సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ నగరాన్ని అందంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ అన్ని చర్యలు తీసుకుంటున్నది. నిరంతరం భాగ్యనగరానికి సరికొత్త సొబగులు అద్దడంతో పాటు నగర అందాలకు విఘాతం కలిగిస్తూ ఇబ్బడిముబ్బడిగా ఉండే హోర్డింగ్లను నియంత్రించడం, అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాడ్ ఏజెన్సీలు, రాజకీయ నాయకులపై ఎన్ఫోర్స్మెంట్ ఉక్కుపాదం మోపుతున్నది. ప్రచార ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై తక్షణం చర్యలు చేపడుతున్నది. నిత్యం స్పెషల్ డ్రైవ్ల ద్వారా వ్యాపార సంస్థలు, రాజకీయ నాయకులకు లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు.
జీహెచ్ఎంసీ సరళీకృతమైన అడ్వర్టైజ్మెంట్ పాలసీని తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేస్తున్నది. జీవో 68 ప్రకారం 15 మీటర్ల కంటే ఎత్తు ఉన్న హోర్డింగ్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం లేదు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్లో నిబంధనలను ఉల్లంఘిస్తున్న యాడ్ ఏజెన్సీలకు భారీ జరిమానా విధిస్తున్నారు. అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) నిఘా పెట్టింది. హోర్డింగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. నగరంలో ఏర్పాటు చేసే హోర్డింగ్స్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరుగకుండాఉండేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. వ్యాపార ప్రకటనలతో పాటు హోర్డింగ్ సామర్థ్యం పరీక్షించి సర్టిఫికెట్ను జారీ చేస్తున్నారు