హైదరాబాద్ :గంగపుత్రులు (Gangaputra women ) సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందని ఎమ్మెల్యే ముఠా గోపాల్(MLA Mutha Gopal ) అన్నారు. గంగపుత్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన గంగపుత్ర వర్కింగ్ ఉమెన్స్ సమావేశం తార్నాకలోని సత్యోదయ రిట్రీట్ మందిరంలో ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 200 మందికి పైగా గంగపుత్ర మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, ఆర్థికాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. పిల్లలను ఉన్నత విద్య చదివించి, నేటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
గంగపుత్ర వర్కింగ్ ఉమెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ దేశబోయిన రమాదేవిని, ప్రధాన కార్యదర్శిగా పంపరి మంగ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా 35 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు డాక్టర్ దేశబోయిన రఘు , పాక రవి ప్రసాద్ , మహిళా సంఘం అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ , గంగపుత్ర అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు పాక సృజన్ , శంకర్ , అక్కపల్లి ఉదయ్ కిరణ్ , డి. భాస్కర్ , భూపతి తదితరులు పాల్గొన్నారు.