారు. వేగంగా పలకరిస్తారు. ఉద్వేగంగా సంభాషిస్తారు. హృదయపూర్వకంగా అంతరాంతరాల్లో నుంచి ఆనందాన్ని ప్రకటిస్తూ అతనిని అభినందిస్తారు. అతన్ని విడిచి వెళ్లడానికి వారు ఇష్టపడరు.
వెంకన్న అప్పటికే అలసిపోతాడు, కనుక అలసట చేతా, ఆలస్యమవుతూ ఉండటం చేతా ముందుకు కదులుతాడు. అందరి అభిమానాన్ని స్వీకరిస్తూనే, తనను ఆహ్వానిస్తున్న పుస్తకాల షాపుల వైపు నడుస్తాడు. అప్పటివరకు తనకోసం ఎదురుచూసిన యువత తనతో కూడా నడుస్తుంది. ఆ వెంకన్న అభిమాన యాత్ర అతన్ని కారెక్కించి సాగనంపుతుంది. అతన్ని తెలిసినవారు దూరం నుంచి చూస్తూ కూడా ఆ ఆనందాన్ని తామూ పంచుకుంటారు. అందరిలోనూ ఒక చిరునవ్వు మెరుస్తుంది.
ప్రజల అభిమానానికి పాత్రుడు గనుక ఎవరికేం కొత్తగా అనిపించదు. వెంకన్న ఎక్కడ కనిపించినా పది మంది చుట్టూ కమ్ముకుంటారు. తమ ఇష్టాన్ని, సంతోషాన్ని పలు రూపాల్లో ప్రకటిస్తారు. అదంతా అప్పటికప్పుడు అసంకల్పితంగా జరిగిపోతుంది. అదీ వెంకన్నకున్న ప్రజాబలం. అతని పాటకున్న మ్యాజిక్కు. పదుల ఏండ్లుగా తన పాట ద్వారా అతను సాధించుకున్న అభిమానధనం.
పెద్దలు అంటూ ఉంటారు.‘అవార్డులు రావు, తెచ్చుకోవాలి అని’. అదీ నిజమే. ఊరికే రావు, ఊరిస్తే రావు, ఆశిస్తే రావు. పీడిస్తే రావు. గుర్తించవలసిన వాళ్లు గుర్తిస్తే వస్తాయి. నిరంతరం శ్రమిస్తే, సాహిత్య సేవలో చిరకాలం తరిస్తే, ఎంత రాస్తే అవార్డులు వస్తాయో అప్పుడప్పుడు గోరటి వెంకన్న లాంటి వాళ్లు నిజం నిరూపిస్తారు.
వెంకన్న సాధించిన విజయం ఒక కవితతో, ఒక పాటతో, ఒక ప్రదర్శనతో, ఒక ప్రచురణతోనో సాధ్యమయ్యే విషయం కాదు. నిష్ఠగా కవిత్వం రాయటం, నిరంతరం కవిత కట్టటం, పాట పాడటం, ఆడటం, ప్రదర్శనలు ఇవ్వడం, తాను నమ్మిన మార్గానికి కట్టుబడి ఉండటం, దానియందు నిమగ్నత, దాని పట్ల నిబద్ధత తన బలాన్ని, కలాన్ని, జీవిత కాలాన్ని, తన ప్రజా రాజకీయ పంథాకు అంకితం చేయడం ఇవన్నీ కూడా మన వెంకన్నను ప్రజా కవిని చేయడానికి, ప్రజా వాగ్గేయకారునిగా నిలబెట్టడానికి దోహదం చేశాయి.
‘ఏది సులభమ్ముగ సాధ్యపడదులెమ్ము/ నరుడు నరుడవుట దుష్కరము సుమ్ము’ అని రాశారు మహాకవి దాశరథి ఒక అనువాద కవితలో. ఒక మనిషి నరుడవడమే అంతా సులభం కానప్పుడు నరుడు కవి కావడం, గాయకుడు కావడం, వాగ్గేయకారుడవటం అది మరింత కష్టసాధ్యమని స్పష్టమవుతుంది. తన నిరంతర కఠోర పరిశ్రమ చేత, ఇష్టంగా పడ్డ కష్టం చేత, ప్రజా సాహిత్యరంగంలో, జనం పాటల్లో దశాబ్దాలు అదే ఉత్సాహంతో మున్ముందుకు నడవడం చేత ఎంతో కొంత సాధించగలగడం, తన మార్గంలో తనదైన ముద్ర వేయటం తన పాటల పతాకను జన హృదయాల్లో ఎగురవేయడం సాధ్యమైంది గోరటి వెంకన్నకు.
కులం, ప్రాంతం, సామాజికస్థాయి, ఆర్థిక స్థితి ఇవన్నీ మనిషికి అనేక పరిమితులు విధిస్తాయి. అతని ఎదుగుదలకు ముందుగానే అడ్డుగోడలు కడతాయి. ఆ పరిమితులను అధిగమించి, ఆ గోడలు కొంచెం కొంచెం కూల్చుకుంటూ ఎంత ముందుకన్నది మనిషి ఎదుగుదలకు ప్రమాణంగా నిలుస్తుంది. ఆ విధంగా చూస్తే, గోరటి వెంకన్న తన పరిమితులన్నింటినీ దాటుకొని అడ్డు గోడలను కూల్చుకొని తానొక సాహితీ శిఖరంగా నిలబడ్డాడు. విద్యార్థి దశ నుంచీ వెంకన్నను దగ్గరగా చూసిన వారికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా నిజమేనా అనిపిస్తుంది. ఇదంతా అతను తెలిసి చేసిన పోరాటమా, తెలియకుండానే చేసుకుంటూ వచ్చిన పోరాటమా అనేది చెప్పలేని విధంగా ఉంటుంది. ఒకటే నిరంతర నిమగ్నత, నిబద్ధత. అవి మాత్రమే వెంకన్న విజయానికి మూలసూత్రాలు. అన్నిటికి మించి, జన హృదయానికి తన హృదయానికి అనుసంధానం సాధించటం వెంకన్న సాధించిన భారీ విజయమని గట్టిగా చెప్పవచ్చు.
కులమతాలు గీసుకున్న గీతలలో బందీని కాననీ, తాను విశ్వ నరుడనని మహాకవి జాషువా చెప్పారు. అద్దాని రూపాన్నీ, సారాన్నీ మనం వెంకన్నలో చూడగలుగుతాం. ఏ విధంగా నరుడు విశ్వనరుడు కాగలిగాడో మనం గడిచిన రెండు దశాబ్దాల్లో దర్శించగలం. కులమతాలు, ఆర్థిక అంతస్తులు, సామాజిక దుర్మార్గాలు వంటి అనేక అడ్డుగోడలను, ముళ్ళ బాటలను దాటుకుంటూ ప్రజల గొంతుక ప్రతిధ్వనించిన తన పాటలనే బాటలుగా పరుచుకుంటూ ముందుకుసాగిన గోరటి వెంకన్న మనకాలపు ఆదర్శమూర్తి, శిఖరాయమానుడు, విశ్వనరుడు. విశ్వనరుడు కావడం అంటే ఏమిటో వెంకన్నను చూస్తే అర్థమవుతుంది.
‘పల్లే కన్నీరూ పెడుతుందో’ గోరటి పాటయాత్రలో మొదటి మైలురాయి. అలా మొదలైంది వెంకన్న విజయయాత్ర. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానిది నిర్ణాయక పాత్ర. ‘గల్లీ చిన్నది, ‘సంతా, మా ఊరి సంతా’, ‘అద్దాల అంగడీ మాయా’… ఇవన్నీ కూడా వెంకన్న తాను నిర్మించిన జనగాన మార్గంలో తాను తవ్వించిన పాటబావులు, స్వయంగా నాటిన పాట చెట్లు.
ఆ బావులు గొంతు లేనివాడి గొంతుకలు. తమ గొంతుక సొంతంగా వినిపించుకోలేని పేదవాడి గొంతుకవుతాయి. ఆర్తితో పొడారిపోయిన వాడి గొంతు తడుపుతాయి, దాహం తీరుస్తాయి. ఆ చెట్లు నీడలేని వాడికి నీడనిస్తాయి. అవీ మనకు కలకాలం మిగిలే కవితా కల్పవృక్షాలు. ఆ పాటల ఊటలు చేదుకొని, చెట్ల నీడన విశ్రమించి ఒక సామాన్యుడు సంతోషిస్తాడు. ఉపశమనం పొందుతాడు. అలాంటి సంతోషాలను ఆత్మీయ సరాగాలను మనలాంటి సామాన్యులకు, నిస్సహాయులకు అండగా అందిస్తూనే ముందుకు సాగుతాడు మన కవిగాయక విరాట్మూర్తి గోరటి వెంకన్న. అట్టడుగు ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు నేటికాలం సాహిత్య ప్రతినిధి మన గోరటి వెంకన్న. ఉరిమే ఉత్సాహం, ఉరికే జలపాతం మన గోరటి వెంకన్న!
ఒక పేదవాడు, పలుకుబడి లేనివాడు, సామాన్యుడు, రెక్కల కష్టం తప్ప మరొక పెట్టుబడి లేనివాడు ఎలా ఆలోచిస్తాడో వెంకన్న అలా ఆలోచిస్తాడు. మరోలా చెప్పాలంటే గోరటి వెంకన్న సామాన్యుల తరఫున ఆలోచిస్తాడు. వారిపక్షాన
నిలబడతాడు. వారి ఆకాంక్షలు అతని గేయాల్లో ప్రతిఫలిస్తాయి. అందుకే వెంకన్న విస్తృత ప్రజానీకానికి సాహిత్య ప్రతినిధిగా వెలుగొందాడు.